రియల్ ఎస్టేట్ కంపెనీలా రాష్ట్ర ప్రభుత్వం
- ‘భూ భారతి’ పేరుతో సామాన్యుల భూములకు ఎసరు
- బీజేపీ రాష్ట్ర ముఖ్య అధికార ప్రతినిధి ఎన్వీ సుభాష్
హైదరాబాద్, జూలై 7 (విజయక్రాంతి): రియల్ ఎస్టేట్ కంపెనీలా కాంగ్రెస్ ప్రభుత్వం ఉందని, ‘భూ భారతి’ పేరుతో సామాన్యుల భూములకు ఎసరు పెడుతుందని బీజేపీ రాష్ట్ర ముఖ్య అధికార ప్రతినిధి ఎన్వీ సుభాష్ ఆరోపించారు. కేసీఆర్ మార్కు ‘ధరణి’ లోపాలను పెద్ద భూతంలా చూపించి, ఇప్పుడు ‘భూ భారతి’ పేరుతో సామాన్య రైతుల ప్రమేయం, ఓటీపీలు లేకుండానే ఆన్లైన్ వ్యవస్థలను హ్యాక్ చేసి డిజిటల్ కబ్జాలకు తెరలేపారని ఆరోపించారు.
బీజేపీ రాష్ట్ర కార్యాలయంలో మంగళవారం మీడియాతో ఆయన మాట్లాడుతూ సీఎం రేవంత్రెడ్డి ఒకప్పటి రియల్ ఎస్టేట్ ఏజెంట్ స్థాయి నుండి ఇప్పుడు ప్రభుత్వాన్నే ఒక రియల్ ఎస్టేట్ కంపెనీగా మార్చేసి, రాబోయే ఎన్నికల ఫండ్స్ కోసం కాంగ్రెస్ నేతలతో కలిసి సామాన్యుల భూములకు ఎసరు పెడుతున్నారన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం ఆరు గ్యారెంటీలు, 420 హామీలను గాలికొదిలేసిందన్నారు. ప్రభుత్వ నిర్వాకం వల్ల తెలంగాణ రాష్ట్ర ఉద్యోగులు, వారి కుటుంబ సభ్యులు నష్టపోతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు.






