calender_icon.png 11 December, 2025 | 4:30 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

హరిపురం సర్పంచ్ నువ్వా.. నేనా

10-12-2025 06:54:12 PM

గత ఎన్నికల్లో సర్పంచ్ కు సమాన ఓట్లు..

డ్రా తీసిన అధికారులు..

మళ్లీ బరిలో నిలుస్తున్న పాత అభ్యర్థులే

రేపు జరిగే ఎన్నికల్లో గెలుపు ఎవరిదో.. 

ముత్తారం (విజయక్రాంతి): పెద్దపల్లి జిల్లా ముత్తారం మండలంలోని హరిపురం గ్రామంలో రేపు జరగనున్న సర్పంచ్ ఎన్నికల్లో నువ్వా.. నేనా అన్నట్లుగా ఎన్నికలు కొనసాగుతున్నాయి. గత సర్పంచ్ ఎన్నికల్లో ఇద్దరు మాత్రమే సర్పంచ్ గా పోటీ చేయగా, గ్రామ ప్రజలు వారికి  సమాన ఓట్లు వేశారు. దీంతో అధికారులు, గ్రామ ప్రజల్లో ఉత్కంఠ నెలకొంది. ఎట్టకేలకు ఉన్నత అధికారుల ఆదేశాల మేరకు అధికారులు డ్రా తీశారు. దీంతో ఎవరు గెలుస్తారో అని గ్రామస్తులు ఉత్కంఠ భరితంగా ఎదురుచూశారు. డ్రాలో అప్పటి కాంగ్రెస్ పార్టీ బలపరిచిన అభ్యర్థి మెంగాని తిరుపతిపై బీఆర్ఎస్ అభ్యర్థి సంపత్ రావు డ్రాలో గెలుపొందారు. గత ఆరు సంవత్సరాల తర్వాత మళ్లీ జరుగుతున్న సర్పంచ్ ఎన్నికల్లో పాత అభ్యర్థులే బరిలో నిలిచారు. 

కానీ ఇప్పుడు అప్పటి కాంగ్రెస్ అభ్యర్థి బీఆర్ఎస్ లోకి ఇప్పటి బీఆర్ఎస్ అభ్యర్థి కాంగ్రెస్ లోకి జంపు అయ్యారు. దీంతో రేపు జరిగే ఎన్నికల్లో గెలుపు ఎవరిదోనని ప్రజల్లో చర్చ నడుస్తుంది. గ్రామ ప్రజలు ఎవర్ని సర్పంచ్ అభ్యర్థిగా ఎన్నుకుంటారో... ఇప్పుడు మండల జిల్లా రాష్ట్రస్థాయిలో ప్రజలు ఎదురుచూస్తున్నారు. గ్రామంలో మాత్రం ఇరువురి మధ్య తీవ్రంగా పోటీ ఉందని, గతంలో లాగే గ్రామ ప్రజలు ఇటు సంపత్ రావుకు అటు తిరుపతికి సమానంగా మద్దతు ఉన్నట్లు కనిపిస్తుందని, కానీ గ్రామస్తులు గతంలో పనిచేసిన సర్పంచ్ కి మద్దతిస్తారా... లేక గతంలో డ్రాలో ఓటమిపాలైన తిరుపతికి ఓటు వేసి మద్దతిస్తారా నేడు తేలిపోనుంది.