06-06-2025 11:12:55 PM
బెల్లంపల్లి: బెల్లంపల్లి మండలం చంద్రవెల్లి గ్రామపంచాయతీ కార్యాలయంలో శుక్రవారం నిర్వహించిన రెవెన్యూ సదస్సులు గందరగోళం నెలకొంది. సాక్షాత్తు తహసిల్దార్ కృష్ణ సమక్షంలో ఇద్దరు రైతుల మధ్య తలెత్తిన భూవివాదం గొడవకు దారితీసింది. మండలంలోని చిన్నభూధ గ్రామానికి చెందిన మైల రాజు అనే వ్యక్తి తన తల్లి అమృతతో కలిసి గ్రామంలోని 300 సర్వే నంబర్ లో గల వివాదం అవుతున్న తన భూమికి సంబంధించి అధికారులకు దరఖాస్తు పెట్టుకునేందుకు రెవెన్యూ సదస్సుకు వచ్చాడు.
చంద్రవెల్లి గ్రామానికి చెందిన ఉదరి రమేష్ అనే రైతు ఈ భూమి తనదని అధికారులకు దరఖాస్తు చేసుకోబోయాడు. ఈ విషయంలో ఇద్దరు రైతుల మధ్య భూ వివాదం తలెత్తింది. 300 సర్వే నెంబర్ పూదరి రమేష్ వద్ద దాదాపు 7 ఎకరాల వ్యవసాయ భూమిని తమ కుటుంబం కొనుగోలు చేసిందని, దీనిని మార్చి 301 సర్వే నంబర్ లో తమకు పట్టా చేసి ఇచ్చారని రైతు మైల రాజు పేర్కొన్నారు. ప్రస్తుత భూమి 7 ఎకరాలు లేదని, మూడెకరాలు మాత్రమే ఉందని రెవెన్యూ అధికారులకు తాను ఫిర్యాదు చేసేందుకు వచ్చినట్లు రైతు రాజు పేర్కొన్నారు.
ఈ విషయంలో రైతులు మైల రాజు, ఉదరి రమేష్ ల మధ్య వాగ్వాదం జరిగి గొడవకు దారితీసింది. ఒకరిపై ఒకరు చెప్పులతో దాడి చేసుకున్నారు. గ్రామపంచాయతీ కార్యాలయంలో కొట్టుకోవడంతో అధికారుల కోసం వండిన పదార్థాలు చెల్లాచెదరయ్యాయి. తహసిల్దార్ కృష్ణ వెంటనే గొడవ జరుగుతున్న విషయాన్ని పోలీసులకు తెలపడంతో పోలీసులు అక్కడికి చేరుకొని ఇద్దరిని అదుపు చేశారు. రెవెన్యూ సదస్సులో గొడవకు పాల్పడిన రైతులు మైల రాజు, పూదరి రమేష్ లను బైండోవర్ చేయాలని తహసిల్దార్ కృష్ణ పోలీసులను ఆదేశించారు. ఏది ఏమైనా రెవెన్యూ సదస్సులో రైతులు గొడవకు దిగడం గందరగోళ పరిస్థితికి కారణమైంది.