ప్రధానమంత్రి ధన్, ధాన్య యోజన పథకాన్నిసమర్థంగా అమలు చేయాలి
కలెక్టర్ సందీప్ కుమార్ ఝా
జనగామ, ఏప్రిల్ 9 (విజయక్రాంతి): ప్రధానమంత్రి ధన్ ధాన్య యోజన పథకాన్ని సమర్థంగా అమలు చేయాలని కలెక్టర్ సందీప్ కుమార్ ఝా అధికారులను ఆదేశించారు. గురువారం, జిల్లా సమీకృత కలెక్టర్ కార్యాలయంలోని మినీ కాన్ఫరెన్స్ హాల్లో ప్రధానమంత్రి ధన్ ధాన్య యోజన పథకం అమలుపై కలెక్టర్ సంబంధిత అధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించారు.
ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ.. ఈ పథకంలో నిర్దేశించిన లక్ష్యాల వంటి పంటల ఉత్పాదకత పెంపొందించడం, సుస్థిర వ్యవసాయ పద్ధతుల అవలంబన, రైతులకు సులభతరంగా రుణ సహాయం అందించడం, ప్రత్యామ్నాయ పంటల సాగు, వ్యవసాయ అనుబంధ పరిశ్రమల అభివృద్ధి, మేలైన నీటి యాజమాన్యం, వ్యవసాయ రంగంలో సాంకేతికత అభివృద్ధి గురించి చర్యలు చేపట్టాలని సూచించారు.
పీఎండీడీకేవై పథకం అమలులో జిల్లాను ఆదర్శ జిల్లాగా నిలబెట్టేలా ప్రతి శాఖ సమన్వయంతో పని చేసి, లక్ష్యాలను చేరుకోవాలని తెలిపారు. ఈ సమావేశంలో వ్యవసాయ శాఖ అధికారి అంబికా సోనీ, అనుబంధ శాఖల అధికారులు, సిబ్బంది, తదితరులు పాల్గొన్నారు.




