calender_icon.png 6 June, 2025 | 11:23 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

ఉద్యోగులకు రెండు డీఏలు

06-06-2025 01:43:46 AM

వెనువెంటనే ఒకటి.. ఆరు నెలల తర్వాత మరొకటి

- ఉద్యోగులకు హెల్త్‌కార్డుల జారీ.. నిర్వహణకు ట్రస్ట్ ఏర్పాటు

- సీఎం రేవంత్‌రెడ్డి అధ్యక్షతన ఐదున్నర గంటలపాటు క్యాబినెట్ సమావేశం

- పలు కీలక అంశాలపై నిర్ణయం.. వివరాలు వెల్లడించిన డిప్యూటీ సీఎం భట్టి

- అంగన్‌వాడీ సిబ్బందికి రూ.2 లక్షల రిటైర్‌మెంట్ బెనిఫిట్

- కొత్తగూడెంలో ఎర్త్‌సైన్స్ వర్సిటీకి మన్మోహన్‌సింగ్ పేరు: మంత్రి పొంగులేటి

- గ్రామీణ ప్రాంతాల్లో రహదారుల నిర్మాణానికి ప్రాధాన్యం

- ఆర్‌అండ్‌బీ పరిధిలో 5,190 కి.మీ, పీఆర్ పరిధిలో 7,947 కి.మీ మేర నిర్మాణం

- మూడు కారిడార్లుగా మెట్రో విస్తరణ.. రూ.19,579 కోట్ల నిధులకు ఆమోదం

హైదరాబాద్, జూన్ 5(విజయక్రాంతి): తెలంగాణ ప్రభుత్వం ఉద్యోగులకు రెండు డియర్‌నెస్ అలవెన్స్ (డీఏ) ఇవ్వాలని నిర్ణయించింది. ఒక డీఏను వెంటనే అందజేస్తామని, మరో డీఏను ఆరు నెలల తర్వాత అమలు చేస్తామని ప్రకటించింది. ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి అధ్యక్షతన సచివాలయంలో గురువారం క్యాబినెట్ సమావేశం సుమారు ఐదున్నర గంటల పాటు సాగింది. సమావేశంలో క్యాబినెట్ ప్రధానంగా ఉద్యోగులకు సంబంధించిన డిమాండ్లపై చర్చించింది.

తర్వాత పంచాయతీరాజ్, ఆర్‌అండ్‌బీ రోడ్ల విస్తరణ పనులు, మరమ్మతులకు గురైన రోడ్లపై చర్చించింది. కొత్తగూడెంలో అందుబాటులోకి రానున్న ఎర్త్‌సైన్స్ వర్సిటీకి దివంగత మాజీ ప్రధాని మన్మోహన్‌సింగ్ పేరు పెట్టాలని నిర్ణయం తీసుకున్నది. మహిళా స్వయం సహాయక సంఘాల్లో సభ్యులకు బీమా సౌకర్యం  కల్పించాలనే అంశంపై చర్చించింది. క్యాబినెట్ సమావేశం అనంతరం డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క మీడియాతో మాట్లాడారు. ప్రభుత్వ ఉద్యోగుల డిమాండ్లను పరిగణనలోకి తీసుకుని ఆ అంశంపై ప్రధానంగా క్యాబినెట్ చర్చించిందని చెప్పారు.

ప్రభుత్వానికి భారమే అయినప్పటికీ ఉద్యోగులకు రెండు డీఏలు ఇవ్వాలని నిర్ణయించామని, వాటిలో ఒక డీఏను వెంటనే అమలు చేస్తామని, మరో డీఏను ఆరు నెలల తర్వాత అమలు చేస్తామని తెలిపారు. అంగన్‌వాడీ సిబ్బందికి రూ. 2 లక్షల వరకు రిటైర్‌మెంట్ బెనిఫిట్ ఇచ్చేందుకు ఆమోదం తెలిపామన్నారు. ఉద్యోగులకు సంబంధించి పెండింగ్‌లో ఉన్న వాహనాల బిల్లులను చెల్లిస్తామని, అలాగే నెలవారీ బిల్లులకు సంబంధించి ఒక రేట్ ఖరారు చేస్తామని స్పష్టం చేశారు.

మెట్రో విస్తరణకు కేంద్రమంత్రులు సహకరించాలి: మంత్రి పొంగులేటి

హైదరాబాద్ మహానగరంలో మెట్రో రైలు విస్తరణకు రాష్ట్రానికి చెందిన కేంద్ర మంత్రులు సహకరించాలని రెవెన్యూ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి  విజ్ఞప్తి చేశారు. ప్రభుత్వ ఉద్యోగులను సర్కార్ కుటుంబ సభ్యులుగానే భావిస్తోందన్నారు. ఉద్యోగుల సమస్యల పరిష్కారానికి ప్రభుత్వం సానుకూలంగానే ఉందన్నారు. హైదరాబాద్‌ను గ్రీన్ సిటీగా మార్చే ప్రణాళికలో భాగంగా మెట్రో విస్తరణపై తమ ప్రభుత్వం ప్రత్యేక దృష్టి సారిస్తున్నదని తెలిపారు.

