మిర్యాలగూడలో ఘోరప్రమాదం: సిలిండర్ పేలి ముగ్గురు సజీవదహనం
మిర్యాలగూడ: నల్గొండ జిల్లా మిర్యాలగూడలోని(Miryalaguda) కలల్వాడ కాలనీలో గురువారం అర్ధరాత్రి ఇంట్లో నిద్రిస్తుండగా జరిగిన అగ్నిప్రమాదంలో ముగ్గురు సజీవ దహనమయ్యారు. అగ్ని ప్రమాదంలో మరణించిన వారిని చంద్రకళ(50), ఆమె మనవడు లక్ష్మణ్ (17), ఆమె మనవరాలు ప్రణతి (14)గా గుర్తించారు. షార్ట్ సర్క్యూట్ కారణంగా ఈ అగ్ని ప్రమాదం సంభవించినట్లు సమాచారం. మంటలు ఇంటిని చుట్టుముట్టినప్పుడు, ఆ కుటుంబం వంట కోసం ఉపయోగిస్తున్న ఎల్పీజీ (LPG) సిలిండర్ భారీ శబ్దంతో పేలిపోయింది.
ఆ పేలుడు శబ్దానికి కాలనీవాసులు భయాందోళనకు గురయ్యారు. సమాచారం అందుకున్న అగ్నిమాపక సిబ్బంది ఘటనాస్థలానికి చేరుకుని మంటలను అదుపుచేసింది. చంద్రమ్మ తన కుమార్తె ధనమ్మ పిల్లలైన మనవడు, మనవరాలితో కలిసి ఆ ఇంట్లో నివసిస్తోంది. కొన్నేళ్ల క్రితం ధనమ్మ భర్త మరణించడంతో, ఆమె తన పిల్లలతో కలిసి మిర్యాలగూడలోని తన తల్లి ఇంట్లోనే ఉంటోంది. ఉపాధి కోసం ఇంటి పని చేయడానికి ధనమ్మ మూడు రోజుల క్రితం పూణెకు వెళ్లింది. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు మృతదేహాలను స్వాధీనం చేసుకుని పోస్టుమార్టం నిమిత్తం మార్చురీకి తరలించారు.






