calender_icon.png 7 June, 2025 | 10:31 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

పండితనుత కావ్యనిర్మాత పెన్గలూరి వెంకటాద్రి కవి

05-05-2025 12:00:00 AM

“తానిచ్చి యిప్పించ పూను భూవిభు చేత

నుచితోక్తి యామంత్రి యుత్తముండు

ప్రభువుచే నిప్పించి పాటి మాటలచేత

మన్నించు నామంత్రి మధ్యముండు

ఈయకిప్పించక నే బోధ లేకుండు

నట్టియా దుర్మతి యధముడరయ

ఒకరి కిచ్చుట జూచి యోపక వికటించు

నామంత్రి సుమ్మధమాధముండు

గాన మహనీయ దానోపకార మహిమ

మెలగ నేర్చిన వాడెపో మేటిమంత్రి

లాలుకోట పురీవాస! లలితహాస!

విబుధ లోకేశ! భవనాశ! వెంకటేశ!”

అంటూ మంత్రుల శ్రేణులను, వింగడించి, ఆయా స్థాయి మంత్రుల లక్షణాలను స్పష్టంగా చెప్పిన ఈ పద్యం పెన్గలూరి వెంకటాద్రి కవి రచించిన ‘లాలుకోట వేంకటేశ్వర శతకం’ లోనిది. 29 పద్యాలు మాత్రమే లభిస్తున్న ఈ శతక పద్యాలన్నీ ఇదే రీతిలో పరి పాలకుల విషయాలు, ప్రజల జీవన విధా నం వంటి పలు సామాజిక అంశాలు చోటు చేసుకున్న రచన.

ఈ కవి రచించిన నాలుగు రచనలలో మూడు రచనలు ‘రఘనాయక శతకం’, ‘శ్రీరామోదాహరణ’ కావ్యం, ‘భువ న మోహినీ విలాస’ ద్విపద కావ్యం. పాలమూరు జిల్లా వాస్తవ్యులు, ప్రముఖ పండిత పరిశోధకులు, నిత్య సాహిత్య శోధనాసక్తులు కీ.శే. కపిలవాయి లింగమూర్తి తమ శోధన లో పాలమూరు ప్రాంత కవి పండితుల జీవి త విశేషాలను, కావ్య ప్రచురణలను చేపట్టి ఎందరెందరో కవుల కావ్యాలను తెలుగు వా రికి అందించిన వాటిలో ఇది కూడా ఒకటి. 

పాలమూరులో లభ్యమైన తొలి ఉదాహరణ కావ్యం 

పెన్గలూరి వెంకటాద్రి కవి రచించిన నా లుగు కృతుల విషయంలోను కపిలవాయి వారి కృషి కారణంగా, వారి పరిష్కరణతోనే ఈ రచనలు వెలుగు చూశాయి. ఈ రకంగా ఆయన జీవన వివరాలు కూడా సాహిత్య చరిత్రకారులకు అందుబటులోకి వచ్చాయి.

“అనఘుడు, నందపట్టణ విహారుడు, గౌతమ గోత్రజుండు, పా

వనతర పెన్గలూరి పురవర్యుడు,

లింగనమంత్రి గర్భ సం

జనితుడు వెంకటాద్రి కవిసత్తముడౌ ననజెప్పె ధాత్రి లో

దనరిన వెంకటాపురము ధాముడు 

శ్రీరఘురాము పేర స

ద్ఘన కృపపండిత స్తుతముదార 

ముదాహరణాఖ్యమౌ కృతిన్‌”

అన్న ‘శ్రీరామోదాహరణ’ కావ్యాన్నిబట్టి వెంకటాద్రి తండ్రి పెన్గలూరి లింగన మంత్రి అని తెలుస్తున్నది. పాలమూరు జిల్లాలో లభించిన ఉదాహరణ కావ్యాలలో ఇదే మొదటిదని ఆచార్య ఎస్.వి. రామారావు అభిప్రాయపడ్డారు. అప్పకవి అంతకు పూర్వ మే ‘శ్రీకృష్ణోదాహరణ’ కావ్యాన్ని రచించినా అది అలభ్యం.

