సామాన్యుడు విలవిల
పశ్చిమాసియాలో యుద్ధం యావత్ ప్రపంచాన్ని ప్రభావితం చేస్తున్నది. గ్యాస్ సిలిండర్ కొరత వల్ల సామాన్యుల వంటింట్లో సెగలు పుట్టిస్తున్నది. చమురు సంక్షోభం రవాణా దెబ్బతీస్తున్నది. నిత్యావసర ధరల పెరుగుదలకు కారణమవుతున్నది. ఇరాన్- అమెరికా, ఇజ్రాయెల్ మధ్య మొదలైన ఈ రణం, కేవలం ఆ దేశాలకే పరిమితం కాకుండా అంతర్జాతీయ ఇంధన సరఫరా వ్యవస్థను కుదిపేస్తున్నది. యుద్ధం ప్రారంభమై మూడు వారాలు కావొస్తున్నా ఉద్రిక్తతలు తగ్గకపోవడం అంతర్జాతీయం గా ఆందోళన కలిగిస్తున్నది.
సౌదీ అరేబియా ముడి చమురు ధరను బ్యారెల్కు 1౮0 డాలర్లకు చేరవచ్చని ఇప్పటికే ప్రకటించింది. చమురు ధరలు పెరగడం వల్ల ప్రభావిత దేశాల్లో ద్రవ్యోల్బణం పెరిగే ప్రమాదం కనిపిస్తున్నది. భారతదేశంపై యుద్ధ ప్రభావం అత్యంత తీవ్రంగా ఉంది. దేశానికి అవసరమైన ఎల్పీజీ దిగుమతుల్లో 60 శాతం వాటా పశ్చిమ ఆసియా దేశాల నుంచే వస్తుంది. మళ్లీ దానిలోనూ 47 శాతం ఖతాటర్ నుంచే ఎల్పీజీ దిగుమతి అవుతోంది. సరఫరా ఆగిపోవడంతో దేశంలో ఎల్పీజీ కొరత మూడో వారానికి చేరింది.
దేశీయంగా ఉత్పత్తిని 40 శాతం పెంచినప్పటికీ విదేశీ లోటును భర్తీ చేయడం కేంద్ర ప్రభుత్వానికి సవాలుగా మారింది. గృహ వినియోగదారులకు ఇబ్బంది కలగ కుండా ప్రభు త్వం ప్రాధాన్యం ఇస్తుండటంతో వాణిజ్య గ్యాస్ సిలిండర్ల సరఫరాపై కోత పడింది. దేశవ్యాప్తంగా ఇప్పటివరకు 4,500 దాడులు జరిగాయి. కొన్ని పట్టణాల్లో ప్రైవేటు విక్రయదారులు కిలో గ్యాస్ను రూ.200 వరకు విక్రయిస్తున్నారు. అంటే.. ఐదు కిలోల చిన్న సిలిండర్ ధర రూ.వెయ్యికి చేరిం దన్న మాట. దేశ వ్యాప్తంగా హోటళ్ల నిర్వాహకులు గ్యాస్ సిలిండర్లు దొరకక దుకాణాలు మూసివేస్తున్నారు. ప్రత్యామ్నాయంగా కట్టెల పొయ్యిలను ఆశ్రయిస్తున్నారు.
గ్యాస్ కొరత ఏర్పడుతుందనే భయంతో డొమెస్టిక్ వినియోగదారులు సిలిండర్లను నిల్వ చేయడం వల్ల కృత్రిమ కొరత ఏర్పడు తున్నది. ఈ పరిస్థితిని అదుపు చేయడానికి ఇండియన్ ఆయిల్ సంస్థ కొత్త బుకింగ్ నంబర్లను అందుబాటులోకి తెచ్చింది. ఐవీఆర్ఎస్ విధానం ద్వారా బుకింగ్లను వేగవంతం చేస్తున్నది. పట్టణ ప్రాంతాల్లో 25 రోజులు, గ్రామీణ ప్రాంతాల్లో 45 రోజుల వ్యవధి తర్వాతే రెండో సిలిండర్ బుక్ చేసుకోవాలనే నిబంధనలు అమలులోకి వచ్చాయి.
గ్యాస్ సిలిండర్ కొరత వల్ల తాజాగా హిమాచల్ ప్రదేశ్ అసెంబ్లీలో వంట సిబ్బంది కట్టెల పొయ్యిలపై వంట చేయాల్సిన దుస్థితి ఏర్పడింది. చమురు సంక్షోభం పారిశ్రామిక రంగాన్నీ కుదిపేస్తున్నది. కేంద్ర ప్రభుత్వం ఇచ్చిన వెసులుబాటుతో ఆయి ల్ మార్కెటింగ్ కంపెనీలు పారిశ్రామిక డీజిల్ ధరను లీటరుకు రూ.22 మేర పెంచాయి. ఫ్యాక్టరీలు, మౌలిక సదుపాయాల ప్రాజెక్టులు, భారీ యంత్రాలు, జేసీబీలకు ఈ డీజిల్ వినియోగం ఎక్కువగా ఉంటుంది.
నిర్వహణ ఖర్చు పెరగడంతో ప్రాజెక్టుల వ్యయం పెరగనుంది. దీనికి తోడు ప్రీమియం పెట్రోల్ ధర కూడా లీటరుకు రూ.2 పెరిగింది. ఈ పెరుగుదల రవాణా ఖర్చులను పెంచి నిత్యావసర వస్తువుల ధరలు ఆకాశా న్నంటేలా చేయనుంది. సంక్షోభాన్ని అధిగమించేందుకు కేంద్ర ప్రభుత్వం పైపుడ్ నేచురల్ గ్యాస్ (పీఎన్జీ) వాడకాన్ని ప్రోత్సహిస్తున్నది. గ్యాస్ కొరత ఉన్న సమయంలో ప్రజలు విద్యుత్ ఉపకరణాల వైపు దృష్టి సారించాలని సూచిస్తున్నది.




