09-12-2025 01:25:43 PM
బెల్లంపల్లి,(విజయక్రాంతి): మంచిర్యాల జిల్లా బెల్లంపల్లి పట్టణ వ్యాపారస్తుల బంద్ కు అనూహ్య స్పందన వచ్చింది. బజార్ ఏరియాలో ఏరియాలో మున్సిపల్ అధికారులు చేపట్టిన రోడ్డు విస్తరణ పనులను ఆపివేయాలంటూ మంగళవారం వ్యాపారస్తులు బంద్ పాటించారు. రోడ్డు విస్తరణతో తమ దుకాణాలకు నష్టం జరిగి జీవనోపాధినీ కోల్పోతామని వాపోయారు. బంద్ ను పురస్కరించుకొని వ్యాపారస్తులు పుర విధుల్లోపెద్ద ఎత్తున ర్యాలీ చేపట్టారు. వ్యాపారస్తుల బంద్ తో బజార్ ఏరియా నిర్మాణుషంగ మారింది.
రోడ్డు విస్తరణ పనులు ఆపాలి..
బెల్లంపల్లి వ్యాపారస్తులకు నష్టం చేస్తున్న బజారు ఏరియా రోడ్డు వెడల్పు పనులను నిలిపివేయాలని మాజీ ఎమ్మెల్యే దుర్గం చిన్నయ్య డిమాండ్ చేశారు. వ్యాపారస్తులు చేపట్టిన బంద్ కు ఆయన మద్దతు పలికారు. వ్యాపారాల ర్యాలీలో పాల్గొని మాట్లాడారు. ముందు చూపు లేకుండా ఎమ్మెల్యే గడ్డం వినోద్ బెల్లంపల్లిలో రోడ్డు విస్తరణ పేరట వ్యాపారస్తులకు తీరని నష్టం చేస్తున్నారని మండిపడ్డారు.
రోడ్డు విస్తరణతో వ్యాపారస్తులకు జరిగే నష్టాన్ని గమనలోకి తీసుకోకుండా రోడ్డు విస్తరణను చేపట్టడంపై మండిపడ్డారు. ప్రధానంగా ఎమ్మెల్యే ఒంటెత్తు పోకడలపై ఆయన ద్వజమెత్తారు. పట్టణాభివృద్ది, పేరుతో అధికారులు వ్యాపారస్తులకు అన్యాయం చేస్తున్నారని విమర్శించారు. మునిసిపల్ అధికారులు ఇప్పటికైనా రోడ్డు విస్తరణను కుదించాలని డిమాండ్ చేశారు. కాంటా చౌరస్తా వరకే రోడ్డు విస్తరణ పనులను పరిమితం చేయాలని డిమాండ్ చేశారు.