calender_icon.png 22 June, 2025 | 5:45 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

విత్తు బాగుంటేనే పంట బాగుండేది!

22-06-2025 12:00:00 AM

- పంటల సాగు, దిగుబడిలో విత్తనమే కీలకం 

- విత్తనానికి భౌతిక, జన్యు స్వచ్ఛతలుండాలి.. 

- విత్తన రకాన్ని బట్టి వివిధ రంగుల్లో ట్యాగులు 

- అనుమతులు ఉన్న దుకాణాల్లోనే విత్తనాలు కొనుగోలు చేయాలి 

- అన్ని వివరాలతో కూడిన కొనుగోలు బిల్లును తప్పక తీసుకోవాలి 

- విత్తనాల ఎంపికలో తగిన జాగ్రత్తలు తీసుకుంటేనే రైతన్నకు మేలు

వానాకాలం సాగు పనులు ప్రారంభం అవుతున్నాయి. దుక్కులు దున్నుకున్న రైతన్న పంట దిగుబడులపై కోటి ఆశలు పెట్టుకొని విత్తనాలను కొనుగోలు చేస్తున్నాడు. ఇదే అదునుగా చూసుకుని ధనార్జనే ధ్యేయంగా వెలిసిన కొన్ని విత్తన తయారీ కేంద్రాలు, వ్యాపార సంస్థలు  మోసపూరిత విధానాలను అవలంబిస్తూ అన్నదాతలను ఆర్థికంగా దివాలా తీయిస్తున్నాయి.

ప్రస్తుతం వానాకాలం సీజన్‌కు రైతులు సమాయత్తం అవుతున్న వేళ విత్తన తయారీలో అనుసరించాల్సిన విధానాలు, వాటి కొనుగోలులో పాటించాల్సిన పద్ధతులపై అవగాహనను పెంపొందించుకోవాల్సిన అవసరం ఉందని నిపుణులు సూచిస్తున్నారు. దీనిలో భాగంగానే విత్తన తయారీ ప్రక్రియ, కొనుగోలులో పాటించాల్సిన జాగ్రత్తల గురించి రైతులకు అవగాహన కోసం ‘విజయక్రాంతి’ ప్రత్యేక కథనం..

- సూర్యాపేట, జూన్ 2౧ విత్తనం అంటే పిండం సహాయ లేదా ఆహార నిల్వ కణజాలంలో పొందుపరచబడింది. విత్తన చట్టం 1966 ప్రకారం విత్తనాలు అంటే.. తినదగిన నూనె గింజలు, పండ్లు, కూరగాయలు, ఇతర ఆహార పంటలకు సంబంధించిన గింజలు. ఏ పంటల సాగులోనైనా విత్తనమే కీలకం. వీటి ఎంపిక కోసం రైతు అన్నిచోట్ల గాలించి చివరికి తనకు అనువైన విత్తనాన్ని ఎంపిక చేసుకుని పొలంలో నాటుకుంటాడు. 

విత్తనమంటే ఇదీ.. 

విత్తనాలు మంచి పరిమాణం, ఆకారం కలిగి ఉండాలి. భౌతిక స్వచ్ఛత అంటే సగం తాలు నిండిన గింజలు, బెరుకులు ఉండకూడదు. అలాగే జన్యు స్వచ్ఛత ఉండాలి. అంటే ఒక స్వచ్ఛమైన రకం విత్తనాన్ని నాటితే దాని నుంచి వంద శాతం అవే రకం విత్తనాలు రావాలి. అధేవిధంగా మట్టిపెడ్డలు, ఇసుక, దుమ్ము వంటి జడపదార్థాలు కానీ, కలుపు విత్తనాలు, ఇతర పంటలు విత్తనాలు గానీ ఉండకూడదు. మొలక శాతం 80 శాతం కంటే ఎక్కువ ఉండాలి.

విత్తనాల తయారీ ఇలా.. 

