18-05-2025 12:17:03 AM
కమల్హాసన్ కథానాయకుడిగా నటిస్తున్న గ్యాంగ్స్టర్ డ్రామా ‘థగ్లైఫ్’. దర్శకుడు మణిరత్నం దీన్ని తెరకెక్కిస్తున్నారు. ఇండియన్ సినిమాలోని ఈ ఇద్దరు లెజెండరీల కాంబోలో 36 ఏళ్ల తర్వాత వస్తున్న చిత్రం కావటంతో మొదట్నుంచీ ప్రేక్షకుల్లో భారీ అంచనాలున్నాయి.
త్రిష కథానాయిక కాగా మలయాళ నటుడు జోజు జార్జ్తోపాటు హీరో గౌతమ్ కార్తీక్, శింబు, ఐశ్వర్యలక్ష్మి ఇందులో కీలక పాత్రలు పోషించారు. రాజ్ కమల్ ఫిలిమ్స్ ఇంటర్నేషనల్, మద్రాస్ టాకీస్, రెడ్ జెయింట్ మూవీస్ సంయుక్తంగా నిర్మించిన ఈ చిత్రాన్ని టాలీవుడ్ హీరో నితిన్ తండ్రి ఎన్ సుధాకర్రెడ్డి శ్రేష్ఠ్ మూవీస్ ద్వారా తెలుగులో విడుదల చేస్తున్నారు.
ఈ సినిమా జూన్ 5న థియేటర్లలో విడుదల కానుంది. ఈ నేపథ్యంలో చిత్రబృందం తెలుగు వెర్షన్ ట్రైలర్ను శనివారం విడుదల చేసింది. ఈ సినిమా నమ్మక ద్రోహం, ఈగోతో కూడిన ప్రపంచంలోకి ప్రేక్షకులను తీసుకెళ్లనున్నట్టు ట్రైలర్ చూస్తే తెలుస్తోంది. కమల్హాసన్ పవర్ ఫుల్ గ్యాంగ్స్టర్ పాత్రలో అదరగొట్టారు. ‘ఇది యముడికీ నాకూ జరిగే కథ’ అంటూ ఆయన చెప్పిన డైలాగ్ ఆకట్టుకుంది. ఈ చిత్రానికి సంగీతం: ఏఆర్ రెహమాన్; సినిమాటోగ్రఫీ: రవి కే చంద్రన్; ఎడిటర్: శ్రీకర్ ప్రసాద్.