05-02-2026 12:00:00 AM
ఒకే చోట గిరిజనులు సేకరించే అన్ని అటవీ పలసాయాలు లభించే సౌకర్యం
భద్రాచలం, ఫిబ్రవరి 4, (విజయక్రాంతి): ఆదివాసి గిరిజనులు మరియు ప్రజల సౌకర్యార్థం ఐటిడిఏ పిఓ బి రాహుల్ ప్రత్యేక శ్రద్ధతో భద్రాచలం పట్టణంలోని గిరి బజారులో త్వరలో గిరి మార్ట్ ప్రారంభిస్తున్నందున సంబంధిత అధికారులు జిసిసి సేల్స్ మెన్ల సహకారంతో గిరిజనులు, ఎస్ హెచ్ సి గ్రూప్ మహిళలు తయారు చేస్తున్న వివిధ రకాల గృహ అవసరానికి సంబంధించిన వస్తువులను సేకరించాలని ఐటీడీఏ సహాయ ప్రాజెక్టు అధికారి జనరల్ డేవిడ్ రాజ్ అన్నారు. బుధవారం తన ఛాంబర్ నుండి టెలి కాన్ఫరెన్స్ ద్వారా సంబంధిత ఐటీడీఏ స్పెషల్ ఆఫీసర్లు, జిసిసి మేనేజర్లు, ఏపిఎం, డిపిఎం, జిసిసి సేల్స్ మేన్లతో మండలాల వారీగా ఆయన సమీక్షించారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ గృహ అవసరాలకు సేంద్రీయ ఎరువులతో తయారుచేసే ప్రతి ఆహార పదార్థాలు మండలాల వారిగా సేకరించాలని, గిరిజన రైతుల వద్ద దొరికే బియ్యం, మక్కలు, జొన్నలు, రాగులు, సజ్జలు ఇతర ఆహార పదార్థాలు , మహిళలు తయారు చేసే పచ్చళ్ళు, ఇప్పపువ్వు లడ్లు, కరక్కాయ పౌడర్, కరక్కాయలు, తేనే, కారం, పసుపు, తృణ ధాన్యాలు ఇతర వస్తువులు మధ్య దళారులు తీసుకెళ్లకుండా నేరుగా గిరి మార్ట్ కు సరఫరా అయ్యేలా చూడాలన్నారు. సంబంధిత స్పెషల్ ఆఫీసర్లు ఐకెపి ఏపీఎం, జిసిసి మేనేజర్లు, సేల్స్ మేన్ల సహకారంతో వారి పరిధిలోని గ్రామస్తులు తయారుచేసే ఆహార పదార్థాలను పరిశీలించి దానికి సంబంధించిన నివేదికలు సకాలంలో సమర్పించాలన్నారు.