calender_icon.png 30 May, 2025 | 9:01 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

బూతు పురాణ ఫలితం..

29-05-2025 02:00:47 AM

-  డీఈవో సరెండర్

- ఇంచార్జిగా డీఈవో డైట్ ప్రిన్సిపాల్

కరీంనగర్, మే 28 (విజయ క్రాంతి): ఇటీవల నిర్వహించిన ప్రభుత్వ పాఠశాల ఉపాధ్యాయుల శిక్షణ కార్యక్రమంలో ఉపాధ్యాయులపై అనుచిత వ్యాఖ్యలు చేసినందుకుగాను జిల్లా విద్యాధికారి జనార్ధన్ రావును ప్రభుత్వానికి సరెండర్ చేస్తూ జిల్లా కలెక్టర్ పమేలా సత్పతి ఉత్తర్వులు జారీ చేశారు.

కరీంనగర్ జిల్లా విద్యాధికారిగా డైట్ కళాశాల ప్రిన్సిపాల్ మొండ య్యకు అదనపు బాధ్యతలు అప్పగించారు. అల్ఫోర్స్ విద్యాసంస్థలో ప్రభుత్వ ఉపాధ్యాయుల శిక్షణ కార్యక్రమం విడతలవారీగా కొనసాగుతున్నది. గత శనివారం మొదటి విడత ముగింపు కార్యక్రమానికి హాజరైన విద్యాధికారి జనార్ధన్ రావు మాట్లాడుతూ ‘అబ్బాయిలకు వంట రాకపోతే... వారి భార్య లు లేచిపోతారు’ అంటూ వ్యాఖ్యానించారు.

ఈ వ్యాఖ్యలే కాకుండా మీరు చదువు చెప్పకుంటే మీకు కుష్టు రోగం వస్తుందని, గుండె పోటు వస్తుందని రకరకాల శాపనార్థాలు పెడుతూ మహిళా ఉపాధ్యాయుల మనోభావాలను దెబ్బతీసేవిధంగా మాట్లాడడం వివాదానికి దారితీసింది. గతంలోనే డీఈవై వైఖరిపై పలుమార్లు కలెక్టర్, ఇతర విద్యాశాఖ ఉన్నతాధికారులతో అక్షింతలు పడినా జనార్ధన్ రావు తీరు మారలేదు.

ఇటీవల ఉపాధ్యాయులకు నిర్వహించిన వేర్వేరు శిక్షణ కార్యక్రమాల్లో డీఈవో జనార్ధన్ రావు భార్యభర్తల గురించి మాట్లాడుతూ ‘అబ్బాయిలకు వంట రాకపోతే వారి భార్యలు లేచిపోతారని’ అంటూ చేసిన వ్యాఖ్యలపై ఉపాధ్యాయులు మండిపడ్డారు. అలాగే వేదికపై నుంచి ఉపాధ్యాయులను కించపరిచేలా మాట్లాడటం, అందరికీ ఒక సంసారమే.. కానీ, నాకు కష్టాలు అనుభవించే వాడికే తెలుస్తుంది అంటూ ఆయన వివిధ కార్యక్రమాల్లో అసందర్భ వ్యాఖ్యలు చేశారు.

డీఈవో వ్యవహారశైలిపై పలువురు ఉపాధ్యాయులు ఉన్నతాధికారులకు ఫిర్యాదు చేశారు. డీటీఎఫ్ ఉపాధ్యాయ సంఘం విద్యాశాఖ అధికారులకు ఫిర్యాదు చేయడం, ఉపాధ్యాయులు కలెక్టర్ కు ఫిర్యాదు చేయడం, పలుమార్లు హెచ్చరించినా, మందలించినా జనార్దన్ రావు తీరు మారకపోవడంతో ఎట్టకేలకు కలెక్టర్ ప్రభుత్వానికి సరెండర్ చేశారు.