7 March, 2026 | 9:44 PM

షాద్‌నగర్ బైపాస్ రోడ్డులో చెట్ల నరికివేత?

06-03-2026 02:35 AM

అటవీ శాఖ వద్ద భద్రపరచాల్సిన నరికిన చెట్లు ఎక్కడికి మాయమయ్యాయి

షాద్నగర్, మార్చి 5 (విజయక్రాంతి): మాకు అనుమతులు అక్కర్లేదు... అంతా మా ఇష్టం అనే చందంగా అవి చెట్లే కదా, నరికి వేస్తే అడిగే వారు ఉండరేమోనని అనుకున్నారో ఏమో షాద్ నగర్ బైపాస్ రోడ్డులో దూసకల్ కు వెళ్లే దారిలో రోడ్డుకు ఇరువైపులా ఉన్న చెట్లను పూర్తిగా వేర్లతో సహా నరికివేసి ఎక్కడికో తరలించారు.

ఒకవైపు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు వృక్ష సంపద పెంపునకై కోట్ల రూపాయలు ఖర్చు చేసి పర్యావరణాన్ని రక్షించాలని, పర్యావరణంలో సమతుల్యత తీసుకురావాలని, మానవ జీవితం నిలబడడానికి కారణభూతమైన ఆక్సిజన్ అందించే చెట్లను విరివిగా పెంచాలని వృక్షో రక్షతి రక్షితః అని మానవ మనుగడకే ఆధారభూతమైన చెట్లను కాపాడాలని ప్రకటనలు ఇస్తూ చెట్లను పెంచడానికి కోట్లాది రూపాయలను ఖర్చు చేస్తూ ప్రభుత్వపరంగా తమ వంతు బాధ్యత నిర్వహిస్తుంటే, షాద్ నగర్ పట్టణంలోని బైపాస్ రోడ్డులో చెట్లను నరికివేసి ఎక్కడికి తరలించారో కూడా తెలియకుండా మమ్మల్ని ఎవరు అడుగుతారులే అనే ధైర్యంతో కొందరు కాంట్రాక్టర్లు విచ్చలవిడితనానికి పాల్పడుతున్నారు.

వాల్టా చట్టం ప్రకారం చెట్లను నరకడానికి అటవీ శాఖ అనుమతులు తీసుకోవాల్సింది మరిచిపోయి, అటవీ శాఖ అనుమతులు లేకుండా అటవీ శాఖ అనుమతులు లేకుండా రోడ్డు కిరువైపులా ఉన్న చెట్లను తొలగించి వేస్తే ఇప్పటిదాకా అటవీ శాఖ అధికారులు కూడా మౌనం పాటించడం, చెట్ల నరికివేత పై చర్యలు తీసుకోకపోవడంలో మతలబు ఏమిటో అధికారులే తెలిపాల్సి ఉంది.

వాల్టా చట్టం ప్రకారం పది చెట్లు నాటిన తర్వాతనే ఒక చెట్టు నరకాలనే నిబంధనలు, చెట్లను నరికితే వాటిని ప్రాంతీయ అటవీ కార్యాలయానికి తరలించాలని పలు నిబంధనలు ఉన్న, వాటిని పాటించకపోవడం పలు అనుమానాలకు తావిస్తోంది. ఈ విషయంపై అటవీ అధికారులను సంప్రదిస్తే  చెట్ల నరికివేతకు సంబంధించి ఎలాంటి ముందస్తు అనుమతులు తీసుకోలేదని, ఒకవేళ అనుమతులు తీసుకున్న నరికి వేసిన చెట్లను అటవీ శాఖ కార్యాలయానికి తరలించాలని, అనుమతులు లేకుండా చెట్లను నరికివేస్తే వారిపై కఠిన చర్యలు ఉంటాయని, అనుమతులు లేకుండా చెట్లను నరికి వేస్తే చట్ట ప్రకారం తగిన చర్యలు తీసుకుంటామని తెలిపారు.