13-02-2026 12:01:03 AM
స్ట్రాంగ్ రూమ్ల వద్ద భారీ భద్రత
కౌంటింగ్ పాసులునోళ్లకే అనుమతి
రంగారెడ్డి, ఫిబ్రవరి 12 (విజయక్రాంతి): రాజకీయ రణక్షేత్రంలో పోలింగ్ పర్వం ముగిసింది. ఇప్పుడు అందరి కళ్లు రేపటి కౌంటింగ్ కేంద్రంపైనే నిలిచాయి. అమనగల్లు నుంచి శంకర్పల్లి వరకు.. రంగారెడ్డి జిల్లాలోని ఆరు మున్సిపాలిటీల భవితవ్యం ప్రస్తుతం స్ట్రాంగ్ రూముల్లో ఇనుప పెట్టెల మధ్య నిక్షిప్తమై ఉంది. బయటకు చిరునవ్వులు చిందిస్తున్నా.. లోలోపల అభ్యర్థుల గుండెల్లో రైళ్లు పరిగెడుతున్నాయి.
’గెలుపు గుర్రం’ ఎవరనే ఉత్కంఠ జిల్లావ్యాప్తంగా పీక్ స్టేజ్కు చేరుకుంది. వార్ రూమ్లలో ’లెక్కల’ కుస్తీ పడుతున్నారు. పోలింగ్ ముగిసిన నుంచే నుంచే అభ్యర్థుల నివాసాలు ’వార్ రూమ్’లుగా మారిపోయాయి. బుధవారం రాత్రి నుంచి నేటి వరకు నేతలు, కార్యకర్తలు నిద్రలేని రాత్రులు గడుపుతున్నారు.
కూడికలు.. తీసివేతలు..
ఏజెంట్లు ఇచ్చిన సమాచారం ఆధారంగా బూత్ వారీగా పడిన ఓట్లపై క్షుణ్ణంగా విశ్లేషణ చేస్తున్నారు. సైలెంట్ ఓటింగ్ భయం....‘డబ్బులు ఇచ్చాం.. హామీలు గుప్పించాం.. కానీ ఓటరు మనసులో ఏముందో?‘ అన్న సందేహం అభ్యర్థులను వెంటాడుతోంది. ముఖ్యంగా తటస్థ ఓటర్లు వేసిన ’సైలెంట్’ ఓటు ఎటువైపు మొగ్గిందో అర్థం కాక నేతలు తలలు పట్టుకుంటున్నారు. క్రాస్ ఓటింగ్ గుబులు వెంటాడు తుంది. పార్టీ గుర్తును చూసి వేశారా? లేక అభ్యర్థి వ్యక్తిగత ఇమేజ్ చూసి వేశారా? అనే చర్చ జోరుగా సాగుతోంది. కొన్ని వార్డుల్లో జరిగిన ’క్రాస్ ఓటింగ్’ అభ్యర్థుల నిద్రను గెంటేస్తోంది.
‘అన్న.. నీకు తిరుగులేదు... అక్క ఈ వార్డు మెజారిటీ ఖాయం.. అంటూ అనుచరులు భరో ఇస్తున్నప్పటికీ, ఓటరు నాడి మాత్రం అంతుచిక్కని ప్రశ్నగానే మిగిలిపోయింది. స్ట్రాంగ్ రూమ్ల వద్ద భారీ భద్రతను ఏర్పాటు చేశారు. జిల్లాలోని ఆరు మున్సిపాలిటీ లో ని కౌంటింగ్ కేంద్రాల్లో గురువారం మాక్ కౌంటింగ్ ప్రక్రియ ను ప్రారంభించారు.
నేడు ఉదయం కౌంటింగ్ ప్రారంభమైన తొలి గంటలోనే ప్రాథమిక ఫలితాలు వచ్చే అవకాశం ఉండడం తో గెలుపుపై ఆశలు పెట్టుకున్న అభ్యర్థుల తో పాటు పార్టీ నేతలు, కార్యకర్తలు కౌంటింగ్ కేంద్రం వైపు ఉత్కంఠంగా ఎదురు చూపులు చూస్తున్నారు. గత పక్షం రోజులుగా బరిలో ఉన్న అభ్యర్థులంతా ఓటర్లను ప్రసన్నం చేసుకునేందుకు పడరాన్ని పాట్లు పడ్డారు. ప్రచార ఆర్భాటం, లక్షల నుంచి కోట్ల ఖర్చు చేశారు.
తాము గెలిచేందుకు వేసిన రక రకాల వ్యూహలు పనిచేశాయా? లేక ఓటరు ’మార్పు’ వైపు అడుగు వేశాడా? అనేది మరికొన్ని గంటల్లో తేలిపోనుంది. గెలిస్తే రాజకీ య భవిష్యత్తు వైభవం.. ఓడితే ఐదేళ్ల అజ్ఞాతవాసం! అందుకే ఈ రాత్రి అభ్యర్థులకు జీవితంలోనే అత్యంత సుదీర్ఘమైన రాత్రి కానుంది. రేపటి సూర్యోదయం ఎవరి ఇంట గెలుపు కాంతులు నింపుతుందో చూడాలి.