29-01-2026 12:30:33 AM
పోలీసులకు అప్పగించిన స్థానికులు
కామారెడ్డి, జనవరి28 (విజయ క్రాంతి): దోపిడీ చేసేందుకు వచ్చి ఇంట్లో ఉన్న ఇద్దరిపై దాడి చేయడం కాకుండా గొడవ జరుగుతుందని వచ్చిన వృద్ధురాలు పై కూడా దుండగులు దాడి చేసిన ఘటన కామారెడ్డి జిల్లా దోమకొండ మండల కేంద్రంలోని పలుగు గడ్డ ప్రాంతంలో మంగళవారం అర్ధరాత్రి ఈ ఘటన చోటుచేసుకుంది. స్థానిక పోలీసుల కథనం ప్రకారం వివరాలు ఇలా ఉన్నాయి.
కామారెడ్డి జిల్లా దోమకొండ మండలంలోని పలు గడ్డ ప్రాంతంలో మంగళవారం అర్ధరాత్రి సమయంలో ముగ్గురు గుర్తుతెలియని దుండగులు బీసు రుకుంబాయి కిష్టయ్యల ఇంట్లోకి చొరబడి దాడికి పాల్పడ్డారు. ముగ్గురిలో ఒకరు బయట కాపలా ఉండగా, మరో ఇద్దరు ఇంట్లోకి ప్రవేశించారు. ఆ సమయంలో ఇంట్లో ఉన్న రుకుంబాయి నోరు నొక్కి వెనుక నుంచి దాడి చేయడంతో ఆమె కేకలు వేసింది. అరుపులు విని మంచంపై నుంచి లేచిన కిష్టయ్యపై మరో దుండగుడు దాడి చేశాడు. ఇంట్లో అద్దెకు ఉంటున్న వెంకటమ్మ అరుపులు విని లోనికి రావడానికి ప్రయత్నించగా ఆమెపై కూడా దుండగులు దాడి చేశారు.
బాధితుల అరుపులకు భయపడి ఇద్దరు దుండగులు బయటికి పరుగులు తీయగా, బయట ఉన్న మరో వ్యక్తితో కలిసి పరారయ్యారు. దుండగులు కొట్టి పారిపోయారని బాధితులు బయటకు వచ్చి కేకలు వేయడంతో స్థానిక యువకులు వెంటనే వారిని వెంబడించారు. దుండగుల్లో ఒకడు కత్తి చూపుతూ భయపెడుతూ పారిపోతూ సమీపంలో ఉన్న వినాయక వెంచర్ ప్రాంతంలో గుంతలో పడి చిక్కుకున్నాడు.
అతడి వద్ద కత్తి, డమ్మీ తుపాకీని స్థానికులు గుర్తించారు. అనంతరం అతడిని పట్టుకుని పోలీసులకు సమాచారం అందించారు. ఎస్త్స్ర ప్రభాకర్ తెలిపిన వివరాల ప్రకారం, గాయపడిన నిందితుడిని విచారించగా అతడు మాచారెడ్డి మండలం అన్నారం గ్రామానికి చెందిన గోన్నె రజినీకాంత్గా గుర్తిం ఛీ నట్లు తెలిపారు. అతనిని విచారించగా తాను ఒక్కడే చోరీకి దిగినట్లు పోలీసుల ఎదుట వెల్లడించినట్లు తెలిపారు.
అతని వద్ద నుండి డమ్మీ తుపాకీ, హాక్సీ బ్లేడు ను స్వాధీనం చేసుకుని కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టినట్లు పోలీసులు తెలిపారు. ఈ ఘటన కామారెడ్డి జిల్లాలో కలకలం రేపింది. వృద్ధులైన భార్యాభర్తలు ఉండగా దోపిడికి వచ్చిన దుండగులు ఇంట్లో ఉన్న ఇద్దరు వృద్ధుల పై దాడి చేసి మరో మహిళను గాయపరిచారు. ఈ ఘటనపై జిల్లా ఎస్పీ రాజేష్ చంద్ర ప్రత్యేక టీమ్లను ఏర్పాటు చేసి పరారీ అయిన దుండగులను పట్టుకునేందుకు పోలీసులు ప్రయత్నాలు ముమ్మరం చేశారు.