22-10-2025 12:00:00 AM
నిజామాబాద్, అక్టోబర్ 21 : (విజయ క్రాంతి): శాంతి భద్రతల పరిరక్షణ కోసం అహరహం శ్రమిస్తూ అసువులు బాసిన పోలీసు అమరవీరుల త్యాగాలు వెలకట్టలేనివని, సమాజం ఎల్లవేళలా వారికి రుణపడి ఉంటుందని మల్టీ జోస్ ఐ.జీ ఎస్.చంద్రశేఖర్ రెడ్డి, కలెక్టర్ టి వినయ్ కృష్ణారెడ్డి, పోలీస్ కమిషనర్ పి. సాయి చైతన్య అన్నారు. విధి నిర్వహణలో భాగంగా సంఘ విద్రోహ శక్తులతో పోరాడుతూ, అమరులైన పోలీసులను స్మరించుకోవడం, వారి కుటుంబాల త్యాగాలను గుర్తించడం ప్రతి ఒక్కరి కనీస బాధ్యత అని గుర్తు చేశారు.
పోలీసు అమరుల సంస్మరణ దినోత్సవం సందర్భంగా జిల్లా కేంద్రంలోని పోలీస్ హెడ్ క్వార్టర్స్ లో జిల్లా పోలీసు శాఖ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో మల్టీ జోస్ ఐ.జీ, కలెక్టర్ ముఖ్య అతిథిలుగా పాల్గొన్నారు. పోలీస్ కమిషనర్ సాయి చైతన్యతో కలిసి పోలీసు అమరవీరుల స్థూపం వద్ద పుష్పగుచ్చాలు సమర్పించి నివాళులర్పించారు. రెండు నిమిషాలు మౌనం పాటించి శ్రద్ధాంజలి ఘటించారు.
ఈ సందర్భంగా ఐ.జీ చంద్రశేఖర్ రెడ్డి మాట్లాడుతూ, విరామం లేకుండా అనునిత్యం, ప్రతి క్షణం పోలీసులు శాంతి భద్రతల పరిరక్షణ విధుల్లో నిమగ్నం అయి ఉంటారని అన్నారు. ఈ క్రమంలో ఎదురయ్యే అనేక సవాళ్లను తమ ప్రాణాలను పణంగా పెట్టీ ధైర్యంగా ఎదుర్కొంటారని ఐ.జీ అన్నారు. ఈ నేపథ్యంలోనే ఇటీవలే నిజామాబాద్ జిల్లా కేంద్రంలో అసాంఘిక శక్తుల చేతిలో ప్రమోద్ కుమార్ అనే పోలీసు వీర మరణం పొందారని ఆవేదన వ్యక్తం చేశారు.
అమరుల త్యాగాలను వృధా కానివ్వమని, వారి స్ఫూర్తితో మరింత బాధ్యతాయుతంగా శాంతి భద్రతల పరిరక్షణ విధుల్లో నిమగ్నం కావాలని పిలుపునిచ్చారు. పోలీస్ కమిషనర్ పి.సాయి చైతన్య మాట్లాడుతూ, ఈ ఏడాది దేశవ్యాప్తంగా 191 మంది పోలీసులు అమరులయ్యారని అన్నారు.
నిజామాబాద్ కమిషనరేట్ పరిధిలో 1986 నుండి ఇప్పటివరకు 18 మంది పోలీసులు అసాంఘిక శక్తులతో పోరాడుతూ అసువులు బాశారని ఆవేదన వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో అదనపు డీసీపీ (అడ్మిన్) బస్వారెడ్డి, అదనపు డిసిపి (ఎ.ఆర్) రామ్ చందర్ రావ్, నిజామాబాద్, ఆర్మూర్, బోధన్, సిసిఎస్, ట్రాఫిక్, సి.టి.సి ఏసీపీలు, స్పెషల్ బ్రాంచ్ ఇన్స్పెక్టర్ , సీఐలు, ఎస్.ఐలు , పోలీసు సిబ్బంది , అమరవీరుల కుటుంబ సభ్యులు పాల్గొన్నారు.