20-12-2025 01:39:54 AM
సూర్యాపేట డీఎస్పీ ప్రసన్నకుమార్
సూర్యాపేట, డిసెంబర్ 19 (విజయక్రాంతి): 21వ తేదీన నిర్వహించనున్న జాతీయ మెగా లోక్ అదాలత్ను కక్షిదారులు సద్వినియోగం చేసుకోవాలని సూర్యాపేట డీఎస్పీ ప్రసన్న కుమార్ అన్నారు. జిల్లా కేంద్రంలో శుక్రవారం అయిన విలేకరులతో మాట్లాడుతూ.. జాతీయ మెగా లోక్ అదాలత్ ద్వారా ఇరువైపుల సమ్మతితో, తక్కువ సమయంలో సమస్యలను పరిష్కరించుకునే అవకాశం ఉంటుందన్నారు.
కోర్టు కేసుల వల్ల కలిగే సమయ నష్టం, ఖర్చులు తగ్గుతాయని పేర్కొన్నారు. ఈ లోక్ అదాలత్ లో సివిల్ తగాదాలు, ఆస్తి విభజన కేసులు, వైవాహిక జీవితం, కుటుంబ సమస్యలకు సంబంధించిన కేసులు, డ్రంకన్ డ్రైవ్ కేసులు, మోటారు వాహన చట్ట ఉల్లంఘనలు, చెక్ బౌన్స్ కేసులు, బ్యాంకు రికవరీ కేసులు, విద్యుత్ చౌర్యం తదితరాలను పరిష్కరించుకోవచ్చు అన్నారు. కక్షలు పెంచుకుని కోర్టుల చుట్టూ తిరుగుతూ సమయాన్ని వృథా చేసుకోవద్దని, రాజీ మార్గం ద్వారా శాంతియుతంగా సమస్యలను పరిష్కరించుకోవాలన్నారు. న్యాయశాఖ అందిస్తున్న ఈ గొప్ప అవకాశాన్ని ప్రజలందరూ వినియోగించుకోవాలన్నారు.