29-05-2025 06:26:26 PM
బడి బాటను విజయవంతం చేయండి..
ఉపాధ్యాయులకు టీపీటీఎఫ్ పిలుపు..
కామారెడ్డి (విజయక్రాంతి): కామన్ స్కూల్ విద్యా విధానంను అమలు చేసినప్పుడు మాత్రమే విద్యా రంగంలో కొనసాగుతున్న అంతరాలు తొలగిపోతాయని టీపీటీఎఫ్ రాష్ట్ర అధ్యక్షులు సిహెచ్ అనిల్ కుమార్(TPTF State President CH Anil Kumar) అన్నారు. హైదరాబాద్ లో తెలంగాణ ప్రోగ్రెసివ్ టీచర్స్ ఫెడరేషన్ (టీపీటీఎఫ్) ఆధ్వర్యంలో రాష్ట్ర కార్యాలయం చెన్నుపాటి లక్ష్మయ్య భవన్ ఎదుట టీపీటీఎఫ్ పదకొండవ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా రాష్ట్ర అధ్యక్షులు సిహెచ్ అనిల్ కుమార్ సంఘం జెండాను ఎగురవేశారు. అనంతరం నిర్వహించిన సమావేశంలో రాష్ట్ర అధ్యక్షులు చకినాల అనిల్ కుమార్ మాట్లాడుతూ... కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు విద్యను నిర్లక్ష్యం చేస్తున్నాయని విమర్శించారు.
విద్యారంగానికి సరిపడా బడ్జెట్ ఇవ్వడం లేదని ఆందోళన వ్యక్తం చేశారు. దీంతో సర్కారు బడులలో విద్యార్థులు తమ విలువైన భవిష్యత్తును నష్టపోతున్నారని అన్నారు. ప్రభుత్వ పాఠశాలలను కాపాడుకోవడానికై టీచర్లు నిబధ్ధతతో బాధ్యతాయుతంగా పనిచేస్తూనే విద్యా ప్రమాణాల పెంపుకు కృషి చేయాలని, బడి బాట కార్యక్రమమును విజయవంతం చేయాలని టీచర్లకు పిలుపునిచ్చారు. ఫెడరేషన్ సీనియర్ నాయకులు టి.హనుమాండ్లు మాట్లాడుతూ... సీనియర్ నాయకుల త్యాగాలను స్పూర్తిగా తీసుకొని సంస్థ విధానాలను ఒక సైనికునిలాగా ముందుకు తీసుకు పోవడానికి ఫెడరేషన్ సభ్యులు ప్రయత్నం చేయాలన్నారు.
కేంద్ర ప్రభుత్వం కగార్ ఆపరేషన్ ను వెంటనే నిలిపివేయాలని, మావోయిస్టు పార్టీ నాయకులతో శాంతి చర్చలు జరపాలని, ఆదివాసీల హక్కులను పరిరక్షించాలని, ఎన్కౌంటర్లపై న్యాయ విచారణ జరపాలని కోరారు. టీపీటీఎఫ్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి నన్నెబోయిన తిరుపతి మాట్లాడుతూ.... ఉపాధ్యాయుల సమస్యలను ప్రభుత్వం పరిష్కరించి విద్యార్థులకు నాణ్యమైన విద్య అందేలా కృషి చేయాలని కోరారు. ప్రస్తుతం అమలు చేస్తున్న కాంట్రిబ్యూటరీ పెన్షన్ విధానాన్ని రద్దుచేసి పాత పెన్షన్ విధానాన్ని వర్తింపజేయాలని డిమాండ్ చేశారు. 317 జీవో బాధితులకు న్యాయం చేయాలన్నారు. పాఠశాలల్లో మౌలిక సదుపాయాలు కల్పించాలని కోరారు.
దశాబ్దాలుగా టిపిటిఎఫ్ తెలంగాణ రాష్ట్రంలో ఉపాధ్యాయ,విద్యారంగా సమస్యల పరిష్కారం కోసం నిరంతరం పోరాటం చేస్తున్నదన్నారు. కామన్ స్కూలు స్థాపననే లక్ష్యంగా పనిచేస్తుందని తెలియజేశారు. శాస్త్రీయ విద్యా విధానం, రాష్ట్రంలో ఉన్న పిల్లలందరికీ ఒకే రకమైన నాణ్యమైన విద్య అందేలా, ప్రభుత్వ ఆధీనంలోనే విద్య కొనసాగాలని పోరాడుతున్న సంస్థ తెలంగాణ ప్రోగ్రెసివ్ టీచర్స్ ఫెడరేషన్ అని తెలిపారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర పూర్వ అధ్యక్షులు సి.హెచ్ రాములు, వై.అశోక్ కుమార్ ఉపాధ్యాయ దర్శిని ప్రధాన సంపాదకులు ఎం. ప్రకాష్ రావు, రాష్ట్ర కార్యదర్శి డి.రాజయ్య ఉపాధ్యాయ పత్రిక పూర్వ సంపాదకులు వి.ఆర్ శర్మ, హైదరాబాద్ జిల్లా ప్రధాన కార్యదర్శి రాంబాబు, అధ్యక్షులు వెంకట ప్రసాద్,మేడ్చల్ జిల్లా ప్రధాన కార్యదర్శి బ్రహ్మచారి, రాష్ట్ర కౌన్సిలర్ రామానందయ్య ,పి.సోమిరెడ్డి, వెంకట రమణ, కె.సీతారామశాస్త్రి, యం.సురేందర్ , యం.వెంకటేశ్వర్ రెడ్డి, కె.శివానంద్ ,యం.మాల కొండయ్య మరియు ఫెడరేషన్ సీనియర్ నాయకులు బి.అమరెందర్, జె.రాంచంద్రం బి.ముత్యాలు, తదితరులు పాల్గొన్నారు.