‘ఆర్టీసీ కార్మికుల సంక్షేమమే ధ్యేయం’
తుర్కయంజాల్, జూలై 1:ఆర్టీసీ సంస్థ పరిరక్షణ, కార్మికుల సంక్షేమం, ప్రయాణికుల సౌకర్యం... ఈ మూడింటికి కాంగ్రెస్ సర్కార్ ప్రాధాన్యం ఇస్తోందని రాష్ట్ర రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ అన్నారు. తుర్కయంజాల్ మున్సిపాలిటీ మునగనూరులో ఆర్టీసీ విశ్రాంత ఉద్యోగుల భవనానికి ఇబ్రహీంపట్నం ఎమ్మెల్యే మల్ రెడ్డి రంగారెడ్డితో కలిసి పొన్నం ప్రభాకర్ శంకుస్థాపన చేశారు.
ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సభలో పొన్నం ప్రభాకర్ మాట్లాడుతూ కేసీఆర్ హయాంలో ఆర్టీసీని నిర్వీర్యం చేశారని ఆరోపించారు. ఇప్పుడిప్పుడే సంస్థ కోలుకుంటోందని, ఒక్కో సమస్యను పరిష్కరిస్తున్నామని తెలిపారు. రేవంత్ సర్కార్ ఏర్పడ్డాక ఆర్టీసీ అభివృద్ధి కోసం ఎన్నో మంచి కార్యక్రమాలు చేశామన్నారు. మహిళలకు బస్సుల్లో ఉచిత రవాణా సౌకర్యం తమ ప్రభుత్వ ఘనత అని పునరుద్ఘాటించారు.
ఆర్టీసీ విశ్రాంత ఉద్యోగుల సౌకర్యార్థం భవనం నిర్మాణం చేపట్టడం అభినందనీయమన్నారు. స్థలం విషయంలో ఎవరికైనా భూ పత్రాలు ఉంటే తమను సంప్రదించాలని సూచించారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర రోడ్ల అభివృద్ది కార్పొరేషన్ చైర్మన్ మల్ రెడ్డి రాంరెడ్డి, గడ్డి అన్నారం మార్కెట్ చైర్మన్ చిలుక మధుసూదన్ రెడ్డి, వైస్ చైర్మన్ భాస్కర్ చారి,
కాంగ్రెస్ సీనియర్ నాయకులు గుండ్లపల్లి హరితాధన్రాజ్గౌడ్, వేముల అమరేందర్ రెడ్డి, కంబాలపల్లి ధన్రాజ్, బండారి బాలరాజు, కాకుమాను సునీల్, వంగేటి గోపాల్ రెడ్డి, గుత్తా వెంకటరెడ్డి, వద్దిగళ్ల బాబు, బొక్క రవీందర్ రెడ్డి, వంశీధర్ రెడ్డి, మున్సిపల్ కమిషనర్ అమరేందర్ రెడ్డి, డీఈ భిక్షపతి, ఏఈ చంద్రశేఖర్ తదితరులు పాల్గొన్నారు.