గొప్ప వృత్త వైవిధ్యం

ఉదాహరణ కావ్యం ఒక దేశి కవితా ప్రక్రి య. ఓరుగల్లు వాడైన పాల్కురికి సోమనాథ కవి తొట్ట తొలిసారి ఈ ప్రక్రియను ప్రారంభించి సంస్కృత భాషలో ‘బసవోదాహర ణాన్ని’ రచించి ఈ మార్గంలో తొలి అడుగు వేశాడు. నాటినుంచి నేటివరకు ఈ కావ్య ప్రక్రియ కొనసాగుతూ ఉండడం విశేషం. ఇందులోని ఏడు విభక్తులు, సంబోధనా ప్రథమా విభక్తిలో పద్యాలు, కళిక, ఉత్కళికలు కనిపిస్తాయి.

సాధారణంగా కవులు వృత్త పద్యాల్లో ఉత్పల, చంపకాది వృత్తాలు ఉంటాయి. కాని, వెంకటాద్రి కవి చతుర్థీ విభక్తికి ‘మత్తకోకిల’, షష్ఠీ విభక్తి పద్యానికి ‘పంచ చామరం’, సప్తమీ విభక్తికి ‘ఉత్సాహ’ వృత్తా లు చెప్పి గొప్పవృత్త వైవిధ్యాన్ని సాధించా డు. స్తోత్ర రూపమైన ఈ దేశికవితా ప్రక్రియ ను గురించి సాహిత్య చరిత్రకారులు “ఉదాహరణ వాఙ్మయ శాఖకు ఇదొక అమూల్య మైన ఉపాయనం” అన్నమాట అక్షరాక్షర సత్యం.

‘శ్రీరామోదాహరణం’ కోదండ రామస్వామికి అంకితం

1623- 1653 కాలంలో వనపర్తి సంస్థానాన్ని పాలించిన ఇమ్మడి వెంకటరెడ్డి పెబ్బే రు మండల సమీపంలోని వెంకటాపురంలో నిర్మించిన రామాలయంలోని కోదండ రామస్వామికి కవి ‘శ్రీరామోదాహరణం’ అంకితం ఇచ్చారు. వనపర్తి పాలకుడైన ఇమ్మడి వెంకటరెడ్డి కుమారుడైన అష్టభాషా బహరీ గోపాలరావు కూడా కవియే.

ఆయన రచించిన ‘రామచంద్రోదయమ్’ అనే సం స్కృత యమక కావ్యాన్నికూడా ఈ కోదండ రామునికే అంకితం చేశాడు. ఈయన 1654  మధ్యకాలంలోని వానిగా చారిత్రకులు అభిప్రాయపడ్డారు. వెంకటాద్రి కవిని వీరి కాలపు వానిగానే వారు నిర్ధారించారు. దీనినిబట్టి ఈ కవి కూడా 17వ శతాబ్ది వాడన్నది నిర్ణయించవచ్చు.

వీరి పూర్వీకుడైన పెద వేంకటామాత్యుడు వనపర్తి పాలకుల మంత్రిగా ఉండేవాడని, లింగన మంత్రి కూడా వనపర్తి పాలకులవద్ద మంత్రి పదవి నిర్వహించినట్లు తెలుస్తున్నది. వెంకటాద్రి కూడా తనను గురించి వెంకనామాత్యునిగా, వెంకన మంత్రిగా కూడా పేర్కొ న్నాడు. బహుశా వనపర్తి రాజుల మూల పురుషుడైన వీర కృష్ణారెడ్డి (1510) వద్ద పెద వేంకటాద్రి మంత్రియై ఉండవచ్చు. 

‘రఘునాయక శతకం’లో 48 పద్యాలే లభ్యం

పెన్గలూరి వెంకటాద్రి కవి రచించిన మరొక రచన ‘రఘునాయక శతకం’. 48 పద్యాలు మాత్రమే లభించిన ఈ శతకం ‘రఘు నాయక భక్తవత్సల ప్రదాయకా’ అనే మకుటం కలిగి గ్రామీణ విషయాలతో కూడి ఉంది. అక్కడక్కడా గ్రామ్యభాష కూడా కనిపిస్తుంది. ఈ శతకాలు వెంకటాద్రి కవి ప్రాథ మిక రచనలు అయి ఉంటాయని సాహితీవేత్తలు భావించారు. ఈ శతకంలో అప్పటికే వ్యావహారిక భాషా ప్రయోగాలు విరివిగా కలిగిన ‘చంద్రశేఖర శతక’ చ్ఛాయలు చాలా కనిపిస్తాయి.

“మాటలకేమి వచ్చె, పెరుమాళ్లకు దోసిలి, కర్ణమయ్యకున్

శాటలు, కంసలోజునకు శారలు, 

సిల్లర బిచ్చగాండ్ల పో

రాటము సెప్పరాదు యిక, 

రాసెగుటేగతి యంచు బల్కునే

నాటను రెడ్డి దూబ రఘునాయక! 

భక్తవత్సల ప్రదాయకా!”

అనే పద్యాన్ని పరిశీలిస్తే “పంట పండించిన రైతు సంపన్నుడు అవడం అటుంచి పం డిన వ్యవసాయ ఫలంలో దైవానికి దోసిళ్ల కొద్ది, గ్రామ కరణానికి చేటల కొద్ది, కమ్మరి కుమ్మరి కంసాలి వంటి వృత్తి  పనివారలకు చారలకొద్ది ఇచ్చిన తరువాత ధాన్యరాశిలో రైతుకు మిగిలేదెంత?” అంటూ నాటి సమా జ స్థితిని వర్ణించాడు.

అంటే, నాటి సమాజంలో రైతు పండించిన పంటలో దైవానికి, గ్రామ కరణానికి, వృత్తి పనివారలకు కొంత కొంతభాగం పంచాలన్న పద్ధతులు ఉండేవన్న సమాచారం తెలుస్తున్నది. ఇందులోని పద్యాలన్నీ ఎక్కువగా ఇటువంటి సామాజిక సంబంధమైనవే కావడం విశేషం.

‘భువన మోహినీ విలాసం’ వెంకటేశ్వరస్వామికి అంకితం 

పెన్గలూరి వెంకటాద్రి రచించిన కావ్యాల్లో ప్రధానమైన కావ్యం ‘భువన మోహినీ విలా సం’. ఇది ద్విపద కావ్యమేకాక శృంగార ప్రబంధం కూడా. ఈ కావ్యాన్ని కవి కొత్తకో ట సమీపంలోని గుట్టపై వెలసిన వెంకటేశ్వర స్వామికి అంకితమిచ్చాడు. తిరుమలాచార్యుల శిష్యుడు, గంగాపుర చెన్నకేశవ భక్తు డు, నందపురాగ్రహార వాసి అయిన ఈ వెం కటాద్రి కవికి చెందిన ఈ కావ్యం సమస్త కావ్య లక్షణయుక్తమైంది.

ఇది పలు వర్ణనలతో, గొప్ప ఆలంకారిక శోభతో నాటి తెలు గు సంస్కృతికి దర్పణం పట్టే గ్రంథంగానూ సాహిత్యలోకంలో ప్రసిద్ధి పొందింది. ఇందు లో చక్కని జాతీయాలు, అందమైన తెలుగు నుడికారాలు, నిత్యం మనం వినే ఎన్నో తెలుగు సామెతలు చోటు చేసుకున్నాయి.

