పచ్చని పల్లెల్లో రాజకీయ చిచ్చు
పోలీసులు న్యాయబద్ధంగా వ్యవహరించాలి..
బీఆర్ఎస్ పార్టీ సూర్యాపేట జిల్లా అధ్యక్షులు, మాజీ ఎంపీ బడుగుల లింగయ్య యాదవ్..
హుజూర్ నగర్: పచ్చని పల్లెల్లో కాంగ్రెస్ పార్టీ రాజకీయ చిచ్చును అగ్గి రాజేస్తుందని బీఆర్ఎస్ పార్టీ సూర్యాపేట జిల్లా అధ్యక్షులు, మాజీ ఎంపీ బడుగుల లింగయ్య యాదవ్ అన్నారు. బీఆర్ఎస్ నాయకులను బైండోవర్ పేరుతో చిత్రహింసలకు గురి చేస్తున్నారని సోమవారం స్థానిక బీఆర్ఎస్ నాయకులతో కలసి హుజూర్ నగర్ సీఐ చరమంద రాజుతో మాట్లాడారు. అనంతరం ఏర్పాటుచేసిన విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ... పోలీసులు న్యాయబద్ధంగా వ్యవహరించాలని, అధికారం ఎవరికి ఎప్పుడు శాశ్వతం కాదన్నారు. తాము కూడా పది సంవత్సరాలు అధికారంలో ఉన్నామని, వ్యక్తిగతంగా ఎవరిపై కక్ష సాధింపులు సాధించలేదన్నారు. ప్రజా క్షేత్రంలో ఎవరికి అవకాశం ఇస్తే వాళ్ళు గెలుస్తారు.
ప్రస్తుతం గ్రామాల్లో కాంగ్రెస్ పార్టీపై తీవ్రస్థాయిలో వ్యతిరేకత ఉందన్నారు. ఆ పార్టీకి అభ్యర్థులు లేకపోవడంతో బీఆర్ఎస్ పార్టీ వ్యక్తులని భయభ్రాంతులకు గురిచేసి వారి పార్టీ తరఫున పోటీ చేయించే ప్రయత్నం చేస్తున్నారని విమర్శించారు. ప్రస్తుతం జరిగే ఎన్నికల వల్ల అధికార పార్టీకి, ప్రతిపక్ష పార్టీకి ఇబ్బంది ఏమీ లేదని, ప్రజాక్షేత్రంలో ఎన్నికలు ఎన్నికలాగే నిర్వహించాలని భయభ్రాంతులకి గురి చేయడం వల్ల పచ్చని పల్లెల్లో రాజకీయ చిచ్చు చెలరేగుతుందని అన్నారు.ఈ కార్యక్రమంలో జిల్లా డిసిసిబి డైరెక్టర్ దొండపాటి అప్పిరెడ్డి, వైవిఆర్,కెయల్ యన్ రెడ్డి,మాజీ జెడ్పిటిసి కొప్పుల సైదిరెడ్డి ,జక్కుల నాగేశ్వరావు, పట్టణ ప్రధాన కార్యదర్శి అమర్ గౌడ్, పచ్చిపాల ఉపేందర్, తదితరులు పాల్గొన్నారు.




