17-02-2026 12:36:00 AM
మూడు తరాల సేవల నుంచి ఛైర్మన్ అభ్యర్థిత్వం వరకు
గద్వాల, ఫిబ్రవరి 16 : గద్వాల పట్టణ రాజకీయాల్లో తుమ్మల కుటుంబం ప్రత్యేక గుర్తింపును సంపాదించుకుంది. మూడు దశాబ్దాలకు పైగా మున్సిపల్ రాజకీయాల్లో చురుకైన పాత్ర పోషిస్తూ, పట్టణ అభివృద్ధిలో తమ వంతు సేవలను అందించిన ఈ కుటుంబం ఇప్పుడు మరో కీలక దశలోకి ప్రవేశించింది. మొదటిగా, జయలక్ష్మి మామ తుమ్మల నరసింహులు 1988 నుండి 1993 వరకు కౌన్సిలర్గా సేవలందించారు. ఆ తర్వాత జయలక్ష్మి అత్త తుమ్మల వెంకటమ్మ 2000 నుండి 2005 వరకు కౌన్సిలర్గా ప్రజలకు సేవచేశారు.
అనంతరం జయలక్ష్మి భర్త తుమ్మల నరసింహులు 2014 నుండి 2019 వరకు కౌన్సిలర్గా బాధ్యతలు నిర్వర్తించారు. ఇలా కుటుం బంలోని ప్రతి తరం పట్టణ ప్రజల విశ్వాసాన్ని గెలుచుకుని, మున్సిపల్ పాలనలో తమ ముద్ర వేశారు. ప్రస్తుతం 2026లో జయలక్ష్మి కాంగ్రెస్ పార్టీ తరఫున ఛైర్మన్ అభ్యర్థిగా ఎన్నిక కావడం ఈ కుటుంబ రాజకీయ వారసత్వానికి కొత్త అధ్యాయం కావడం విశేషం.కుటుంబ సభ్యులంద రూ గద్వాల పట్టణ కౌన్సిలర్లుగా సేవలందించడం అరుదైన సంఘటనగా స్థానికులు అభిప్రాయపడుతున్నారు.
ప్రజా సేవ పట్ల అంకితభావం, అభివృద్ధి దిశగా కృషి, పార్టీ పట్ల నిబద్ధత ఇవే తుమ్మల కుటుంబాన్ని రాజకీయంగా నిలబెట్టిన ప్రధాన అంశాలుగా రాజకీయ వర్గాలు విశ్లేషిస్తున్నాయి. జయలక్ష్మి అభ్యర్థిత్వంతో గద్వాల మున్సిపల్ రాజకీయాల్లో మరోసారి తుమ్మల కుటుంబం చర్చనీయాంశమైంది. ఆమె విజన్, కుటుంబ అనుభవం, పార్టీ మద్దతు కలిసి రాబోయే రోజుల్లో పట్టణ అభివృద్ధికి దోహదపడతాయనే ఆశాభావం వ్యక్తమవుతోంది.