18 April, 2026 | 7:58 PM

అన్నమయ్య జిల్లాలో విషాదం.. నీటి కుంటలో పడి ముగ్గురు పిల్లలు మృతి

12-04-2025 08:08 AM

అమరావతి: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం అన్నమయ్య(Annamayya district) జిల్లాలో శనివారం విషాదం చోటుచేసుకుంది. నీటి కుంటలో పడి ఏడేళ్ల వయసున్న ముగ్గురు బాలురు మృతి చెందారు. అన్నమయ్య జిల్లా చిట్వేలు మండలం(Chitvel Mandal) మైలపల్లి రాచపల్లిలో ఈ ఘటన చోటుచేసుకుంది. మృతులను చొక్క రాజుదేవా, చొక్కా రాజుజయ, రెడ్డి చెర్ల యశ్వంత్ గా గుర్తించారు. ముగ్గురు పిల్లలు ఆడుకుంటూ వెళ్లి ఊరి దగ్గరలో ఉన్న నీటి కుంటలో పడిపోయారు. చిన్నారులు ఇంటికి రాకపోవడంతో కుటుంబసభ్యులు చుట్టుపక్కల వెతికారు. నీటి కుంటలో ముగ్గురు చిన్నారులు పడి ఉన్నట్లు గుర్తించారు. ముగ్గురిని ఆస్పత్రికి తీసుకువెళ్లగా అప్పటికే చనిపోయినట్లు వైద్యులు వెల్లడించారు. చిన్నారుల మృతి ఆ గ్రామంలో తీవ్ర విషాదాన్ని నింపింది. కుటుంబ సభ్యులు కన్నీరుమున్నీరవుతున్నారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.