calender_icon.png 8 June, 2025 | 9:35 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

ప్లాట్ కొనుగోలుదారు సొమ్మును.. వడ్డీతో సహా చెల్లించాల్సిందే!

04-08-2024 12:56:35 AM

ఫ్లాట్ అప్పగింత జాప్యం కేసులో బిల్డర్‌కు సుప్రీంకోర్టు షాక్

హైదరాబాద్ సిటీబ్యూరో ప్రధానప్రతినిధి, ఆగస్టు 3 (విజయక్రాంతి): ఫ్లాట్ అప్పగింతలో జాప్యం చేసినందుకు కొనుగోలుదారు చెల్లించిన మొత్తం సొమ్మును వెనక్కి ఇవ్వాల్సిందేనంటూ సుప్రీంకోర్టు స్పష్టం చేసింది. ఫ్లాట్ అప్పగింతలో జరిగిన జాప్యానికి కొనుగోలుదారు చెల్లించిన మొత్తం సొమ్మును బిల్డర్ 9 శాతం వడ్డీతో  తిరిగి చెల్లించాలని ఇటీవల జాతీయ వినియోగదారుల వివాద పరిష్కార కమిషన్ (ఎన్‌సీడీఆర్సీ) ఇచ్చిన తీర్పును సుప్రీంకోర్టు సమర్థించింది. 9 శాతం వడ్డీని 12 శాతానికి పెంచుతూ జస్టిస్ బీఆర్ గవాయ్, జస్టిస్ సందీప్ మెహతాలతో కూడిన ధర్మాసనం తీర్పు వెల్లడించి సదరు బిల్డర్‌కు షాక్ ఇచ్చింది. తీర్పు వెలువడిన తేదీ నుంచి మూడు నెలల్లోగా ఆ మొత్తం చెల్లించాలని ఆదేశించింది. తమ తప్పు లేకపోయినా కొనుగోలుదారులు ఇలాంటి విషయాల్లో ఇబ్బందులు పడుతున్నారని ఈ సందర్భంగా ధర్మాసనం వ్యాఖ్యానించింది.

అసలు ఏమి జరిగిందంటే..

ఢిల్లీలోని సుభాష్‌నగర్‌లో పర్సవంత్ పారామౌంట్ అనే సంస్థ 2008లో హౌసింగ్ ప్రాజెక్టు చేపట్టింది. అదే ఏడాది జూలై 15న ఫిర్యాదుదారు రూ.16 లక్షలు చెల్లించి 3 బీహెచ్‌కే ఫ్లాట్ బుక్ చేసుకున్నారు. మిగిలిన మొత్తాన్ని నిర్దేశిత ప్రణాళిక ప్రకారం చెల్లించేందుకు ఒప్పందం చేసుకున్నారు. కొనుగోలు ఒప్పందం ప్రకారం ఫ్లాట్‌ను 30 నెలల్లోగా నిర్మించి ఇవ్వాలి. 6 నెలల గ్రేస్ పిరియడ్ కూడా ఉంది. అయితే, నిర్దేశిత గడువు ముగిసినా డెవలపర్ ఫ్లాట్ అప్పగించలేదు. కొనుగోలుదారు ఎప్పటికప్పుడు ఫ్లాట్‌కు సంబంధించిన మొత్తాన్ని చెల్లిస్తూవచ్చారు. అయినప్పటికీ, డెవలపర్ ఫ్లాట్‌ను అప్పగించలేదు. దీంతో కొనుగోలుదారు ఎన్‌సీడీఆర్సీని ఆశ్రయించారు.

తాను చెల్లించిన మొత్తాన్ని ప్రస్తుత మార్కెట్ విలువ ప్రకారం లెక్కించి, దానికి 24 శాతం వడ్డీతో ఇప్పించాలని కోరారు. దీనిపై విచారణ జరిపిన కమిషన్ 2022 సెప్టెంబర్ 29న తీర్పు వెలువరించింది. కొనుగోలుదారు చెల్లించిన మొత్తాన్ని 9 శాతం వడ్డీతో తిరిగి ఇవ్వాలని ఆదేశించింది. అనంతరం ఈ కేసు సుప్రీంకోర్టుకు వెళ్లగా 12 శాతం వడ్డీతో ఆ మొత్తం తిరిగి చెల్లించాలని ఇటీవల బిల్డర్‌కు సూచిస్తూ ధర్మాసనం తీర్పు వెల్లడించింది. ఈ తీర్పు వల్ల బిల్డర్‌లలో కొంత వరకు మార్పు వస్తుందని నిర్మాణ సంస్థల ప్రతినిధులు, రియల్ నిపుణులు పేర్కొంటున్నారు. అలాగే బిల్డర్ల కారణంగా కొనుగోలుదారులకు నష్టం వాటిల్లితే జాతీయ వినియోగదారుల వివాద పరిష్కార కమిషన్ (ఎన్‌సీడీఆర్సీ)లతోపాటు న్యాయ స్థానాలను ఆశ్రయిస్తే న్యాయం దొరుకుతుందని నిర్మాణ రంగ నిపుణులు సూచిస్తున్నారు.