దీనిలో భాగంగానే కారిడార్  భాగంగా శంషాబాద్ ఏయిర్‌పోర్ట్ నుంచి ప్యూచర్ సీటీ వరకు 39.6 కిలోమీటర్ల మేర, కారిడార్  భాగంగా జూబ్లీబస్‌స్టేషన్ నుంచి మేడ్చల్ వరకు 24.5 కిలోమీటర్ల మేర, కారిడార్  భాగంగా జూబ్లీ బస్‌స్టేషన్ నుంచి శామిర్‌పేట్ వరకు 22 కిలోమీటర్ల మేరకు మెట్రో రైలు సేవలు విస్తరించాలనే నిర్ణయం తీసుకున్నామని తెలిపారు. మూడు కారిడార్లు కలిపి 86.1 కిలోమీటర్ల పరిధి ఉంటుందని, అందుకు రూ.19,579 కోట్ల నిధుల కేటాయింపునకు క్యాబినెట్ ఆమోదం తెలిపిందని వెల్లడించారు.

కొత్తగూడెంలోని ఎర్త్‌సైన్స్ వర్సిటీకి మాజీ ప్రధాని మన్మోహన్‌సింగ్ పేరు పెట్టాలని నిర్ణయించామని తెలిపారు. గతంలో స్వయం సహాయక సంఘాల్లోని సభ్యులు ఎవరైనా ప్రమాదవశాత్తు చనిపోతే, వారికి బీమా ఉండేది కాదన్నారు. కానీ, తమ ప్రభుత్వం సభ్యులకు రూ.10 లక్షల చొప్పున బీమా వర్తింపజేసేందుకు సిద్ధమైందని, దీనిలో భాగంగానే గతేడాది మృతిచెందిన 385 మంది కుటుంబాలకు రూ. 38.50 కోట్ల పరిహారం అందిస్తామని తెలిపారు.

రాష్ట్రంలోని ప్రతి గ్రామంలో బీటీ రోడ్డు ఉండాలని సర్కార్ భావిస్తుందని, దీనిలో భాగంగా ప్రతి గ్రామం నుంచి మండల కేంద్రం వరకు బీటీ రోడ్డు వేయాలనే నిర్ణయానికి వచ్చిందన్నారు. అలాగే మండల కేంద్రం నుంచి జిల్లాకేంద్రం వరకు డబుల్ రోడ్డు, ప్రతి  జిల్లా నుంచి రాజధాని వరకు  నాలుగు లైన్ల రోడ్లు నిర్మించాలని కంకణం కట్టుకున్నామని వెల్లడించారు. ఆర్‌అండ్‌బీ పరిధిలో 5,190 కిలోమీటర్ల మేర రోడ్ల నిర్మాణానికి రూ.16,414 కోట్లు, పంచాయతీరాజ్ పరిధిలో 7,947 కిలోమీటర్ల మేర రోడ్ల నిర్మాణానికి రూ.16,780 కోట్లు కేటాయిస్తామని తెలిపారు. మొదటి విడతలో హామ్ విధానంలో పనులు చేపడతామని స్పష్టం చేశారు. కాంట్రాక్టర్లు ఆయా రోడ్లను రెండున్నరేళ్లలో నిర్మించాల్సి ఉంటుందని, 15 ఏళ్ల పాటు సంబంధిత కాంట్రక్టరే నిర్వహించాల్సి ఉంటుందని తేల్చిచెప్పారు.

ఉద్యోగులకు హెల్త్ కార్డ్స్ జారీ చేసేందుకు ప్రభుత్వం సిద్ధంగా ఉంది. వైద్యసేవల కోసం ప్రత్యేకంగా ట్రస్ట్ ఏర్పాటు చేస్తాం. ట్రస్ట్‌లో ఉద్యోగులు, అధికారులు సభ్యులుగా ఉంటారు. సేవలకు ప్రతి ఉద్యోగి నెలకు రూ.500  చొప్పున జమ చేయాల్సి ఉంటుంది. ప్రభుత్వం కూడా సమానంగా జమ చేస్తుంది. ఉద్యోగులకు సంబంధించి పెండింగ్‌లో ఉన్న వాహనాల బిల్లులను చెల్లిస్తాం. అలాగే నెలవారీ బిల్లులకు సంబంధించి ఒక రేట్ ఖరారు చేస్తాం. 

 డిప్యూటీ సీఎం భట్టి

ప్రతినెలా రూ.700కోట్లు

ప్రభుత్వ ఉద్యోగుల పెండింగ్ బిల్లుల చెల్లింపునకు ప్రతినెలా రూ. 700 కోట్లకు తగ్గకుండా బకాయిలు విడుదల చేస్తామని డిప్యూటీ సీఎం హామీ ఇచ్చారు. అలాగే సచివాలయంలో 12.5 శాతానికి సంబంధించి ఉద్యోగులు ఉండాలనే వారి విజ్ఞప్తిని ఆమోదించామన్నారు. మెడికల్  ఇన్‌వ్యాలిడేషన్ కమిటీకీ ఆమోదం తెలిపామని వెల్లడించారు. విశ్రాంత ఉద్యోగులను తిరిగి విధుల్లోకి తీసుకోవద్దనే నిర్ణయించినట్టు చెప్పారు.

గ్రామ పంచాయతీల్లో విధులు నిర్వర్తిస్తున్న సెక్రటరీల కేడర్‌కు సంబంధిం చి, గ్రేడింగ్ ప్రకా రం నిర్ణయం తీసుకుంటామని స్పష్టం చేశారు. డీపీపీ ఆధారంగా ప్రమోషన్లు ఇవ్వాలని నిర్ణయం తీసుకున్నామని తెలిపారు. ఎన్నికల సమయంలో బదిలీ అయిన ఉద్యోగులను వెంటనే  తిరిగి తమ స్థానాల్లోకి తీసుకురావాలనే నిర్ణయం తీసుకున్నామని వివరించారు. నర్సిం గ్ డైరెక్టరేట్ ఏర్పాటుకు ఆమోదం తెలిపామని వెల్లడించారు.