24-06-2025 06:48:11 PM
సిఐటియు నాయకులు..
మందమర్రి (విజయక్రాంతి): కేంద్రంలోని నరేంద్ర మోడీ ప్రభుత్వం అనుసరిస్తున్న కార్మిక వ్యతిరేక విధానాలను నిరసిస్తూ జులై 9న జాతీయ కార్మిక సంఘాలు(National Trade Unions) ఇచ్చిన దేశవ్యాప్త సమ్మెను సింగరేణిలో విజయవంతం చేయాలని సింగరేణి కాలరీస్ ఎంప్లాయిస్ యూనియన్(CITU) డిప్యూటీ ప్రధాన కార్యదర్శి ఎస్ నాగరాజు గోపాల్(Deputy General Secretary Nagaraju Gopal) కోరారు. ఈ మేరకు మంగళవారం ఏరియా ఎస్ఓటు జిఎం విజయప్రసాద్ కు సమ్మె నోటీసును అందజేసి మాట్లాడారు. కార్మికులకు అండగా సంఘం పెట్టుకునే హక్కు, వేతన ఒప్పందాలు చేసుకునే హక్కు, తప్పనిసరి పరిస్థితుల్లో 14 రోజుల ముందు సమ్మె నోటీసు ఇచ్చే హక్కుతో పాటు, కార్మికులకు లాభదాయకంగా ఉన్న చట్టాలను చట్టబద్ధతలేని కోడులుగా మార్చి అమలు చేసేందుకు కేంద్ర ప్రభుత్వం కుట్రలు పన్నుతుందని ఆయన మండిపడ్డారు.
కార్మిక చట్టాలను నిర్వీర్యం చేయడాన్ని నిరసిస్తూ బొగ్గు గని కార్మికులందరూ దేశవ్యాప్త సమ్మెలో పాల్గొని విజయ వంతం చేయాలని కోరారు. ఇప్పటికే బీజేపీ పాలిత రాష్ట్రాలలో ఎనిమిది గంటల కంటే ఎక్కువ పని గంటలు అమలవుతున్నాయని, పక్క రాష్ట్రాలైన కర్నాటక, ఆంధ్రప్రదేశ్ లలో పని గంటలు పెంచి అమలు చేయుటకు ఆయా ప్రభుత్వాలు ఒప్పు కోవడం కార్మిక చట్టాలపై దాడిగా ఆయన అభివర్ణించారు. దేశవ్యాప్త సమ్మె నిర్వీర్యమైతే తెలంగాణలోనూ పని గంటల పెంచే అవకాశాలు ఉన్నాయని ఆయన ఆందోళన వ్యక్తం చేశారు. వీటిని దృష్టిలో పెట్టు కొని కార్మికులు దేశ వ్యాప్త సమ్మెకు మద్దతు ప్రకటించాలని కోరారు. అన్ని కార్మిక సంఘాలు, రైతు సంఘాలు కలిసి సమ్మె చేస్తున్నందున ప్రతి ఒక్కరు ఈ సమ్మెలో పాల్గొని విజయవంతం చేయాలన్నారు. ఈ కార్యక్రమంలో సిఐటియు బ్రాంచ్ అధ్యక్షులు సాంబారు వెంకటస్వామి, ఉపాధ్యక్షులు వడ్లకొండ ఐలయ్య, అలవాల సంజీవ్, జడల ప్రవీణ్, ఎండి ఆరిఫ్, భేతి భరత్, నాగవెల్లి శ్రీధర్ లు పాల్గొన్నారు.