18-06-2025 12:29:39 AM
సినీ నటుడు ఆర్.నారాయణమూర్తి
ముషీరాబాద్, జూన్ 17 (విజయక్రాంతి): ఎక్కడ అణిచివేత, పీడనం దోపిడీ ఉంటుందో..అక్కడ ఉద్యమం ఉంటుందని, అందుకు అడిగినోడు నక్సలైట్... అడగనోడు ఆల్ రైటా ఆ .! అని ప్రముఖ సినీ నటుడు, దర్శకులు ఆర్. నారాయణమూర్తి ప్రశ్నించారు. ఈ మేరకు మంగళవారం శాంతి చర్చల కమిటీ ఆధ్వర్యంలో ఆపరేషన్ కగార్ పేరిట సాగిస్తున్న హత్యాకాండను వెంటనే ఆపాలని డిమాండ్ చేస్తూ హైదరాబాద్ ధర్నాచౌక్ వద్ద సభ అధ్యక్షులు జస్టిస్ చంద్రకుమార్ అధ్యక్షతన మహాధర్నా చేపట్టి నిరసన వ్యక్తం చేశారు.
ఈ కార్యక్రమానికి పలువురు ముఖ్య నేతలు, వివిధ పార్టీల నాయకులు హాజరై మాట్లాడారు. ఈ సందర్భంగా సినీ నటుడు ఆర్. నారాయణ మూర్తి మాట్లాడుతూ చంపాల్సింది అణిచివేతను దోపిడిని అని కేంద్ర ప్రభుత్వంపై ధ్వజమెత్తారు. సమాజంలో శాంతిని కాపాడి ప్రజలను అభివృద్ధి చేయాల్సిన బాధ్యత, రాజ్యాంగపరమైన హక్కులను రక్షించాల్సిన బాధ్యత ప్రభుత్వానిదేనన్నారు.
ఈ కార్యక్రమంలో సిపిఐ సిపిఎం, సిపిఐఎంఎల్ నేతలు ఎమ్మెల్యే కూనంనేని సాంబశివరావు తమ్మినేని వీరభద్రం, వేములపల్లి వెంకటరామయ్య, ఎమ్మెల్సీలు ప్రొఫెసర్ కోదండరాం, దాసోజు శ్రవణ్ కుమార్, నెల్లికంటి సత్యం, ప్రొఫెసర్లు హరగోపాల్, నాగేశ్వరరావు, వినాయక్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.