నిర్మాణ దశలో కూలిన భవనం పైకప్పు
02-06-2024 12:05 AM
రాజేంద్రనగర్, జూన్ 1 : నిర్మాణదశలో ఉన్న ఓ భవనం పైకప్పు కూలిన సంఘటన నార్సింగి పోలీసుస్టేషన్ పరిధిలో చోటుచేసుకుంది. అదృష్టవశాత్తు ప్రమాద సమయంలో ఎవరూ లేకపోవడంతో ప్రాణాపాయం తప్పింది. నార్సింగి ఎస్సై సతీష్కుమార్ తెలిపిన వివరాల ప్రకారం.. మణికొండ మున్సిపాలిటీ పరిధిలోని అల్కాపురి టౌన్షిప్ రోడ్ నెంబర్ 13లో ఆర్ఆర్ మాల్ యాజమాన్యం ఐదు అంతస్తుల భవనాన్ని నిర్మిస్తుంది. ప్రస్తుతం మూడవ ఫ్లోర్లో నిర్మాణం కొనసాగుతుంది. ఈ నేపథ్యంలో శనివారం రెండో అంతస్తు స్లాబ్ పనులు చేస్తున్న క్రమంలో స్లాబ్ ఒక్కసారిగా కూలింది. దీంతో, పనివారు, స్థానికులు భయబ్రాంతులకు గురయ్యారు. కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.