ఏదైనా కొత్త విత్తనాన్ని రూపొందించిన శాస్త్రవేత్తలు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల ఆధీనంలోని పరిశోధనా స్థానంలోనే బ్రీడర్ విత్తనాలను తయారుచేస్తారు. ఈ విత్తన సంచులకు పసుపు రంగు ట్యాగ్ వేస్తారు. బ్రీడర్ విత్తనాలను పరిశోధనా స్థానాల్లో, రాష్ట్ర విత్తనాభివృద్ధి సంస్థ ఆధ్వర్యంలో, ఇతర ప్రభుత్వ, ప్రైవేట్ క్షేత్రాలలో నాటి సాంకేతిక నిపుణుల పర్యవేక్షణలో ఫౌండేషన్ విత్తనాలను ఉత్పత్తి చేస్తారు. ఈ విత్తనపు సంచులకు తెలుపు రంగు ట్యాగ్‌లు వేస్తారు. వీటినుంచి రైతు పొలాలలో సీడ్ సర్టిఫికేషన్ వారి పర్యవేక్షణలో వచ్చే దిగుబడులే సర్టిఫైడ్ విత్తనాలు. ఈ విత్తనపు సంచులకు నీలిరంగు ట్యాగ్ వేస్తారు. ఈ సర్టిఫైడ్ విత్తనాల నుంచి వచ్చినవే ట్రూత్ పుల్ సీడ్. వీటికి ఆకుపచ్చ రంగు ట్యాగ్ ను వేయాలి. ఈ విత్తనాలన్నింటినీ గాలి సోకే గన్నీ బ్యాగుల్లోనే నిల్వచేయాలి. 

విత్తన తయారీకేంద్రాల అనుమతి పొందాలంటే..

విత్తనాల తయారీ కేంద్రానికి అనుమతి పొందాలనుకునేవారు తమకున్న అనుభవాన్ని, దానికి అనువైన ప్రాంతాన్ని తెలియపరుస్తూ మండల వ్యవసాయాధికారికి దరఖాస్తు చేసుకోవాలి. అక్కడి నుంచి ఏడీఏకు తదుపరి జేడీఏకు ఆ దరఖాస్తు చేరి పూర్తిస్థాయి పరిశీలనలు చేసిన తదుపరి విత్తనా తయారీకి అనుమతులను అందిస్తారు..

అనుమతులు పొందిన తర్వాత ఏం చేస్తారంటే.. 

అనుమతి పొందిన తర్వాత విత్తన తయారీకేంద్రాలు యూనివర్సిటీ నుంచి తెచ్చుకున్న బ్రీడర్ విత్తనాలను నాటే క్షేత్రాల వివరాలను రాష్ట్ర విత్తన ధ్రువీకరణ సంస్థలో నమోదు చేసుకోవాలి. అలా నమోదు చేసుకున్న క్షేత్రాల పరిశీలన నిమిత్తం విత్తన ధ్రువీకరణ సంస్థ అధికారులు కొంత మొత్తంలో ఫీజు వసూలు చేస్తారు.

అనంతరం బ్రీడర్ సీడ్ నాటిన క్షేత్రాలను వారు పరిశీలించి వాటి దిగుబడిని దృష్టిలో ఉంచుకుని ఫౌండేషన్ సీడ్ సంచులకు అవసరమైన ట్యాగ్‌లను ఇస్తారు. వీటిని విత్తనపు సంచులకు అమర్చి విత్తన తయారీ కేంద్రాల యజమానులు వాటిని అమ్ముకుంటారు. లేదా ఫౌండేషన్ సీడ్‌ను మరలా నాటి వాటిని సైతం విత్తన ధ్రువీకరణ సంస్థలో నమోదు చేసుకొని తిరిగి సర్టిఫైడ్ విత్తనానికి సంబంధించిన ట్యాగ్‌ను పొంది వాటిని సంచులకు అమర్చి రైతులకు అమ్ముకోవాల్సి ఉంటుంది.

నోటిఫైడ్, నాన్‌నోటిఫైడ్ విత్తనాల్లో తేడా..

