06-10-2025 12:00:00 AM
ఆర్.ఎస్.ఎస్ విభాగ్ సంఘచాలక్ గార్లపాటి వెంకటయ్య
నల్గొండ రూరల్, అక్టోబర్ 5: హిందూ సంఘటన ద్వారానే దేశం రక్షించబడుతుందని హిందువుల ఐక్యతకు పంచ పరివర్తన్ ద్వారా ఆర్ఎస్ఎస్ కృషి చేస్తుందని ఆర్ఎస్ఎస్ నల్లగొండ విభాగ్ సంఘ చాలక్ గార్లపాటి వెంకటయ్య పేర్కొన్నారు. ఆర్ఎస్ఎస్ వందేళ్ల స్థాపన ఉత్సవాలలో భాగంగా నల్లగొండ నగర శాఖ ఆద్వర్యంలో స్థానిక మేకల అభినవ్ స్టేడియం నుండి నాగార్జున కళాశాల వరకు నల్లగొండ నగర పురవీధుల గుండా నగర స్వయంసేవకులు శనివారం పద సంచలన్ నిర్వహించారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ 1925లో ప్రారంభమై నేడు దేశవ్యాప్తంగా విస్తృత శాఖలతో, విభిన్న రంగాలలో దేశభక్తి పూరిత, హిందుత్వ ఆధార సంస్థలతో ప్రపంచంలోని అనేక దేశాలలో పనిచేస్తుందని చెప్పారు, హిందువులలో ఐక్యతను శాఖ ఆధారంగా సంఘము పెంపొందిస్తుందని పేర్కొన్నారు. హిందుత్వం జీవన విధానం, విశ్వశాంతికి ఆధారం అని ప్రపంచంలోని వివిధ మతాలను సమన్వయపరిచే సనాతన జీవన విలువలు హిందుత్వంలో ఉన్నాయని వివరించారు. దేశ అభివృద్ధి కొరకు హిందువులు పంచ పరివర్తన కోసం పాటుపడాలని సూచించారు.
సామాజిక సమరసత,కుటుంబ జీవన విలువలు, స్వ ఆధారిత జీవనం పర్యావరణ పరిరక్షణ,పౌర విధులు ప్రతి ఒక్కరి కుటుంబంలో పాటించబడాలని అన్నారు. ఆర్ఎస్ఎస్ జన్మ శతాబ్దిలో భాగంగా రాబోయే రోజులలో ఇంటింటి జనజాగ రణ చేపట్టబోతుందని ఆర్ ఎస్ ఎస్ ఈ దేశ పరిరక్షణకు, వ్యక్తి నిర్మాణానికి, హిందుత్వ పరిరక్షణకు చేపడుతున్న చర్యలు అందరూ స్వాగతించాలని కోరారు.
దేశ వ్యాప్తంగా చేస్తున్న సేవా కార్యక్రమాలు ఆర్ ఎస్ ఎస్ ను ప్రజలకు చేరువ చేసిందని ఆయన చెప్పారు. ఈ కార్యక్రమంలో విభాగ్ సాహ సంగచాలక్ ఇటికాల కృష్ణయ్య, నగర సంఘచాలక్ దోసపాటి శ్రీనివాస్ విభాగ్ ప్రచారక్ కాసం సత్యనారాయణతదితరులు పాల్గొన్నారు.