20-06-2025 07:26:31 PM
మందమర్రి (విజయక్రాంతి): మండలంలోని పొన్నారం గ్రామానికి చెందిన టిఆర్ఎస్ నాయకులు గ్రామ మాజీ ఉపసర్పంచ్ తమ ఇద్దరు కూతుళ్లను ప్రభుత్వ పాఠశాలలో చేర్చి పలువురికి ఆదర్శంగా నిలిచారు. బడిబాట కార్యక్రమంలో భాగంగా ఇటీవల పొన్నారం జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల ఉపాధ్యాయులు తమ పిల్లలను ప్రభుత్వ పాఠశాలలో చేర్చాలని కోరడంతో తన ఇద్దరు కూతుళ్లను ప్రభుత్వ పాఠశాలలో శుక్రవారం చేర్పించారు. గ్రామంలో పెద్ద రైతుగా, ఆర్థికంగా బలంగా ఉన్న పెంచాల మధు తన ఇద్దరు కూతుర్లను ప్రైవేటు కార్పొరేట్ పాఠశాలల్లో చదివించే ఆర్థిక స్తోమత ఉన్నప్పటికీ ప్రభుత్వ పాఠశాలల్లోనే నాణ్యమైన విద్య ఉంటుందని తన ఇద్దరు కూతుళ్లను ప్రభుత్వ పాఠశాలలో చేర్పించారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ... ప్రభుత్వ పాఠశాలలోనే నాణ్యమైన ఉచిత విద్య లభిస్తుందని అర్హులైన ఉపాధ్యాయులతో విద్యాబోధన జరుగుతుందని ప్రతి ఒక్కరు ప్రభుత్వ పాఠశాలలను సద్వినియోగం చేసుకొని తమ పిల్లలను ఉన్నత విద్యావంతులుగా తీర్చిదిద్దాలని ఆయన కోరారు. ప్రభుత్వ పాఠశాల బలోపేతానికి గ్రామస్తులు ముందుకు వచ్చి తమ పిల్లలను ప్రభుత్వ పాఠశాలలను చదివించాలని కోరారు. కాగా గ్రామంలోనే ప్రముఖుడైన పెంచాల మధు తన ఇద్దరు కూతుళ్లను ప్రభుత్వ పాఠశాలలో చేర్పించడం పట్ల గ్రామస్తులు హర్షం వ్యక్తం చేశారు. ఆయనను పాఠశాల ప్రధానోపాధ్యాయులు, మండల విద్యాధికారి దత్తమూర్తి, ఉపాధ్యాయులు అభినందించారు.