14-05-2025 01:01:38 AM
మునుగోడు ఎమ్మెల్యే రాజగోపాల్ రెడ్డి
మునుగోడు, మే 13 : వెనుకబడిన మునుగోడు నియోజకవర్గ ప్రాంతానికి కరెంట్ సమస్యను లేకుండా చూడాలని ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి అన్నారు. కరెంటు సమస్యలు విద్యుత్ పనుల అభివృద్ధి పై ముఖ్య నాయకులతో కలిసి హైదరాబాదులోని టీజీఎస్పీడీసీఎల్ రాష్ట్ర కార్యాలయంలో సీఎండీ ముషారఫ్తో కలిసి సమీక్ష సమావేశం మాట్లాడారు.
లోవోల్టేజి సమస్య, అదనపు ట్రాన్స్ఫార్మర్ల కేటాయింపు, అదనపు సబ్ స్టేషన్ ల నిర్మాణం, లూజు లైన్ల సమస్యలు, గృహాలు ప్రభుత్వ కార్యాలయాలు పాఠశాలల పైన ప్రమాదకరంగా ఉన్న కరెంటు వైర్లు తొలగింపు సమస్యలతోపాటు మరికొన్ని సమస్యలను సీఎం డి ముషారఫ్, యాదాద్రి నల్గొండ జిల్లాలకు సంబంధించిన అధికారుల దృష్టికి తీసుకు వచ్చారు.
సమస్యలను సావధానంగా విన్న సీఎండి ముషారఫ్ సమస్యలను వెంటనే పరిష్కరించాలని అక్కడే ఉన్న యాదాద్రి, నల్గొండ జిల్లాల విద్యుత్ అధికారులను ఆదేశించారు. నాణ్యమైన, భద్రతతో కూడిన కరెంటు ఇచ్చే విధంగా రాబోయే కాలంలో ప్రజా ప్రభుత్వం విద్యుత్ శాఖలో సమూలమైన సంస్కరణలు తీసుకొస్తుందని, ఆ సంస్కరణలు మొదట మునుగోడు నియోజకవర్గం నుంచి మొదలుపెట్టాలని, నియోజకవర్గాన్ని పైలెట్ ప్రాజెక్టుగా తీసుకొని విద్యుత్ అభివృద్ధి పనులు చేయాలని సిఎండి ముషారఫ్ను కోరారు.
కరెంటు సమస్యలు పరిష్కరించడానికి రూ.34 కోట్లు అవసరమవుతున్నాయని, ప్రత్యేక దృష్టితో పనులను మంజూరు చేయాలని ముఖ్య నాయకులతో కలిసి సీఎండి ముషారఫ్ గారికి వినతి పత్రం అందజేశారు. విద్యుత్ శాఖలో పనిచేసే అధికారులు విధుల విషయంలో నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారని, వేధించి ప్రజల నుండి డబ్బులు వసూలు చేస్తున్న విషయాలు నా దృష్టికి వచ్చాయని, దీనివల్ల ప్రజాప్రతినిధులుగా మాకు, ప్రభుత్వానికి చెడ్డ పేరు వస్తుందని అన్నారు. ఎవరైతే అవినీతి పాల్పడుతున్నారో వారి పైన కఠిన చర్యలు తీసుకోని స్ట్రీమ్ లైన్ చేయాలని సీఎండి ముషారఫ్ కోరారు.