విత్తనాల్లో ప్రభుత్వపరంగా విడుదల అయ్యేవి, ప్రైవేటుపరంగా విడుదల అయ్యేవి ఉంటాయి. ప్రభుత్వపరంగా రూపొందించిన రకాలు నోటిఫైడ్ పేరిట మార్కెట్లోకి వస్తాయి. ప్రైవేటు సంస్థలు రూపొందించిన విత్తనాలను నాన్ నోటిఫైడ్ పేరిట మార్కెట్లోకి విడుదల చేస్తాయి. నోటిఫైడ్ విత్తనాల నాణ్యత, పంపిణీ ప్రమాణాలు 1966నాటి చట్టం పరిధిలోకి వస్తాయి. నోటిఫైడ్ విత్తనాలు నాణ్యత ప్రమాణాలకు అనుగుణంగా లేనట్లయితే ఉత్పత్తిదారులపై, పంపిణీదారులపై చట్టరీత్యా చర్యలు తీసుకోవచ్చు.      

మంచి విత్తనాలను గుర్తించడానికి కొన్ని విధానాలు 

స్వచ్ఛత: విత్తనాలు ఇతర మొక్కల విత్తనాలు, కలుపు విత్తనాలు, లేదా ఇతర మలినాల నుంచి పూర్తిగా వేరుగా ఉండాలి. 

పరిమాణం, ఆకారం: విత్తనాలు అన్ని ఒకే పరిమాణంలో, ఆకారంలో ఉండాలి. 

మొలకశక్తి: విత్తనాలు మంచి మొలక శక్తిని కలిగి ఉండాలి, అంటే వాటిని మొలక కట్టినప్పుడు అవి 80 శాతం కన్నా ఎక్కువ మొలకెత్తే సామర్థ్యం కలిగి ఉండాలి. 

తేమ శాతం: విత్తనాలలో తేమ శాతం తక్కువగా ఉండాలి. అంటే 13 శాతం వరకే ఉండాలి. ఎందుకంటే ఎక్కువ తేమ ఉంటే చీడపీడలు, తెగుళ్లతో విత్తనాలు పాడైపోయే అవకాశం ఉంది. 

వ్యాధులు, తెగుళ్లు: విత్తనాలు వ్యాధులు, తెగుళ్ల బారిన పడకుండా వాటికి తట్టుకునే సామర్థ్యం కలిగి ఉండాలి. 

నీటి పరీక్ష: విత్తనాలను నీటిలో వేసి చూస్తే, ఆరోగ్యకరమైన విత్తనాలు మునిగిపోతాయి, ఆరోగ్యంగా లేనివి తేలుతాయి.

రైతు విత్తనాల కొనుగోలులో తీసుకోవాల్సిన జాగ్రత్తలు.. 

- వ్యవసాయశాఖ నుంచి అనుమతి పొందిన దుకాణాల్లోనే విత్తనాలను కొనుగోలు చేయాలి.

- ప్రభుత్వ గుర్తింపు పొందిన సంస్థలు ధ్రువీకరించిన వాటినే ఎంచుకోవాలి.

- కొనుగోలు చేసిన విత్తనాలకు బిల్లు తప్పనిసరిగా తీసుకోవాలి.

- బిల్లుపై రైతు చిరునామా, గడువు తేదీ, సంస్థ పేరు లేబుల్, పరిమాణం, విత్తనం ధర, అమ్మిన వారి సంతకం వంటి వివరాలు తప్పనిసరిగా ఉండాలి.

- విత్తనబస్తాలపై ముద్రించిన ధ్రువపత్రం బిల్లు తమ పంట చేతికి వచ్చే వరకు రైతులు భద్రపరుచుకోవాలి.           

- సంచులపై విత్తన ఉత్పత్తి విక్రయదారుడి పేరు, చిరునామా, లాట్ నంబర్, ప్యాకింగ్ తేదీ తదితర వివరాలు తప్పక ఉండాలి.

- ట్యాగ్‌లపై ఉన్న క్యూఆర్ కోడ్ స్కాన్ చేసి ఉత్పత్తిదారుడి, విత్తన రకం పూర్తి వివరాలను తెలుసుకోవచ్చు.

- విత్తనాలను కొన్న వెంటనే మొలక శాతం పరీక్షించుకోవాలి. కనీసం 80 శాతానికి పైగా ఉంటేనే విత్తుకోవాలి.                            

