ప్రవాస భారతీయుల సేవలు గర్వకారణం
హీరో విజయ్ దేవరకొండ అమెరికాలో 43వ ‘ది వరల్డ్ లార్జెస్ట్ ఇండియా డే పెరేడ్’లో సందడి చేశారు. ఫెడరేషన్ ఆఫ్ ఇండియన్ అసోసియేషన్స్ ఆధ్వర్యంలో జరిగిన ఈ వేడుకకు న్యూయార్క్లోని అక్కడి మాడిసన్ అవెన్యూ వేదికయ్యింది. ‘సర్వే భవంతు సుఖినః’ అనే థీమ్తో ఏర్పాటుచేసిన ఈ వేడుకలకు విజయ్ దేవరకొండ గ్రాండ్ మార్షల్గా వ్యవహరించారు. ఈ వేడుకలో స్థానిక అమెరికన్లతోపాటు భారీ సంఖ్యలో ప్రవాస భారతీయులు కూడా పాల్గొన్నారు.
ఈ వేడుక సందర్భంగా ప్రత్యేకంగా అలంకరించిన ప్రఖ్యాత ఎంపైర్ బిల్డింగ్ మన జాతీయ జెండాలోని మూడు రంగుల విద్యుత్ కాంతులతో వెలిగిపోయింది. ఈ మువ్వన్నెల లైటింగ్ను మన రౌడీ హీరో స్విచ్ఛాన్ చేసి ప్రారంభించారు. ఈ సందర్భంగా విజయ్ దేవరకొండ మాట్లాడుతూ.. “అందరికీ స్వాతంత్య్ర దినోత్సవ శుభాకాంక్షలు. ప్రవాస భారతీయ సోదరులు మనదేశ గొప్పదనాన్ని ప్రపంచానికి చాటుతున్నారు.
ఎంపైర్ స్టేట్ బిల్డింగ్పై మన మూడు రంగులు చూడటం సంతోషాన్ని కలిగిస్తోంది. దేశం కోసం వీళ్లు చేస్తున్న సేవ చూస్తుంటే గర్వంగా ఉంది. మన పెద్దలు ఎంతోమంది చేసిన త్యాగాలు, వారి కృషి వల్లే మనం ఇంత ఆనందంగా స్వాతంత్య్ర దినోత్సవం జరుపుకోగలుగుతున్నాం, జీవించగలుగుతున్నాం” అన్నారు.






