వికలాంగుల సంక్షేమమే కాంగ్రెస్ ప్రభుత్వ లక్ష్యం
- తెలంగాణ రాష్ట్ర వికలాంగుల కార్పొరేషన్ చైర్మన్ ముత్తినేని వీరయ్య
- కాంగ్రెస్ వికలాంగుల విభాగం సభ్యత్వ నమోదు షురూ..
మొయినాబాద్ జూలై 19(విజయ క్రాంతి): కాంగ్రెస్ పార్టీ వికలాంగుల విభాగం ఆధ్వర్యంలో రంగారెడ్డి జిల్లా సభ్యత్వ నమోదు కార్యక్రమాన్ని మొయినాబాద్ మున్సిపల్ పరిధిలోని చిలుకూరు రెవెన్యూలో ఉన్న ఓం శాంతి నిలయంలో కాంగ్రెస్ పార్టీ వికలాంగుల విభాగం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి వి.నరసింహ చారి ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి తెలంగాణ రాష్ట్ర వికలాంగుల కార్పొరేషన్ చైర్మన్ ముత్తినేని వీరయ్య, టీపీసీసీ నాయకుడు షాబాద్ దర్శన్ ముఖ్య అతిథులుగా హాజరై సభ్యత్వ నమోదు ప్రక్రియను ప్రారంభించారు.
ఈ సందర్భంగా ముత్తినేని వీరయ్య మాట్లాడుతూ.. వికలాంగుల సంక్షేమానికి కాంగ్రెస్ పార్టీ ఎప్పటి నుంచో ప్రాధాన్యత ఇస్తోందని అన్నారు. వికలాంగుల అభ్యున్నతి కోసం అనేక సంక్షేమ పథకాలను అమలు చేస్తోందని పేర్కొన్నారు. గత పదేళ్ల బీఆర్ఎస్ పాలనలో వికలాంగుల సమస్యలు పట్టించుకోలేదని, వికలాంగుల కార్పొరేషన్ పనితీరు కూడా కనిపించలేదని విమర్శించారు.
కాంగ్రెస్ ప్రభుత్వం వికలాంగుల సంక్షేమానికి కట్టుబడి పనిచేస్తోందని, ప్రభుత్వ పథకాలు ప్రతి అర్హుడికి చేరేలా చర్యలు తీసుకుంటోందని తెలిపారు. వికలాంగులు పెద్ద సంఖ్యలో కాంగ్రెస్ పార్టీ సభ్యత్వం నమోదు చేసుకొని ప్రభుత్వ సంక్షేమ కార్యక్రమాలను సద్వినియోగం చేసుకోవాలని ఆయన పిలుపునిచ్చారు.
ఈ కార్యక్రమంలో రంగారెడి జిల్లా వికలాంగుల విభాగం అధ్యక్షుడు ఏం.సురేష్, ఈ. జ్ఞానేశ్వర్ గౌడ్, పరమేష్, శేఖర్ రెడ్డి, కె.విజయ్ కుమార్, ఈ.సునీత, జంగయ్య, కె.చారి, బి. శేఖర్, రంగారెడ్డి జిల్లాలోని దివ్యాంగులు, కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు, స్థానిక ప్రజాప్రతినిధులు, తదితరులు, పాల్గొన్నారు.






