calender_icon.png 27 November, 2025 | 7:45 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

నామినేషన్ ప్రక్రియ సమర్థవంతంగా నిర్వహించాలి

27-11-2025 05:57:28 PM

జిల్లా ఎన్నికల అధికారి, కలెక్టర్ కుమార్ దీపక్..

లక్షెట్టిపేట (విజయక్రాంతి): 2వ సాధారణ పంచాయతీ ఎన్నికల నేపథ్యంలో సర్పంచ్, వార్డు సభ్యుల స్థానాలకు నామినేషన్ ప్రక్రియ సమర్థవంతంగా నిర్వహించాలని జిల్లా ఎన్నికల అధికారి, కలెక్టర్ కుమార్ దీపక్ అన్నారు. గురువారం మండలంలోని గుల్లకోట, మిట్టపల్లి, సూరారం గ్రామాలకు గుల్లకోట గ్రామపంచాయతీ, పోతపల్లి, అంకతిపల్లి, లక్ష్మీపూర్ గ్రామాలకు పోతపల్లి గ్రామపంచాయతీ, చందారం, హనుమంతుపల్లి, రంగపేట గ్రామాలకు చందారం గ్రామపంచాయతీలలో ఏర్పాటుచేసిన నామినేషన్ కేంద్రాలను సందర్శించి రిటర్నింగ్, సహాయ రిటర్నింగ్ అధికారులకు పలు సూచనలు చేశారు.

ఈ సందర్భంగా జిల్లా ఎన్నికల అధికారి, కలెక్టర్ మాట్లాడుతూ... సర్పంచ్, వార్డు సభ్యుల స్థానాలకు చేపట్టిన నామినేషన్ స్వీకరణ ప్రక్రియను సమర్ధవంతంగా నిర్వహించాలని తెలిపారు. నామినేషన్ స్వీకరణ కేంద్రం ముందు గ్రామపంచాయతీలోని వార్డుల వారీగా ఫోటో ఓటర్ల జాబితా, రిజర్వేషన్ల వివరాలను ప్రదర్శించాలన్నారు. నామినేషన్ కేంద్రం నుండి 100 మీటర్ల పరిధిలో గుంపులుగా ఎవరిని అనుమతించకూడదని, నామినేషన్ సమర్పించే అభ్యర్థులు, ప్రతిపాదించే వారిని మాత్రమే అనుమతించాలని తెలిపారు.

నామినేషన్ల స్వీకరణలో ఎన్నికల కమిషన్ జారీ చేసిన నియమాలకు లోబడి వ్యవహరించాలని, నామినేషన్ పత్రాల స్వీకరణ, నామినేషన్ల పరిశీలన, అభ్యర్థుల ప్రకటన, గుర్తుల కేటాయింపు ప్రక్రియలో జాగ్రత్తగా వ్యవహరించాలని తెలిపారు. అనంతరం ఇటిక్యాల గ్రామంలో కొనసాగుతున్న వరి ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని సందర్శించి నిర్వాహకులకు పలు సూచనలు చేశారు. మండల కేంద్రంలోని 30 పడకల సామాజిక ఆరోగ్య కేంద్రంలో చేపట్టిన పోస్ట్ మార్టం గది నిర్మాణ పనులను పరిశీలించి త్వరగా పూర్తి చేసే విధంగా చర్యలు తీసుకోవాలని అధికారులకు సూచించారు. ఆసుపత్రికి వచ్చే ప్రజలకు మెరుగైన వైద్య సేవలు అందించాలని, వైద్యులు, సిబ్బంది విధుల పట్ల బాధ్యతగా వ్యవహరించాలని తెలిపారు. ఈ కార్యక్రమంలో మండల పరిషత్ అభివృద్ధి అధికారి సరోజ, సంబంధిత శాఖల అధికారులు తదితరులు పాల్గొన్నారు.