- విత్తన సంచులను పంట కోతకు వచ్చే వరకు దాచుకోవాలి.           

- కొన్ని ప్రాంతాల్లో లైసెన్స్ లేని అనధికార విత్తన విక్రయదారులు తెల్ల సంచుల్లో నకిలీ విత్తనాలను విక్రయించే అవకాశం ఉన్నందున వాటి సమాచారాన్ని తక్షణమే అధికారులకు తెలియజేయాలి.

- కల్తీ విత్తనాలతో మోసపోతే వెంటనే వ్యవసాయ అధికారులకు పోలీసులకు ఫిర్యాదు చేయాలి. 

అధికారుల తనిఖీలు..

అనుమతులు పొందిన విత్తన తయారీ కేంద్రంలో తయారైన విత్తనాలను వ్యవసాయాధికారులు తనిఖీలు నిర్వహించి పరిశీలనలు చేస్తారు. ఇందులో విత్తనాలు ఎలా ఉన్నాయి.. వాటిని ఏ సంచులలో నిల్వ చేశారు.. సంచులపై విత్తనాలకు సంబంధించిన వివరాలను నమోదు చేశారా? వాటికి ఏ లాట్ నెంబర్లు కేటాయించారు అనే వివరాలను పరిశీలించాల్సి ఉంటుంది. అలాగే స్టాక్ రిజిష్టర్‌ను పరిశీలించి వాటిలో ఎన్ని నిల్వ ఉన్నాయి. ఎన్ని విక్రయించారు అనేది గమనించాల్సి ఉంటుంది.

పరిహారం పొందవచ్చు ఇలా.. 

కల్తీ విత్తనాల వల్ల నష్టపోయిన రైతులకు పరిహారం పొందటానికి అవకాశం ఉంటుంది. విత్తనాల ప్రమాణాల కన్నా తక్కువ మొలక శాతం ఉండి దిగుబడిపై ప్రభావితం చూపినట్లు సంబంధిత కంపెనీపై మండల వ్యవసాయ అధికారి ద్వారా జిల్లా వ్యవసాయ సంచాలకులకు ఫిర్యాదు చేయవచ్చు. అధికారుల ద్వారా నష్టపరిహారం తగిన విధంగా అందిస్తారు.

డిమాండ్ ఉన్న రకాలను ఎంచుకోవాలి..

నమ్మకమైన సంస్థ నుంచి బ్రీడర్ / ఫౌండేషన్ విత్తనాలను తీసుకొని వాటి ద్వారా పంట పండిస్తూ 3, 4 తరాల వరకు విత్తనాలను రైతులే స్వయంగా తయారీ చేసుకోవచ్చు. ఇలా తయారీ చేసుకోవడం వల్ల రైతులకు విత్తన ఖర్చు తగ్గుతుంది. దీనికి ఏ విధమైన శాస్త్ర పరిజ్ఞానం అవసరం లేదు. మార్కెట్లో డిమాండ్ ఉన్న రకాలను ఎంచుకోవడం ద్వారా రైతులు పండించిన పంటలను అమ్ముకోవడంలో ఎటువంటి ఇబ్బందులు ఎదురుకావు.

అలాగే తక్కువ రేటుకు దొరుకుతున్నాయనే ఆలోచనతో రైతులు ఏవీపడితే అవి కొనకుండా అన్ని రకాల పరిశీలనలు చేసి నాణ్యమైన విత్తనాలను కొనుగోలు చేయడం మంచిది. విత్తన సంచులపై ట్యాగ్‌లు చూసిన తర్వాతే విత్తనాలు కొనుగోలు చేయాలి. ఆదేవిధంగా తెరిచి ఉన్న సంచులను మార్కెట్లో కొనుగోలు చేయడం సరికాదు. అన్ని సక్రమంగా ఉన్న విత్తనాలను కొనుగోలు చేసి వాటిని సాగు చేయడం వల్లనే రైతులు మంచి ఫలితాలను సాధించగలుగుతారు.

 నరేశ్, పంటల విభాగం శాస్త్రవేత్త, కేవీకే గడ్డిపల్లి, సూర్యాపేట జిల్లా