calender_icon.png 9 October, 2025 | 3:34 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

గురుకులాలకు తాళాలు వేసే దుస్థితి

09-10-2025 12:56:49 AM

  1. భవనాల అద్దె బకాయిలు చెల్లించకపోవడం దుర్మార్గం

ఇది సీఎం రేవంత్‌రెడ్డి అసమర్థతకు నిదర్శనం

బీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్

గురుకులాల్లో మరణ మృదంగం ఆపలేరా?

మాజీ మంత్రి హరీశ్‌రావు ఆగ్రహం

హైదరాబాద్, అక్టోబర్ 8 (విజయక్రాంతి): యావత్ దేశానికే తలమానికంగా నిలిచిన తెలంగాణ సంక్షేమ గురుకులాలకు అద్దె బకాయిలు పేరుకుపోయి, చివరికి భవనాలకు తాళాలు వేసే దుస్థితి రావడం అత్యంత దుర్మార్గమని బీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ విమర్శించారు. గురుకులాల నిర్వహణలో కాంగ్రెస్ ప్రభుత్వం ఘో రంగా విఫలమైందని, దీనికి సీఎం రేవంత్‌రెడ్డి అసమర్థత, చేతకానితనానికి నిదర్శన మని బుధవారం ఒక ప్రకటనలో మండిపడ్డారు.

విద్యాశాఖను తన వద్దే పెట్టుకున్న సీఎం, గురుకుల భవనాలకు ఏకంగా ఏడాది కాలం నుంచి అద్దె బకాయిలు చెల్లించకపోవడాన్ని తప్పుబట్టారు. పేద విద్యార్థుల జీవి తాల్లో వెలుగులు నింపిన ఈ అత్యుత్తమ వ్యవస్థను కుప్పకూల్చి, కేసీఆర్ ఆనవాళ్లు చెరిపేయాలన్న కుట్రలో భాగంగానే సీఎం ఇదంతా చేస్తున్నట్టు అనుమానం కలుగుతోందని ఆందోళన వ్యక్తంచేశారు.

ఓ వైపు ఫీజు రీయింబర్స్‌మెంట్ బకాయిలు చెల్లించకుండా విద్యార్థుల భవితవ్యాన్ని అంధకారం లోకి నెడుతున్న సీఎం, సంక్షేమ గురుకులాలను కూడా సమాధి చేసే పన్నాగం చేస్తే సహించే ప్రసక్తే లేదని హెచ్చరించారు. బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనారిటీలతోపాటు అగ్రవర్ణ పేదలకు కార్పొరేట్ స్థాయి విద్యనందించిన రెసిడెన్షియల్ వ్యవస్థను బలిపెడితే బీఆర్‌ఎస్ చూస్తూ ఊరుకోదని స్పష్టంచేశారు.

రెండేళ్లు నిండకుండానే రెండున్నర లక్షల కోట్ల అప్పులు తెచ్చిన రేవంత్‌రెడ్డి, కనీసం గురుకులాల అద్దె కూడా కట్టకుండా, ఆ సొమ్ముతో ఎవరి జేబులు నింపుతున్నాడో తక్షణమే లెక్కలు చెప్పాలని డిమాండ్ చేశా రు. వెంటనే కాంగ్రెస్ సర్కారు రాష్ర్టంలోని అన్ని గురుకుల భవనాల అద్దె బకాయిలను విడుదల చేసి, విద్యార్థులు నష్టపోకుండా చర్యలు తీసుకోవాలని కోరారు.

ఒకవేళ గురుకులాలకు తాళాలు వేసే దుస్థితే వస్తే, రాష్ర్టవ్యాప్తంగా విద్యార్థులు, వారి తల్లిదండ్రులతో కలిసి రాష్ట్రవ్యాప్తంగా ఈ నిరంకుశ కాంగ్రెస్ సర్కారుపై సమరశంఖం పూరిస్తామని హెచ్చరించారు. చిన్నారుల భవితవ్యం తో చెలగాటమాడుతున్న రేవంత్‌రెడ్డికి ప్రజాక్షేత్రంలోనే గుణపాఠం చెబుతామని స్పష్టంచేశారు.

గురుకులాలను గాలికి వదిలేయడం దుర్మార్గం: హరీశ్‌రావు

గురుకులాల్లో మరణ మృదంగం ఆపలేరా?, బడికి పంపిన పిల్లలు విగతజీవులుగా మారుతుంటే ప్రభుత్వం మొద్దు నిద్ర వీడదా? అని మాజీ మంత్రి హరీశ్‌రావు ప్రశ్నించారు. సిద్దిపేట జిల్లా హుస్నాబాద్ మండలం జిల్లెల్లగడ్డ గురుకులంలో ఎనిమిదవ తరగతి విద్యార్థి వివేక్ అనుమానాస్పద మృతికి కారణం ఏమిటని బుధవారం ‘ఎక్స్’ వేదికగా ప్రశ్నించారు.

గురుకులాల నిర్వహణ గాలికి వదిలేసి, మొత్తం వ్యవస్థనే కుప్పకూల్చేలా రేవంత్ ప్రభుత్వం వ్యవహరిస్తుండటం దుర్మార్గమని మండిపడ్డారు. అభంశుభం తెలియని విద్యార్థి అనుమానాస్పదంగా ప్రాణాలు కోల్పోతే ఒక్క అధికారి వచ్చి చూసిన పాపాన పోలేదని ఆవేదన వ్యక్తంచేశారు.

జిల్లా కలెక్టర్, విద్యాశాఖ ఉన్నతాధికారులు వెంటనే గురుకులాన్ని సందర్శించాలని, మృతి పట్ల విచారణ జరిపి వాస్తవాలు నిగ్గుతేల్చాలని, ఘటనకు బాధ్యత వహించి విద్యార్థి కుటుంబానికి రూ.25 లక్షల ఎక్స్‌గ్రేషియా ప్రకటించాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు.