05-05-2025 12:00:00 AM
‘కందికొండ రామస్వామి స్మారక జాతీయ పురస్కారం- 2024’ పొందిన కథా సంకలనం
మనసుల్ని మేధోపరంగా కదిలించి, మనుషు ల్ని భౌతికంగా కార్యాచరణలోకి దించే కథ లు రాయడానికి మంచి వస్తువు, దాన్ని తీర్చిదిద్దే పదునైన శిల్పం, అందుకు తగిన భాష ఉంటే చాలు, అది పాఠకుల మన్ననలందుకుంటుంది. కథలు పాఠకుల మన్ననలతోపాటు విమర్శకుల ప్రశంసలు పొంది, కలకాలం నిలిచిపోయే రీతిలో, సమాజానికి మేలు కలిగించేదిగా ఉండాలంటే విషయంపై, దాని పర్యవసానాలపై సంపూ ర్ణ అవగాహన ఉండాలి. ఇది లోతైన అధ్యయనంతో ఏర్పడుతుంది.
ఇట్లా సూక్ష్మాంశాల అధ్యయనం, విషయావగాహన, కదిలించే కథనంతో కథలుగా మల్చిన భిన్న సామాజిక వర్గాల ప్రయాణాలు, మజిలీలే ‘బల్కావ్’ బ్యాక్ప్యాక్ కథలు. ఒక్క ‘బల్కావ్’ తప్ప మిగతా అన్నీ తెలుగువారి ప్రయాణాలే.
ధూల్పేటలో ధక్షత్రియ సబాల్టర్న్ వర్గం దగ్గర ప్రారంభమైన ప్రయాణంలో విజయవాడ పేద బ్రాహ్మణుడి చితికిన బతుకు, ఆదిలాబాద్ అడవిబిడ్డల పోరుబాట, వందల ఏండ్ల క్రితం నాటి కాకతీయుల, ముస్లింల చరిత్ర, ముస్లిం కథకులు కూడా దర్శించని పాతబస్తీ మహిళల చీకటి బతుకులు, కోకాపేట కిట్టీ పార్టీలో ఎగువ మధ్యతరగతి బతుకుల్లోని ఆర్థిక, సామాజిక లెక్కలు, ‘ఇంకా రాత్రి చీకట్లో’ కథలో బందర్ సింద్రీలు, బతుకుదెరువు కోసం మానత్యాగం చేసే రాజస్థానీ బాలికల జీవితాలను శ్రీఊహ ఈ పది కథల ప్రయాణం లో అక్షరబద్ధం చేశారు.
ఇందులో కొన్ని బరువెక్కించే కథలు కాగా, మరికొన్ని బాధ్యతలను గుర్తు చేసేవి. మరికొన్ని కథలు గుండె భారం తగ్గించేవి. టైటిల్ కథ ‘బల్కావ్’లో మనుషుల రుచులు, అభిరుచుల్లోని తేడాలను కండ్లల్లో నీళ్లు చిప్పిల్లే విధంగా చెప్పారు. ‘బల్కావ్’ అంటే బాల్కనీ. కానీ మనల్ని బాల్కనీలోంచి ప్రపంచాన్ని చూపిం చే ప్రయత్నం గాకుండా ఫ్లయిట్ ఎక్కించి వర్జీనియా వరకు తీసుకెళుతుంది.
స్వేచ్ఛ, స్వాతంత్య్రం, సమానత్వాల అవసరాలను ఈ కథలు నొక్కి చెబుతా యి. సమకాలీన సందర్భంలో కథకురాలు స్వేచ్ఛా విహంగమై సంచరించి ఆంక్షలు లేని జీవితాలను కాంక్షిస్తూ బహుశా స్వీయానుభవానికి, లోతైన అధ్యయనాన్ని జోడించి కథలుగా మలిచింది. తద్వారా తన భారాన్ని అయితే దించుకున్నది. అదే సమయంలో పాఠకులకు బాధ్యతను గుర్తుచేసింది.
బాధ్యత ను నిర్వర్తించని వారిని సెల్ఫ్చెక్ చేసుకునే విధంగా పురిగొల్పుతాయి ఈ కథలు. 1970వ దశకపు ఉస్మానియా విశ్వవిద్యాలయపు ప్రగతిశీల ఉద్యమ విద్యార్థి నాయకుడు జార్జిరెడ్డి హత్యకు ధూల్పేట వాసులకు ఉన్న సంబంధాన్ని చిన్నచిన్న విషయాలను లోతుగా పరిశీలించి అప్పటి సమయంలోకి రీవిజిట్ చేసిన కథ ‘లడాయి’.
‘లడాయి’ కథ మళ్లీ 40-50 ఏండ్ల కిందటి ధూల్పేటని పరిచయం చేసింది. కథలో ఒక కౌంటర్ దగ్గర చిల్లర పెడుతూండగా పేపర్ కనబడ్డది కేశవ్కు. ‘ఉస్మానియా వర్సిటీ క్రాంతిధార, ప్రగతిశీల భావాలకు ప్రతిబింబం’ మాటలు కనబడ్డాయి దాని మీద ఉర్దూలో’ అని ఉన్నది. మాటలా, పదాల అన్నది పక్కన పెడితే ‘యూసుఫైన్ కేఫ్’లో అయితే దక్కన్ క్రానికల్, లేదంటే సియాసత్ పేపర్లు మాత్రమే వస్తాయి.
యూసుఫ్ బాబ దర్గా నాంపల్లి లో ఉండడంతో దాని చుట్టూతా చాలా ప్రదేశాల్లో ఈ పేరుతో హోటళ్లు ఉండేవి. నిజానికి ఇరానీ హోటళ్లకు ఎక్కువగా సెక్యులర్ పేర్లుంటాయి. సెవెన్ హెవెన్, త్రిబు ల్ సెవన్, ఏ1 ఇట్లా. సరే మళ్లీ ‘బల్కావ్’లోకి వస్తే 50 ఏండ్ల కింద తెలుగు పేపర్లు హోటళ్లలో వచ్చేది తక్కువ. అందుకే, ఉర్దూ పేపర్ అని శ్రీ ఊహ రాశారు. అయితే, కేశవ్కు ఉర్దూ వచ్చే అవకాశమే లేదు.
ఎందుకంటే, ఆ ప్రాంతంలో ఉర్దూ చదువుకునే విద్యార్థులు 1950ల తర్వాత ఎవ్వరూ లేరు. ఒకవేళ కేశవ్ నిజంగానే ఉర్దూ ప్రత్యేక శ్రద్ధతో నేర్చుకున్నాడని భావిస్తే అతను విద్యార్థి నాయకుడి హత్య కు దూరంగా ఉండేవాడు. ఇది పునఃపరిశీలించాల్సిన అంశం. ‘ఆతీ’ కథలో ఆదిలా బాద్ నుంచి బస్తర్కు వలసెల్లిన ఆదివాసీ ల వేదనాభరిత జీవితాలను, ఉద్యమాల బాట పట్టిన వారికి పోలీసు రాజ్యంలో ఎట్లా ఉరి బిగిస్తున్నారో సాంస్కృతిక నేపథ్యంలో రికార్డు చేశారు.
మరో కథ ‘పరావర్తనం’లో బ్రాహ్మణుల్లోని పేదరికాన్ని బొమ్మ కట్టారు. అయితే, ‘శవం ఎత్తితే కానీ ఇల్లు గడవని’ మనుషులు ఇంకా ఉన్నారా?అనే సందేహం కలుగుతుంది. ‘తరానా’ కథలో రీసెర్చ్ చేసిన చాలా విషయాలు జోడించారు. కాకతీయుల కాలంలో తొలిసారిగా తెలంగాణ పదాన్ని పుస్తకాల్లో కెక్కించింది అమీర్ ఖుస్రో.
ఈ అమీర్ ఖుస్రో కేంద్రంగా సాగిన కథలో ఆనాటి కాకతీయుల కళా వైభవం, హిందూ- ముస్లిం రాజుల రాజకీయ వ్యూహాలు చర్చించి చరిత్రను కండ్ల ముందుంచారు. అలాగే, ‘ముడుపు’ కథలో హజ్రత్ నిజాముద్దీన్ దర్గా నేపథ్యం లో ఆధ్యాత్మిక వాతవరణాన్ని, సూఫీ జం ప్రాశస్త్యాన్ని కూడా పరిశోధన్మాతకంగా రాశారు. ఈ కథ మనల్ని ఢిల్లీ యాత్రను చేయిస్తుంది.
ఒకప్పుడు అరబ్ షేక్లకు అమ్మాయిలను అమ్ముకున్న ఓల్డ్ సిటీలో తాగుబోతు భర్తను ఎదిరించి స్వీయశక్తితో జీవనాన్ని సాగిస్తున్న ముస్లిం మహిళ సాహసోపేత గాథను ‘బర్క త్’ కథగా మలిచారు. ‘చార్మినార్’ కథా సంపుటిలో దాదాపు 60 ఏండ్లకింద నెల్లూరి కేశవస్వామి హైదరా బాద్ ముస్లిం మహిళల దయనీయ జీవితాలను కథలుగా మలిచిండు. ఆ తర్వాత హైదరాబాద్లోని ముస్లిం అమ్మాయి జీవితాన్ని అంతే ఆర్తితో రాసిన కథ ‘బర్కత్’.
ఇంకా ‘రాత్రి చీకట్లో’ కథలో రాజస్థాన్లోని మానం అమ్ముకొని బతికే వ్యథాభరిత జీవితాలను, ఆ సంకెళ్ల నుంచి తప్పించుకున్న అమ్మాయినీ అక్షరబద్ధం చేసింది. కులం, ఆధిపత్యం ఎట్లా స్త్రీపై ఆజమాయిషీ చేస్తాయో చెప్పారు. మరో కథ ‘కిట్టీ పార్టీ’లో కోకాపేట ప్రాంతంలో నివసించే ఉన్నత వర్గాల స్త్రీల మనస్తత్వాలను, లాభనష్టాల లెక్కలుగా మారిన మనుషుల ఆలోచనలను, సం బంధాలను అక్షరబద్ధం చేశారు.
మొత్తమ్మీద అన్ని కథ లూ స్వేచ్ఛ, స్వాతంత్య్రాలను కాంక్షిస్తాయి. పీడనపై తిరుగుబాటు చేయమంటాయి. మత సామరస్యాన్ని బోధి స్తాయి. ఇతరులు మెచ్చేలాకాక తనకు నచ్చేలా మనిషి జీవితం గడపాలని కోరుకుంటాయి. హృదయ మాలిన్యాలు కడిగేసుకునేందుకు ఈ కథలు ఔషధాలవలె పని చేస్తాయి. ఇంత మంచి కథలు తెలుగు పాఠకులకు అందించినందుకు శ్రీ ఊహకు అభినందనలు.
‘బల్కావ్’ బ్యాక్ ప్యాక్ కథలు పుస్తకానికి ఈనెల 4న నాగర్ కర్నూ ల్ జిల్లా కేంద్రంలో నెలపొడుపు సాహిత్య సాంస్కృతిక వేదిక నాగర్ కర్నూల్ తరఫున ‘కందికొండ రామస్వామి స్మారక జాతీయ పురస్కారం’ 2024 అందించారు. ఈ అవార్డును ప్రతి సంవత్సరం ప్రచురించిన కవిత్వం, కథా సంపుటాలలో ఒకరికి ఎంపిక చేసి రూ.పదివేల నగదుతో సత్కరిస్తారు. ఈసారి శ్రీ ఊహ రచించిన ఈ కథాసంపుటి ఎంపికైంది.
డా.సంగిశెట్టి శ్రీనివాస్
9849220321