13-05-2025 05:52:05 PM
కార్మిక సంఘాల జెఎసి..
మందమర్రి (విజయక్రాంతి): కేంద్ర ప్రభుత్వం కార్మిక వ్యతిరేక విధానాలను నిర్వహిస్తూ జాతీయ కార్మిక సంఘాలు ఇచ్చిన దేశవ్యాప్త సమ్మెను ఈ నెల 20న సింగరేణిలో విజయవంతం చేయాలని కార్మిక సంఘాల జేఏసీ నాయకులు కోరారు. పట్టణంలోని ఏఐటీయుసీ కార్యాలయంలో నిర్వహించిన జేఏసీ కార్మిక సంఘాల సమావేశంలో నాయకులు మాట్లాడారు. కేంద్రంలోని మోడీ ప్రభుత్వం 44 కార్మిక చట్టాలను 4 కోడ్ లుగా విభజిస్తూ కార్మికులను కట్టు బానిసలుగా చేస్తున్న కార్మిక చట్టాల మార్పును వెంటనే ఉపసంహరించుకొని, పాత పద్ధతిలో 44 కార్మిక చట్టాలను కొనసాగించాలని వారు డిమాండ్ చేశారు.
కార్మిక చట్టాల మార్పును నిరసిస్తూ గతంలో అనేక పోరాటాలు చేసి ప్రభుత్వం దృష్టికి తీసుకుపోయినప్పటికి పట్టించుకోకుండా కేంద్ర ప్రభుత్వం ఏకపక్షంగా వ్యవహరిస్తూ కార్పొరేట్ శక్తులకు ప్రభుత్వ రంగ సంస్థలను కట్ట పెట్టడానికి నాలుగు లేబర్ కోడ్ లను తీసుకువస్తుందని వారు మండిపడ్డారు. ప్రభుత్వ రంగ సంస్థలను ప్రైవేటు శక్తులకు దార దత్తం చేయడాన్ని నిరసిస్తూ ఈనెల 20న ఒక్కరోజు టోకెన్ సమ్మెలో సింగరేణి కార్మికులు పాల్గొని కేంద్ర ప్రభుత్వానికి సమ్మె ద్వారా తగిన బుద్ధి చెప్పాలని వారు కోరారు.
ఈ సమావేశంలో సింగరేణి కాలరీస్ వర్కర్స్ యూనియన్ (AITUC) ప్రధాన కార్యదర్శి కొరిమి రాజ్ కుమార్, నాయకులు ఎండీ అక్బర్ అలీ, శైలేంద్ర సత్యనారాయణ, దాగం మల్లేష్, భీమనాథుని సుదర్శనం, కంది శ్రీనివాస్, సింగరేణి కాలరీస్ ఎంప్లాయిస్ యూనియన్ (CITU) అధ్యక్షులు తుమ్మల రాజిరెడ్డి, నాయకులు సాంబారు వెంకటస్వామి, వడ్లకొండ ఐలయ్య, ఐఎన్టియుసి ఏరియా ఉపాధ్యక్షులు దేవి భూమయ్య, నాయకులు చంద్రశేఖర్, టీబీజీకేఎస్ ఏరియా ఉపాధ్యక్షులు మేడిపెల్లి సంపత్, నాయకులు ఓ రాజశేఖర్, శివ నాయక్, జి రామచందర్ లు పాల్గొన్నారు.