27-12-2025 02:27:44 AM
సీఐటీయూ ఆధ్వర్యంలో ఈసీఐఎల్ చౌరస్తాలో నిరసన
కుషాయిగూడ, డిసెంబర్ 26 (విజయక్రాంతి) కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన నూతన పాలసీలు ఎంజీఎన్ఆర్ఈజీఏ, నూతన విద్యుత్ చట్టం, నాలుగు లేబర్ కోడ్స్, శాంతి ఒప్పందం వంటి ప్రజా వ్యతిరేక చట్టాలను వెంటనే వెనక్కి తీసుకోవాలని డిమాండ్ చేస్తూ శుక్రవారం సీఐటీయూ కాప్రా సర్కిల్ కమిటీ ఆధ్వర్యంలో నిరసన కార్యక్రమం నిర్వహించారు. సీఐటీయూ కాప్రా సర్కిల్ కమిటీ కన్వీనర్ పి. గణేష్ నేతృత్వంలో కమలానగర్ సీఐటీయూ కార్యాలయం నుంచి ఈసీఐఎల్ ఎక్స్ రోడ్ వరకు ర్యాలీ నిర్వహించి, అనంతరం ఈసీఐఎల్ చౌరస్తాలో ధర్నా చేపట్టారు.
ఈ సందర్భంగా పి. గణేష్ మాట్లాడుతూ.. నాలుగు లేబర్ కోడ్స్ పూర్తిగా కార్మిక వ్యతిరేకమని, వీటి వల్ల ఉపాధి అవకాశాలు తగ్గి 12 గంటల పనిగంటలు విధించే ప్రమాదం ఉందన్నారు. అలాగే ఎంజీఎన్ఆర్ఈజీఏ నూతన విధానం వల్ల గ్రామీణ కార్మికులకు ఉపాధి కోల్పోయే పరిస్థితి ఏర్పడుతుందని హెచ్చరించారు. మేడ్చల్ జిల్లా సీఐటీయూ మాజీ అధ్యక్షుడు కోమటి రవి మాట్లాడుతూ..
నూతన విద్యుత్ చట్టం ద్వారా ఉచిత విద్యుత్తును రద్దు చేసి విద్యుత్తు రంగాన్ని ప్రైవేటుకు అప్పగించే ప్రయత్నం జరుగుతోందని విమర్శించారు. శాంతి ఒప్పందం వల్ల అణు విద్యుత్తు రంగంలో ప్రజా భద్రతకు ముప్పు ఏర్పడే అవకాశం ఉందన్నారు. ఈ కార్యక్రమంలో బీవీ సత్యనారాయణ, ఉన్నికృష్ణ, వెంకట్, మణికంఠ, సంతోష్, షరీఫ్, సఫియా, శ్రీనివాస్, శ్రీనివాసరావు, దుర్గయ్య, శివన్నారాయణ, యాదగిరిరావు, కొండల్ రెడ్డి, రవిశంకర్, హరిప్రసాద్ తదితరులు పాల్గొన్నారు.