26-06-2025 07:38:38 PM
సహాయ వ్యవసాయ సంచాలకులు సునీత..
హుజురాబాద్ (విజయక్రాంతి): నిషేధిత పురుగుల మందులు అమ్మితే కఠిన చర్యలు తప్పవని హుజురాబాద్ వ్యవసాయ శాఖ సంచాలకులు సునీత(Agriculture Department Director Sunitha) హెచ్చరించారు. కరీంనగర్ జిల్లా హుజరాబాద్ మండలంలోని కందుగుల, చిల్పూర్ గ్రామాల్లో ఫర్టిలైజర్స్ షాపులను గురువారం తనిఖీలు చేశారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ... వాన కాలం సీజన్ కు సంబంధించిన ఎరువులు, విత్తనాలు, పురుగుల మందుల నిలువలపై తీసుకోవాల్సిన జాగ్రత్తల గురించి వివరించారు.
డీలర్లు కాలం చెల్లిన విత్తనాలు, కాలం చెల్లిన పురుగుల మందులు, నిషేధిత పురుగుల మందులు అమ్మకూడదని అమ్మితే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. షాపులో రికార్డులు ఎప్పటికప్పుడు సక్రమంగా నిర్వహిస్తూ స్టాక్ రిజిస్టర్లు రోజువారిగా రాయాలని సూచించారు. షాపు యొక్క మెయిన్ బోర్డ్ పైన డోర్ నెంబర్ లైసెన్స్ యొక్క వివరాలు తప్పక పొందుపరచాలని, వికృత లైసెన్సులు లేకుండా వ్యాపారం చేయకూడదని సూచించారు. ఈ కార్యక్రమంలో మండల వ్యవసాయ విస్తీర్ణ అధికారి భూమి రెడ్డి ఉన్నారు.