18 April, 2026 | 8:33 AM

సింగరేణి సీఎండీ ఎన్ బలరామ్ కు ఎక్స్​లెన్స్ పురస్కారం..

13-05-2025 06:01 PM

టిబిజికెయస్ హర్షం..  

మణుగూరు (విజయక్రాంతి): బహుముఖ విస్తరణ ప్రణాళికలతో సింగరేణి సంస్థ ఉన్నతికి కృషి చేస్తున్న సంస్థ ఛైర్మన్, యండి ఎన్.బలరాంకు ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇండస్ట్రియల్ ఇంజినీరింగ్(Indian Institute of Industrial Engineering) ప్రతిష్టాత్మక పర్ఫార్మెన్స్ ఎక్స్​లెన్స్ పురస్కారం లభించడం పట్ల మణుగూరు ఏరియా టిబిజికెయస్ వైస్ ప్రెసిడెంట్ నాగెల్లి వేంకటేశ్వర్లు మంగళవారం ఒక ప్రకటనలో హర్షం వ్యక్తం చేశారు.

మేఘాలయ రాజధాని షిల్లాంగ్ లో జరిగిన 25వ జాతీయ స్థాయి ముఖ్య కార్యనిర్వహణ అధికారుల సమావేశంలో ఈ అవార్డును అందుకొన్నారు. సీఎండీ ఎన్.బలరామ్ తరఫున అడ్మినిస్ట్రేటివ్ మేనేజర్, ఐఐఐఈ నేషనల్ కౌన్సిల్ సభ్యుడు భాస్కర్ ఈ పురస్కారాన్ని స్వీకరించి ఆ అవార్డును మంగళవారం నాడు సింగరేణి భవన్ లో సంస్థ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ కోల్ మూమెంట్ ఎస్ డి ఎం సుభానీ, అడ్మినిస్ట్రేటివ్ మేనేజర్ శ్రీ భాస్కర్ చేతుల మీదుగా సంస్థ సీఎండీ బలరాంకు అందజేశారు. 

సింగరేణి సీఎండీగా ఎన్.బలరామ్ 2024-25 ఆర్థిక సంవత్సరంలో సింగరేణి బహుముఖ విస్తరణ కోసం వినూత్న ప్రాజెక్టులు ప్రారంభించారని, కార్మికుల సంక్షేమం కోసం చేపట్టిన కోటి రూపాయల ఉచిత ప్రమాద బీమా సదుపాయం కల్పించడం, సింగరేణి చరిత్రలో తొలిసారిగా ఒడిశాలో నైనీ ప్రాజెక్టు ప్రారంభానికి చూపిన చొరవ, సంప్రదాయేత ఇంధన వనరుల రంగంలోనూ సింగరేణిని ముందుకు తీసుకెళ్తుండటం తదితర అన్ని అంశాలను పరిగణనలోకి తీసుకొని ఈ అవార్డుకు ఎంపిక కావడం వృత్తి  పట్ల ఆయనకు ఉన్న అంకితభావం, చిత్తశుద్ధి, నిబద్ధత, క్రమశిక్షణ, నిజాయితీకి నిదర్శనమని తెలిపారు. మణుగూరు ఏరియా తెలంగాణ బొగ్గు గని కార్మిక సంఘం తరపున సీఎండీ కి హృదయపూర్వక శుభాకాంక్షలు తెలిపారు.