బాధ్యతను గుర్తెరిగిన ఉత్తమకవి

‘భువన మోహినీ విలాస’ కావ్యంలో పురవర్ణన, సూర్యోదయ సూర్యాస్తమయ, చం ద్రోదయ, నగర వర్ణనలు వంటి దాదాపు 20 అంశాల్లో వర్ణనలు ఉన్నాయి. వర్ణనా నిపుణుడైన వానినే ఉత్తమకవి అన్న ఆలంకారికులను అనుసరించి ఈ కవి ఉత్తమక విగా పేర్కొనవచ్చు. సుకీర్తి తన పుత్రికకు వివాహం జరిపిస్తుంది. అనంతరం ఆమెను అత్తవారింటికి పంపించే సందర్భంలో-

“జనియించి నింటికి, సఖి చొచ్చినింటి

కనయంబు సత్కీర్తులలరించు..” నట్లు ప్రవర్తించాలని బోధించాడు. అంతేకాదు,

“... తోడి కోడండ్ర పొత్తును బాయకమ్మ

తోడు తోనైన, పుత్రుని తోడనైన

నొంటి పాటున బల్కు టుడుగు మాయమ్మ

కంటకులగు వారికడ నిల్వకమ్మ..”

అంటూ హితబోధ చేయడం నేటికీ ఆదర్శవంతమైన అంశం. ఉమ్మడి కుటుంబ వ్యవస్థలో అత్తవారింటికి వెళ్లే స్త్రీలు పాటించవలసిన పద్ధతులను ప్రేమ పూర్వకంగా బో ధించిన తండ్రి బాధ్యతను గుర్తించే విధంగా రచించిన తీరు ప్రశంసనీయం.

సమాజ సం స్కరణ కవి బాధ్యత. సమాజంలో కొన్ని కొన్ని జీవితాల్లో సంఘర్షణల మూలం ఉమ్మడి కుటుంబం కాకుండా ఉండే రీతిలో నూతన వధువులు ఉండాలన్న ధ్వనిని తండ్రి ప్రేమైక వచనాల్లో వెంకటాద్రి కవి వినిపించడం ద్వారా తన బాధ్యతను పూర్తి చేసుకున్నాడు. రచించినవి కొన్ని రచనలే అయినా ప్రతిభా సమన్వితంగా సంపూర్ణ కావ్యలక్షణ యుతంగా రచించి తెలుగు సాహితీ ప్రపంచాన వెలిగిన కవి వెన్గలూరి వెంకటాద్రి కవి.

హద్దులు దాటని శృంగార ప్రబంధం 

తెలుగులో చాలా శృంగార గ్రంథాలు ఉన్నాయి. శేషము వేంకటపతి ‘తారాశశాంకము’, పండిపెద్ది కృష్ణస్వామి ‘బిల్హణీయము’ వంటి కావ్యాలు ఉన్నాయి. వాటిలో శృంగారం కొంత విశృంఖలత కలిగి ఉండటం మూలాన పండితులు ఆ కావ్యాల పట్ల కొంత వైముఖ్యం కలిగి ఉండేవారని విమర్శకులు భావించారు. కాని, ఈయన ‘భువన మోహినీ విలాసం’ శృంగార కావ్యమే అయినా ఇది అపమార్గంలో మాత్రం పోలేదని కవి, సాహిత్య పరిశోధకుడు కపిలవాయి లింగమూర్తి పేర్కొన్నారు. 

మనకు తెలిసిన ‘దేవయాని’ కథలో నాయిక గురుపు త్రుణ్ణి మోహించింది. ‘మదనరేఖ’ కథలో నాయికనే గురువు పుత్రుడే మోహించాడు. ‘బిల్హణీయం’లో శిష్యురాలే గురువును కామించింది. ఈ కావ్యంలో గురువే శిష్యురాలిని కామించాడు. అయినా, కవి సంయమనం పాటించి శృంగార రస వర్ణన చేయడం దీని ప్రత్యేకత. ఇదే ఈ కవి ప్రతిభకు గొప్ప నిదర్శనం.

గన్నమరాజు గిరిజా మనోహరబాబు

9949013448