08-02-2026 12:13:55 PM
పశువులపై దాడి
అప్రమత్తంగా ఉండాలని ఫారెస్ట్ అధికారులు హెచ్చరిక
నంగునూరు,(విజయక్రాంతి): సిద్దిపేట జిల్లాలోని పలు మండలాల్లో పెద్దపులి సంచారం తీవ్ర కలకలం రేపుతోంది. యాదాద్రి జిల్లా నుంచి ప్రవేశించిన ఈ పులి.. దూల్మిట్ట, మద్దూరు, నంగునూరు, కోహెడ మండలాల్లో సంచరిస్తున్నట్లు అటవీశాఖ అధికారులు గుర్తించారు. మద్దూరు మండలం లధ్నూర్, అమ్మాపూర్ గ్రామాల్లో లేగదూడలపై దాడి చేసిన పులి, ఆదివారం నంగునూరు మండలం ఘనపూర్లో రైతు బాలరెడ్డి పొలం వద్ద ఆవు దూడను చంపి తిన్నది.
హుస్నాబాద్ ఎఫ్ఆర్ఓ సిద్ధార్థ్ రెడ్డి ఘటనా స్థలాన్ని పరిశీలించి పులి పాదముద్రలను ధృవీకరించారు.కోహెడ మండలం బస్వాపూర్ ఆరెపల్లి తండాలో ఏకంగా 5 ఆవులను చంపడంతో స్థానికులు హడలెత్తిపోతున్నారు.ప్రస్తుతం అటవీశాఖ బృందాలు డ్రోన్ల సాయంతో గాలింపు చర్యలు చేపడుతున్నాయి. పులి మళ్లీ పశువులను వేటాడిన ప్రాంతానికే వచ్చే అవకాశం ఉన్నందున, రైతులు పొలాల వద్దకు వెళ్లరాదని అధికారులు హెచ్చరించారు.ముఖ్యంగా రాత్రి వేళల్లో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని,ఒంటరిగా బయటకు రావొద్దని సూచించారు.