11-01-2026 12:00:00 AM
హైదరాబాద్/చౌటుప్పల్, జనవరి 10 (విజయక్రాంతి): సంక్రాంతి పండుగ సందర్భంగా హైదరాబాద్ నగరంలోని ప్రజలు తమ సొంత ఊళ్ల బాట పట్టారు. శుక్రవారం నుంచే హైదరాబాద్లోని పలు బస్టాండ్లు, రైల్వే స్టేషన్ల వద్ద పెద్ద ఎత్తున రద్దీ కనిపించింది. శని, ఆదివారాల్లో కూడా ఈ రద్దీ కొనసాగనుంది. అలాగే హైదరాబాద్ - విజయవాడ జాతీయ రహదారిపై వేలాది మంది సొంతూళ్లకు వెళ్తుండటంతో టోల్ప్లాజాల వద్ద వాహనాల రద్దీ తీవ్రంగా ఉంది. పోలీసులు ప్రత్యామ్నాయ మార్గాలను సూచిస్తున్నారు.
కాగా హైదరాబాద్లోని కేపీహెచ్బీ కాలనీ, మైత్రివనం, ఎంజీబీఎస్, జేబీఎస్ వంటి ప్రధాన బస్టాండ్లు ప్రయాణికులతో కిక్కిరిసిపోయాయి, బస్సుల కోసం జనం వేచి చూస్తున్నారు. అలాగే సికిందరాబాద్, నాంపల్లి, లింగంపల్లి, చర్లపల్లి రైల్వే స్టేషన్ల వద్ద కూడా పెద్ద సంఖ్యలో ప్రయాణికులు ఉన్నారు. జనం రద్దీతో బస్టాండ్లు, రైల్వే స్టేషన్ల వద్ద సంక్రాంతి సందడి కనిపిస్తోంది. నగరంలోని పలుచోట్ల భారీగా ట్రాఫిక్ జామ్ ఏర్పడింది.
ముఖ్యంగా సిటీ కాలేజీ, ఎంజే మార్కెట్, బేగంబజార్, హైకోర్టు, ఆఫ్జల్గంజ్, నయాపూల్ తదితర చోట్ల పెద్ద ఎత్తున ట్రాఫిక్ స్తంభించింది. దీంతో పోలీసులు ట్రాఫిక్ను చక్కదిద్దేందుకు చర్యలు చేపట్టారు. వాహనాలు క్రమ పద్ధతిలో వెళ్లేలా చూస్తున్నారు.
విజయవాడ హైవేపై ట్రాఫిక్ జామ్
పండుగ కోసం సొంతూళ్లకు వెళుతున్న ప్రయాణికులతో హైదరాబాద్---- విజయవాడ జాతీయ రహదారి (ఎన్హెచ్ 65) కిక్కి రిసిపోయింది. శనివారం ఉదయం నుంచే రహదారిపై వాహనాలు బారులు తీరాయి. ముఖ్యంగా చౌటుప్పల్ పట్టణం, పంతంగి టోట్ప్లాజా వద్ద కిలోమీటర్ల మేర ట్రాఫిక్ నిలిచిపోయింది. పండుగ సెలవులు మొదలవడంతో వేలాది మంది ఒకేసారి బయలు దేరడం, దీనికితోడు హైవేపై జరుగుతున్న నిర్మాణ పనులు కూడా తోడవడంతో వాహనాలు నెమ్మదిగా కదులుతున్నాయి.
ఈ నేపథ్యంలో ప్రయాణికులు గంటల తరబడి ట్రాఫిక్లో చిక్కుకోకుండా ఉండేందుకు పోలీసులు ప్రత్యామ్నాయ మార్గాలను సూచిం చారు. గుంటూరు, మాచర్ల, అద్దంకి, ఒంగో లు, నెల్లూరు వైపు వెళ్లే వాహనదారులు విజయవాడ హైవేకు బదులుగా నాగార్జున సాగర్ హైవే మీదుగా ప్రయాణించడం మేలని పోలీసులు తెలిపారు. ఔటర్ రింగ్ రోడ్ (ఓఆర్ఆర్) నుంచి బొంగుళూరు గేట్ వద్ద ఎగ్జిట్ తీసుకుని సాగర్ హైవేలోకి ప్రవేశించవచ్చు.
ఈ మార్గం కాస్త దూరం ఎక్కువై నా, ట్రాఫిక్ లేకుండా సాఫీగా ప్రయాణం సాగించవచ్చని చెబుతున్నారు. సాధారణ మార్గంలో పంతంగి టోల్ప్లాజా వద్ద తీవ్ర ఇబ్బందులు ఎదురయ్యే అవకాశం ఉందని స్పష్టం చేశారు.అలాగే ఖమ్మం, విజయవాడ వైపు వెళ్లే ప్రయాణికులు భువనగిరి మీదుగా ప్రయాణించాలని అధికారులు సూచిస్తున్నారు. ఓఆర్ఆర్ మీదుగా ఘట్కేసర్ వద్ద ఎగ్జిట్ తీసుకుని వరంగల్ హైవేపైకి చేరుకుని, అక్కడి నుంచి భువనగిరి, రామన్నపేట మీదుగా చిట్యాలకు చేరుకోవచ్చు.
చిట్యాల నుంచి నార్కట్పల్లిని దాటితే ట్రాఫిక్ కష్టాలు చాలా వరకు తగ్గుతాయని వివరిస్తున్నారు. అంతేకాకుండా ఆదివారం చౌటుప్పల్లో జరిగే వారంతపు సంతతో రద్దీ మరింత పెరిగే అవకాశం ఉందని పోలీసులు హెచ్చరిస్తున్నారు. పండుగ రద్దీకి సంత కూడా తోడైతే పరిస్థితి తీవ్రంగా మారుతుందని, కాబట్టి ఆదివారం ప్రయాణించే వారు కచ్చితంగా ప్రత్యామ్నాయ మార్గాలను ఎంచు కోవాలని సూచిస్తున్నారు. వాహనదారులు ఓపికతో వ్యవహరించి, ట్రాఫిక్ నిబంధనలు పాటిస్తూ సురక్షితంగా గమ్యస్థానాలకు చేరుకోవాలని కోరారు.