13-05-2025 04:44:22 PM
మహబూబాబాద్ (విజయక్రాంతి): కార్మిక నాయకులు స్వర్గీయ తోట భిక్షం స్ఫూర్తితో జిల్లాలో కార్మిక ఉద్యమాన్ని మరింత బలోపేతం చేయాలని, కేంద్ర ప్రభుత్వ విధానాలకు వ్యతిరేకంగా ఈనెల 20న జరిగే దేశవ్యాప్త సార్వత్రిక సమ్మెను జయప్రదం చేయాలని సిఐటియు(CITU) జిల్లా అధ్యక్ష కార్యదర్శులు ఆకుల రాజు, కుంట ఉపేందర్ పిలుపునిచ్చారు. దివంగత సిఐటియు జిల్లా ఉపాధ్యక్షులు తోట భిక్షం 4వ వర్ధంతి సందర్భంగా సోమవారం మహబూబాబాద్ జిల్లా కేంద్రంలో ఏర్పాటు చేసిన స్థూపం వద్ద అరుణ పతాకాన్ని తోట శ్రీనివాస్ ఆవిష్కరించారు.
అనంతరం ఆయన చిత్రపటానికి పూలమాల వేసి నివాళులు అర్పించారు. ఈ క్రమంలో వారు మాట్లాడుతూ.. తోట భిక్షం క్రమశిక్షణ కలిగిన కార్మిక నాయకుడని, ఎన్ని కేసులు, నిర్బంధాలు ఎదురైనప్పటికీ అధిగమించి ప్రజల పక్షాన పని చేశారని కొనియాడారు. కష్టజీవులు శ్రమజీవుల పక్షాన కార్మిక వర్గ దృక్పథంతో పని చేసిన నాయకుడు తోట భిక్షం అని కొనియాడారు. బిజెపి ప్రభుత్వం కార్మిక వ్యతిరేక విధానాలను ఆవలంబిస్తుందని, ఈ విధానాలకు వ్యతిరేకంగా ఈ నెల 20న జరిగే దేశవ్యాప్త సార్వత్రిక సమ్మెను జయప్రదం చేయాలని పిలుపునిచ్చారు. ఈ సభలో సిపిఎం జిల్లా కార్యదర్శి వర్గ సభ్యులు గుణగంటి రాజన్న, సమ్మెట రాజమౌళి, రావుల రాజు, హేమ నాయక్, తోట యాకయ్య, మల్లయ్య, కోటేశ్వరరావు, సుధాకర్ వెంకన్న పాల్గొన్నారు.