కోటపల్లి రైతు వేదికలో దొంగతనం..?
కోటపల్లి,(విజయక్రాంతి): మంచిర్యాల జిల్లా కోటపల్లి మండల కేంద్రంలోని కోటపల్లి క్లస్టర్ (CLUSTER) రైతువేదికలో ఇటీవల దొంగతనం జరిగినట్లు సమాచారం. మూడు రోజుల కిందట రైతు వేదికలో దొంగలు పడి ప్రత్యక్ష వీడియో కాన్ఫరెన్స్ (LIVE VIDEO CONFERENCE) కు సంబంధించిన కంప్యూటర్ వస్తువులు (CPU, MONITOR, etc), సౌండ్ సిస్టం (SOUND SYSTEM), కూలర్ పార్టు (COOLER PARTS)లు దొంగిలించినట్లు తెలిసింది. శుక్ర వారం ఖమ్మం జిల్లా చింతకాని మండలంలో నిర్వహించిన రైతు ఆశీర్వాద సభ సైతం రైతు వేదికలో కాకుండా మండల వ్యవసాధికారి కార్యాలయంలో ప్రత్యక్ష ప్రసారాన్ని రైతులు లేకుండా వ్యవసాయ శాఖ విస్తీర్ణ అధికారులు మాత్రమే వీక్షించారు.
దీనితో రైతు వేదికలో దొంగలు పడి వీడియో కాన్ఫరెన్స్ కు సంబంధించి వస్తువులు దొంగతనం అయినట్లు ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. కాగా ఇది ఇటీవల జరిగిందా..? లేదా నెలలు దాటిందా..? అనే అనుమానాలు సైతం రైతుల నుంచి వ్యక్తమవుతున్నాయి. మరో వైపు రైతు వేదికలో దొంగతనం జరిగి వీడియో కాన్ఫరెన్స్ కు సంబంధించిన పరికరాలు పోయినట్లు పోలీసులకు ఇప్పటి వరకు ఎలాంటి ఫిర్యాదు రాకపోవడం పలు అనుమానాలు రేకెత్తుతున్నాయి. ఇది ఇంటి దొంగల పనా..? భయటి దొంగల పనా...? అనే ప్రశ్నలు తలెత్తుతున్నాయి.






