09-10-2025 12:55:52 AM
-కాంగ్రెస్తో లోపాయకారి ఒప్పందం
-బీజేపీ ఎంపీ రఘునందన్ రావు
హైదరాబాద్, అక్టోబర్ 8 (విజయక్రాంతి): డిసెంబరులో జరగబోయే జీహెచ్ ఎంసీ ఎన్నికల్లో ఎంఐఎం పార్టీకి మేయర్ పదవి ఇస్తామనే ఒప్పందం మేరకే ఆ పార్టీ ప్రస్తుత జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల్లో పోటీకి దూరంగా ఉందని బీజేపీ ఎంపీ రఘునందన్రావు విమర్శించారు. ఆ రెండు పార్టీల మధ్య ఇదే అంశంపై లోపాయకారి ఒప్పం దం కుదిరిందని ఆరోపించారు.
బుధవారం బీజేపీ రాష్ట్ర కార్యాలయంలో నిర్వహించిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ జూబ్లీహిల్స్ ఉపఎన్నికల సందర్భం గా తెలంగాణలో కొన్ని పార్టీలు రాజకీయ క్రీడ ఆడుతున్నాయని విమర్శించారు. నవంబర్ 11న బీహార్లో జరగనున్న ఎన్నికల్లో కూడా ఎంఐఎం పార్టీ 30 స్థానాల్లో పోటీ చేస్తామని ప్రకటించిందని, హైదరాబాద్ నగరంలో ఎన్నికలొస్తే ఎందుకు పోటీ చేయడం లేదో ప్రజలు ఆలోచించాలన్నారు. ఎంఐ ఎం పార్టీ అభ్యర్థిని నిలబెట్టకపోవడం వెనుక పెద్ద రాజకీయ కుట్ర దాగి ఉందని విమర్శించారు. జూబ్లీహిల్స్లో ఎంఐఎం సూచించిన వ్యక్తినే కాంగ్రెస్ అభ్యర్థిగా నిలబెట్టబోతున్నారని ఆయన తెలిపారు.