16-07-2025 12:35:04 AM
కార్మిక సంఘాల జేఏసీ డిమాండ్
నిజామాబాద్ జులై 15: (విజయ క్రాంతి); దేశాన్ని ఒక కుదుపు కుదిపిన సిగాచి పరిశ్రమ బాధిత కుటుంబాలను ప్రభుత్వం ఆదుకోవాలని, పరిశ్రమ యాజమాన్యంపై సత్వరమే క్రిమినల్ కేసులు నమోదు చేయాలని కార్మిక సంఘాల జేఏసీ డిమాండ్ చేసింది. రాష్ట్ర కార్మిక సంఘాల పిలుపుమేరకు కార్మిక సంఘాల జిల్లా జేఏసీ ఆధ్వర్యంలో నిజామాబాద్ జిల్లా కేంద్రంలోని కలెక్టర్ కార్యాలయం ముందు మంగళవారం ధర్నా నిర్వహించి జాయింట్ కలెక్టర్ (రెవెన్యూ) కిరణ్ కుమార్ కు జిల్లా కార్మిక సంఘాల జేఏసీ వినతి పత్రం సమర్పించింది.
ఈ సందర్భంగా సిఐటియు జిల్లా కార్యదర్శి నూర్జహాన్, టియుసిఐ జిల్లా కార్యదర్శి ఎం. సుధాకర్, ఏఐటీయూసీ జిల్లా ఉపాధ్యక్షులు హన్మండ్లు, ఐఎఫ్టియు జిల్లా కార్య దర్శి ఎన్.దాసు, టిఆర్ఎస్ కే వి జిల్లా కార్యదర్శి విజయలక్ష్మి లు మాట్లాడుతూ.. సంగారెడ్డి జిల్లా పాశమైలారం సిగాచి పరిశ్రమలో జరిగిన పేలుడు ఘటనలో మృతుల సంఖ్య 45 కు చేరుకుందన్నారు. యాజమాన్యం నిర్లక్ష్యం కారణంగా అమాయకులైన కార్మికుల నిండు ప్రాణాలు గాల్లో కలిసిపో యాయని, వీరితో పాటు అనేకమంది తీవ్రంగా గాయపడ్డారని వారు ఆవేదన వ్యక్తం చేశారు.
పాశమైలారం సిగాచి పరిశ్రమ పేలుడు ఘటనలో చనిపోయిన, తీవ్రంగా గాయపడిన కార్మికుల కుటుంబాలకు పూర్తి నష్టపరిహారం తక్షణమే చెల్లించాలని కార్మిక సంఘాల జేఏసీ నాయకులు డిమాండ్ చేశారు. ఈ ప్రమాదానికి పరిశ్రమ యాజమాన్యం నిర్లక్ష్యమే ప్రధాన కారణమన్నారు. సిగాచీ పరిశ్రమ యాజమాన్యంపై తాత్సారం చేయకుండా తక్షణమే క్రిమినల్ కేసులు నమోదు చేయాలని డిమాండ్ చేశారు. రాష్ట్రవ్యాప్తంగా ఉన్న చిన్న, మధ్యతరహా, భారీ పరిశ్రమలన్నిటిలో పరిశ్రమల శాఖ సహా, మిగతా సంబంధిత శాఖల సహకారంతో క్షుణ్ణంగా తనిఖీలు చేపట్టాలన్నారు. కార్మికుల భద్రతకు ప్రథమ ప్రాధాన్యం ఇవ్వాలని, కార్మికులకు రక్షణ పరికరాలు అందించాలని డిమాండ్ చే శారు.
ప్రైవేటు, ప్రభుత్వ రంగ పరిశ్రమల్లో పనిచేస్తున్న కార్మికులందరికీ పని ప్రదేశాల్లో పటిష్టమైన రక్షణ చర్యలు చేపట్టాలన్నారు. నిబంధనలు ఉల్లంఘించిన యాజమాన్యాలపై కేసులు నమోదు చేయాలన్నారు. వలస కార్మిక చట్టం అమలుపై సమీక్ష చేయాలన్నారు. వివిధ పరిశ్రమల్లో పనిచేస్తున్న కార్మికులకు, వారి కుటుంబాలకు నివాస తదితర మౌలిక సదుపాయాలు కల్పించేలా యాజమాన్యాలు అన్ని చర్యలు తీ సుకోవాలని ప్రభుత్వాన్ని, పరిశ్రమల శాఖను డిమాండ్ చేస్తున్నామని కార్మిక సంఘాల జేఏసీ నాయకులు అన్నారు.
భవి ష్యత్తులో ఇలాంటి ఘటనలు జరగకుండా ప్రభుత్వం సమగ్ర చర్యలు తీసుకోవాలని, చేతులు దులుపుకునే ప్రయత్నాలు చేస్తే ఆందోళనలను మరింత ఉధృతం చేస్తామని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో టియుసిఐ జిల్లా ఉపాధ్యక్షులు ఎం. వెంకన్న, డి.రాజేశ్వర్, కోశాధికారి సాయరెడ్డి, సిఐటియు జిల్లా నాయకులు కటారి రాములు, రఫీయుద్దీన్, జాదవ్ మురళి, రాములు ఏఐటియుసి జిల్లా ఉపాధ్యక్షులు చక్రపాణి, ఐఎఫ్టియు జిల్లా అధ్యక్షులు జీ.భూమయ్య, ఉపాధ్యక్షులు మల్లికార్జున్, సహాయ కార్యదర్శి శివకుమార్ ఏఐసిసిటియు జిల్లా అధ్యక్షులు ఖాజామొయినుద్దీన్ వివిధ సంఘాల నాయకులు గణేష్, విగ్నేష్, సాయిబాబా, గంగాధర్, భారతి, సురేష్ గంగారం తదితరులు, పాల్గొన్నారు.