07-02-2026 12:00:00 AM
వరంగల్ జిల్లా కలెక్టర్ సత్య శారద దేవి
వరంగల్,ఫిబ్రవరి 6 ( విజయ క్రాంతి):నర్సంపేట జెడ్పి సెకండరీ స్కూల్ లో మునిసిపల్ ఎన్నికల సందర్భంగా శుక్రవారం పీఓలు, ఏపీఓలకు ఏర్పాటు చేసిన శిక్షణ కార్యక్రమానికి జిల్లా కలెక్టర్ డాక్టర్ సత్య శారద హాజరయ్యారు.ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ ఎన్నికల నిర్వహణలో ప్రతి అధికారి బాధ్యతతో, నిబంధనలకు అనుగుణంగా విధులు నిర్వర్తించాలని సూచించారు.
పోలింగ్ నిర్వహణలో పారదర్శకత, సమర్థత ఎంతో కీలకమని, చిన్న పొరపాటు జరగకుండా అప్రమత్తంగా వ్యవహరించాలని అన్నారు.శిక్షణ అనంతరం నర్సంపేట మునిసిపల్ కార్యాలయంలో ఎన్నికల నిర్వహణకు వినియోగించే ఎన్నికల సామగ్రిని జిల్లా కలెక్టర్ పరిశీలించారు. బ్యాలెట్ బాక్సులు, సీల్స్, బ్యాలెట్ పేపర్లు, రిజిస్టర్లు తదితర సామగ్రి సరైన సంఖ్యలో, సురక్షితంగా ఉండేలా చర్యలు తీసుకోవాలని అధికారులకు సూచించారు. మునిసిపల్ కార్యాలయంలో ఏర్పాటు చేసిన పోస్టల్ బ్యాలెట్ ఫెసిలిటేషన్ కేంద్రాన్ని కూడా జిల్లా కలెక్టర్ పరిశీ లించారు.
పోస్టల్ బ్యాలెట్ ద్వారా ఓటు హక్కు వినియోగించుకునే అర్హులైన ఓటర్లకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా అన్ని సౌకర్యాలు అందించాలని, ప్రక్రియ నిబంధనల ప్రకారం, సమర్థంగా నిర్వహించాలని అధికారులను ఆదేశించారు.ఎన్నికల విధుల్లో ఉన్న ప్రతి అధికారి పూ ర్తిస్థాయి అవగాహనతో పనిచేయాలని, ఎలక్షన్ కమిషన్ మార్గదర్శకాలను కచ్చితంగా పాటించాలని జిల్లా కలెక్టర్ అన్నారు.
ఈ సందర్భంగా శిక్షణ కార్యక్రమం నిర్వహిస్తున్న పీఎం శ్రీ జెడ్పి సెకండరీ స్కూల్ పరిసరాలను జిల్లా కలెక్టర్ డాక్టర్ సత్య శారద పరిశీలించారు. పాఠశాల పరిసరాలు పరిశుభ్రంగా లేకపోవడంపై కలెక్టర్ అసంతృప్తి వ్యక్తం చేస్తూ, ప్రాధానోపాధ్యులు తక్షణమే శుభ్రత చర్యలు చేపట్టి పాఠశాల పరిసరాలను పరిశుభ్రంగా ఉంచాలని ఆదేశించారు.ఈ కార్యక్రమంలో ఆదనవు కలెక్టర్ సంధ్యారాణి,తదితరులు పాల్గొన్నారు.