జాతీయ చైతన్యానికి జీవనాడి
ప్రపంచ చరిత్రను పరిశీలిస్తే అనేక నాగరికతలు పుట్టాయి, ఎదిగాయి, కనుమరుగయ్యాయి. కానీ, వేల సంవత్సరాలుగా భారతీయ సనాతన సం స్కృతి నిత్యనూతనంగా నిలిచి ఉండడానికి ఒక ప్రధాన కారణం గురు పరంపర. ఈ పరంపరే భారతీయ జ్ఞానానికి, ధర్మానికి, సంస్కృతికి, జాతీయ చైతన్యానికి జీవనాడి. ఆ మహోన్నత గురు సంప్రదాయాన్ని స్మరించుకునే పవిత్ర పర్వదినమే గురు పౌర్ణమి. ఆషాఢ శుద్ధ పౌర్ణమి రోజున వేదవ్యాస మహర్షిని స్మరిస్తూ దేశమంతా గురు పూజలు నిర్వహించడం భారతీ య సంప్రదాయానికి ప్రతీక.
వేదాలను విభజించి, మహాభారతాన్ని రచించి, అష్టాదశ పురాణాలను ప్రపంచానికి అందించిన వేదవ్యాస మహర్షి భారత జ్ఞాన సంపదకు శాశ్వత దిక్సూచి. అందుకే ఈ రోజును వ్యాస పౌర్ణమి అని కూడా పిలుస్తారు. భారతీయ దర్శనంలో గురువు వ్యక్తిని సంస్కరించే మహాశక్తి. అజ్ఞానాన్ని తొలగించి ధర్మజీవనానికి నడిపించే మార్గదర్శి. అందుకే ఉపనిషత్తులు ‘ఆచార్య దేవో భవ’ అని బోధించాయి. తల్లిదండ్రులు శరీరానికి జన్మనిస్తే, గురువు వ్యక్తిత్వానికి, ఆధ్యాత్మిక చైతన్యానికి జన్మనిస్తారు. భారతదేశంలోని నాలుగు ప్రాచీన ధార్మిక సంప్రదాయాలైన హిందూ, బౌద్ధ, జైన, సిక్కు ధర్మాలు అన్నీ గురు తత్వాన్ని అత్యున్నత స్థాయిలో ప్రతిష్ఠించాయి.
హిందూ ధర్మంలో గురువు పరబ్రహ్మ స్వరూపుడు. వేదాలు, ఉపనిషత్తులు, భగవద్గీత, గురుగీత గురువు మహిమను విస్తృతంగా వివరిస్తాయి. ఆదిశంకరాచార్యులు, శ్రీరామానుజాచార్యులు, శ్రీమధ్వాచార్యులు, శ్రీరామకృష్ణ పరమహంస, స్వామి వివేకానంద వంటి మహనీయులు గురుశిష్య పరంపర ద్వారా భారతీయ ఆధ్యాత్మిక వైభవాన్ని ప్రపంచానికి పరిచయం చేశారు. బౌద్ధ ధర్మంలో భగవాన్ గౌతమ బుద్ధుడు జగద్గురు. ఆయన బోధించిన కరుణ, అహింస, ప్రజ్ఞ, మధ్యమ మార్గం మానవాళికి శాశ్వత మార్గదర్శనం. జైన ధర్మంలో తీర్థంకరులు, ముఖ్యంగా భగవాన్ మహావీరుడు అహింస, అపరిగ్రహం, సత్యం, సంయమనం వంటి విలువల ద్వారా మానవాళిని నడిపించారు. గురువు చూపిన మార్గమే మోక్షానికి ఆధారం అని జైన సంప్రదాయం విశ్వసిస్తుంది.
సిక్కు ధర్మంలో గురు నానక్ దేవ్ జీతో ప్రారంభమైన గురు పరంపర గురు గోబింద్ సింగ్ జీ వరకు ధర్మరక్షణ, సమానత్వం, సేవ, త్యాగానికి ప్రతీకగా నిలిచింది. ఈ నాలుగు భారతీయ ధార్మిక సంప్రదాయాలు వేర్వేరు ఆచారాలను అనుసరించినప్పటికీ, ఒకే శాశ్వత సత్యాన్ని ప్రకటిస్తున్నాయి. గురువు లేక జ్ఞానం లేదు.. జ్ఞానం లేక ధర్మం లేదు.. ధర్మం లేక సమాజానికి శాంతి, శ్రేయస్సు లభించవు. నేడు ప్రపంచం సాంకేతికంగా అభివృద్ధి చెందుతున్నా, మానవ విలువల సంక్షోభాన్ని ఎదుర్కొంటోంది. కుటుంబ వ్యవస్థ బలహీనపడుతోంది. యువతలో దిశాహీనత పెరుగుతోంది.
ఈ పరిస్థితుల్లో భారతీయ గురు-శిష్య పరంపర మళ్లీ సమాజానికి మార్గదర్శకంగా నిలవాల్సిన అవసరం ఉంది. విశ్వహిందూ పరిషత్ అభిప్రాయం ప్రకారం, సనాతన ధర్మ పరిరక్షణకు దేవాలయాల నిర్మాణం ఎంత అవసరమో, గురు పరంపర పరిరక్షణ అంతకంటే అవసరం. ధర్మాన్ని కాపాడేది శాస్త్రం.. శాస్త్రాన్ని బోధించేది గురువు.. గురువులను గౌరవించే సమాజమే శాశ్వతంగా నిలుస్తుంది. అందువల్ల ప్రతి హిందూ కుటుంబంలో పిల్లలకు గురువుల పట్ల గౌరవం, భారతీయ సంస్కృతి, శాస్త్రాలు, ఇతిహాసాలను పరిచయం చేయడం కాలానుగుణ ధర్మబాధ్యత.
భారతదేశం ప్రపంచానికి ‘విశ్వగురు’గా నిలవాలంటే ఆర్థిక లేదా సాంకేతిక శక్తి సరిపోదు. విలువలతో కూడిన విద్య, ధర్మబద్ధమైన జీవనం, గురు-శిష్య సంప్రదాయం పునరుజ్జీవనం అనివార్యం. ఈ గురు పౌర్ణమి సందర్భంగా ప్రతి హిందూ కుటుంబం తమ జీవితాన్ని ప్రభావితం చేసిన గురువులను స్మరించాలి. గురు పౌర్ణమి సందర్భంగా జగద్గురువులందరికీ, దేశ ధర్మాన్ని, సంస్కృతిని, జాతీయ చైతన్యాన్ని తరతరాలకు అందించిన ఋషులు, ఆచార్యులు, సంత్ మహనీయులందరికీ శతకోటి ప్రణామాలు. వారి ఆశీస్సులతో ధర్మో రక్షతి రక్షితః అనే శాశ్వత సందేశం ప్రతి భారతీయుని జీవితంలో సాకారం కావాలని ఆకాంక్షిద్దాం.
వ్యాసకర్త: ధర్మాచార్య సంపర్క ప్రముక్, తెలంగాణ విశ్వహిందూ పరిషత్, 9912975753
పగుడాకుల బాలస్వామి






