26-06-2025 12:00:00 AM
పెంచికల్ పేటలో ఉద్రిక్తత
కుమ్రం భీం ఆసిఫాబాద్, జూన్25 ( విజ యక్రాంతి): రాజశేఖర్ మృతికి కారణమైన రాచకొండ కృష్ణ దంపతులను అరెస్టు చేయాలని మాజీ ఎమ్మెల్యే కోనేరు కోనప్ప, బీఆర్ఎస్ నేత ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్, సీపీఎం జిల్లా కార్యదర్శి రాజన్న డిమాండ్ చేశారు.పెంచికల్పేట్ మండలం అగర్గూడా గ్రామానికి చెందిన రాజశేఖర్ తన యజమా ని వేధింపులు తట్టుకోలేక పురుగుల మందు తాగి ఆత్మహత్య చేసుకున్న సంఘటన చోటుచేసుకుంది.
మృతికి కారణమైన రాచకొండ కృష్ణ దంపతులపై చర్యలు తీసుకోవాలని సీపీఎం పార్టీ ఆధ్వర్యంలో డీఎస్పీ కార్యాలయంలో వినతి పత్రం అందజేశారు.మాజీ ఎమ్మెల్యే కోనేరు కోనప్ప ఫర్టిలైజర్ షాప్ యజమాని రాచకొండ కృష్ణ ఇంటి ముందు బైఠాయించి ఆత్మహత్య చేసుకున్న యువకుడి కుటుంబానికి 50 లక్షల రూపాయలు చెల్లించాలని డిమాండ్ చేశారు.మృతికి కారణమైన వారిని కఠినంగా శిక్షించాలన్నారు.
పెంచికల్పేట్ మండల కేంద్రంలో బిఆర్ఎస్ నేత ఆర్ఎస్పి మృతుడి కుటుంబానికి మద్దతుగా ధర్నా నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. రాచకొండ కృష్ణ అతని వద్ద పనిచేస్తున్న రాజశేఖర్పై దొంగతనం చేశాడని నేపంతో వేధింపులు పెట్టడం వల్ల తట్టుకోలేక యువకుడు ఆత్మహత్య చేసుకున్నాడని ఆరోపించారు. రాజశేఖర్ తల్లికి కృష్ణ ఫోన్ చేసి దుర్భాషలాడినట్లు తెలిపారు.
రాచకొండ కృష్ణ ఏళ్ల తరబడి ఈ ప్రాంత రైతులను వేధిస్తున్నారని ఆరోపించారు.రాజశేఖర్ మరణ వార్త విన్న రాచకొం డ కృష్ణ కుటుంబ సభ్యులతో పారిపోయాడని వెంటనే వారిని అదుపులోకి తీసుకొని చట్ట పరంగా శిక్షించాలని డిమాండ్ చేశారు. బాధిత కుటుంబానికి న్యాయం జరిగే వరకూ పోరాటం చేస్తామని తెలిపారు.వేరు వేరు చోట్ల ధర్నా నిర్వహిస్తున్న విషయం తెలుసుకున్న డీఎస్పీ రామానుజం అక్కడికి చేరుకొని ఎలాంటి అల్లర్లు జరగకుండా చర్యలు చేపట్టారు.