మంథనిలో ఎస్ఐఆర్ ఫేజ్-2పై బీఎల్ఏలకు టీపీసీసీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి శ్రీనుబాబు దిశానిర్దేశం
మంథని, ఆగస్టు 23 (విజయక్రాంతి): ఎస్ఐఆర్ ఫేజ్-2 ప్రక్రియపై బూత్ స్థాయి ఏజెంట్లకు టీపీసీసీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి దుద్దిళ్ల శ్రీను బాబు సమగ్ర అవగాహన కల్పించారు. మంథని నియోజకవర్గంలోని పాలకుర్తి, కమాన్పూర్, రామగిరి, ముత్తారం, మంథని మండలాలకు చెందిన బీఎల్ఏలకు మంథనిలోని మంత్రి దుద్దిళ్ల శ్రీధర్ బాబు క్యాంపు కార్యాలయంలో ఆదివారం అవగాహన కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా దుద్దిళ్ల శ్రీను బాబు స్క్రీన్ ద్వారా ఎస్ఐఆర్ ఫేజ్-2లో చేపట్టాల్సిన ప్రక్రియను బీఎల్ఏలకు వివరించారు.
బూత్ స్థాయిలో బీఎల్ఏల బాధ్యతలు, ఓటర్ల వివరాల పరిశీలన, ఓటర్ల జాబితాలో తప్పులు, మార్పులు, చేర్పులను గుర్తించడం వంటి కీలక అంశాలపై అవగాహన కల్పించారు.ప్రతి బూత్ పరిధిలో ఓటర్ల జాబితాను క్షుణ్ణంగా పరిశీలించి, అర్హులైన ఓటర్ల వివరాలు సక్రమంగా ఉండేలా చూడాలని శ్రీను బాబు సూచించారు. ఎస్ఐఆర్ ఫేజ్-2 ప్రక్రియపై బూత్ స్థాయి ఏజెంట్లు పూర్తి అవగాహన కలిగి, సమన్వయంతో పనిచేయాలని దిశానిర్దేశం చేశారు. మంథని నియోజకవర్గంలో ఎస్ఐఆర్ ప్రక్రియను పకడ్బందీగా నిర్వహించేందుకు బూత్ స్థాయి నుంచి పార్టీ శ్రేణులు సమర్థవంతంగా పనిచేయాలని ఆయన సూచించారు.






