06-05-2025 01:35:33 AM
హైదరాబాద్, మే 5 (విజయక్రాంతి): మిస్ వరల్డ్ 2025 పోటీలు విజయవంతంగా నిర్వహించేందుకు ఘనంగా ఏర్పాట్లు చేయాలని సీఎం రేవంత్రెడ్డి అధికారులను ఆదేశించారు. మే 10 నుంచి 31 వరకు జరిగే ప్రపంచస్థాయి పోటీల నిర్వహణకు కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్లు చేయాలని పోలీసు అధికారులను అప్రమత్తం చేశారు.
మిస్ వరల్డ్ పోటీల నిర్వహణల్లో ఏ చిన్న పొరపాటు జరగకుండా అధికారులు వ్యవహరించాలని, చిత్తశుద్ధితో పనిచేయాలని సీఎం సూచించారు. తెలంగాణ ఖ్యాతిని విశ్వమంతటా పరిచయం చేసేందుకు ఉపయోగపడే మిస్ వరల్డ్ 2025 వేడుకలను ప్రతిష్ఠాత్మకంగా నిర్వహించాలన్నారు. ప్రపంచ వ్యాప్తంగా 116దేశాలకు చెందిన యువతులు ఈ పోటీల్లో పాల్గొంటున్నారని, ఎలాంటి లోటుపాట్లు లేకుండా వారికి ఆతిథ్యం ఇవ్వాలని అధికారులను ఆదేశించారు.
మిస్ వరల్డ్ 2025 ఏర్పాట్లపై సోమవారం హైదరాబాద్లోని కమాండ్ కంట్రోల్ సెంటర్లో సీఎం రేవంత్రెడ్డి ఉన్నతస్థాయి సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా సీఎం మాట్లాడుతూ.. పోటీదారులతో పాటు దేశవిదేశాల నుంచి ఈవెంట్ కవరేజీకి దాదాపుగా మూడువేల మంది మీడియా ప్రతినిధులు హాజరవుతారన్నారు.
వివిధ దేశాల నుంచి పోటీలకు వచ్చే వారిని తెలంగాణ సంస్కృతి సంప్రదాయాలతో స్వాగతించాలని ఆదేశించారు. పర్యాటక శాఖతో పాటు అన్ని విభాగాలు సమన్వయంతో పనిచేయాలని, అధికారులకు అప్పగించిన బాధ్యతలు నిర్వహించాలన్నారు.
ప్రతీ కార్యక్రమాన్ని విజయవంతం చేయాలి..
మే 10 నుంచి 31 వరకు వరుసగా జరిగే కార్యక్రమాల షెడ్యూల్కు అనుగుణంగా భద్రతా ఏర్పాట్లు చేయాలని అధికారులను ఆదేశించారు. ప్రతి కార్యక్రమానికి ఒక నోడల్ అధికారిని నియమించాలని సూచించారు. మే 10వ తేదీ సాయంత్రం హైదరాబాద్ గచ్చిబౌలి ఇండోర్ స్టేడియంలో మిస్ వరల్డ్ ప్రారంభోత్సవం నుంచి 31వ తేదీన జరిగే గ్రాండ్ ఫినాలే వరకు ప్రతీ కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు.
హైదరాబాద్లోని చార్మినార్, లాడ్బజార్తో పాటు తెలంగాణ తల్లి, సెక్రటేరియట్తో పాటు రాష్ట్రంలోని పలు పర్యాటక ప్రాంతాలను మిస్ వరల్డ్ పోటీదారులు సందర్శించనున్నందున అవసరమైన రవాణా, వసతులు కల్పించాలని చెప్పారు.
మహిళా సాధికారతను చాటిచెప్పేలా..
మహిళా సాధికారతను చాటి చెప్పేలా రాష్ట్రంలో ఐకేపీ మహిళలు నిర్వహిస్తున్న డ్వాక్రా బజార్ సందర్శనతో పాటు ఉప్పల్ స్టేడియంలో ఐపీఎల్ సెమీఫైనల్స్ తిలకించేందుకు అవసరమైన ఏర్పాట్లు చేయాలన్నారు. హైదరాబాద్ మిస్ వరల్డ్ కార్యక్రమాలు జరిగే ప్రాంతాల్లో ట్రాఫిక్ ఇబ్బందులు, విద్యుత్ అంతరాయం లేకుండా జాగ్రత్తలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు. వాతావరణ సూచనలకు అనుగుణంగా తగిన ముందస్తు ఏర్పాట్లు చేసుకోవాలని, ఈదురు గాలులు, వర్షాలు వచ్చినా గ్రేటర్ సిటీ పరిధిలో ఇబ్బందులు తలెత్తకుండా జీహెచ్ఎంసీతో పాటు హైడ్రా విభాగాలు అప్రమత్తంగా ఉండాలని సీఎం సూచించారు.
హైదరాబాద్ అంతటా సందడి కనపడాలి..
రాష్ట్రంలోని ప్రభుత్వ గురుకులాలు, బీసీ, ఎస్సీ, ఎస్టీ వెల్ఫేర్ రెసిడెన్షియల్ స్కూళ్లు, మోడల్ స్కూళ్లు, కస్తూర్బా స్కూళ్లకు చెందిన విద్యార్థులను కూడా ఒకరోజు ఈ వేడుకలకు తీసుకొచ్చి చూపించాలన్నారు. హైదరాబాద్ అంతటా మిస్ వరల్డ్ పోటీల సందడి కనిపించేలా తోరణాలు, లైటింగ్, హోర్డింగ్లతో పాటు సిటీలోని ముఖ్యమైన జంక్షన్లు, చారిత్రక ప్రదేశాలను అందంగా అలంకరించాలని ఆదేశించారు.
కార్యక్రమంలో మంత్రులు జూపల్లి కృష్ణారావు, పొంగులేటి శ్రీనివాస్రెడ్డి, సీఎం సలహాదారు వేం నరేందర్రెడ్డి, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి రామకృష్ణారావు, ప్రభుత్వ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి జయేశ్ రంజన్, డీజీపీ జితేందర్, సిటీ పోలీస్ కమీషనర్ సీవీ ఆనంద్, రాచకొండ పోలీస్ కమిషనర్ సుధీర్బాబు, ఏడీజీపీ స్టీఫెన్ రవీంద్రతో పాటు అన్ని విభాగాల ఉన్నతాధికారులు పాల్గొన్నారు.